covid 3rd wave: మహారాష్ట్రలో జులై-ఆగస్టులో..

కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ధాటికి మహారాష్ట్ర వణికిపోతోంది. ఈ నేపథ్యంలో వచ్చే రెండు నెలల్లో మహారాష్ట్ర థర్డ్‌ వేవ్‌ ప్రభావాన్ని చవిచూడవచ్చని ఆరాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది.

Updated : 30 Apr 2021 13:22 IST

ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోన్న రాష్ట్ర ప్రభుత్వం

ముంబయి: కరోనా వైరస్‌ సెకండ్‌వేవ్‌ ధాటికి మహారాష్ట్ర వణికిపోతోంది. ఈ నేపథ్యంలో వచ్చే రెండు నెలల్లో మహారాష్ట్ర థర్డ్‌వేవ్‌ ప్రభావాన్ని చవిచూడవచ్చని ఆరాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఆ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధం అవుతున్నట్లు పేర్కొంది. ఇప్పటికే సెకండ్‌వేవ్‌ ఉద్ధృతిని అదుపులోకి తెచ్చేందుకు కఠిన ఆంక్షలను అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ నిత్యం 60వేల పాజిటివ్‌ కేసులు, దాదాపు 800 మరణాలు చోటుచేసుకుంటున్నాయి.

దేశంలో కొనసాగుతోన్న రెండో దశ విలయానికి మహారాష్ట్ర వణకిపోతోంది. గత నెల రోజులుగా సెకండ్‌వేవ్‌ తీవ్రత నుంచి కోలుకోలేకపోతున్న మహారాష్ట్రలో జులై-ఆగస్టు నెలలో థర్డ్‌వేవ్‌ విజృంభణ కొనసాగే అవకాశం ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్‌తోపే పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొనసాతుగున్న వైరస్‌ విస్తృతిని బట్టి అంటువ్యాధుల నిపుణులు ఈ అంచనా వేసినట్లు ఆయన వెల్లడించారు. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న సెకండ్‌వేవ్‌ ఉద్ధృతి మే చివరినాటికి గరిష్ఠస్థాయికి చేరుకుంటుందని అంచనా వేశామన్నారు. ఒకవేళ థర్డ్‌వేవ్‌ విజృంభణ కొనసాగితే దాన్ని ఎదుర్కోవడం రాష్ట్ర యంత్రాంగానికి ఒక సవాలేనని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో సవాళ్లు ఎదురైనప్పటికీ థర్డ్‌వేవ్‌ను కూడా ఎదుర్కొనేందుకు రాష్ట్రప్రభుత్వం అన్నివిధాల సన్నద్ధం అవుతున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా రాష్ట్రానికి సరిపడా ఆక్సిజన్ అందుబాటులో ఉంచుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మూడో దశ ఉద్ధృతి సమయంలో ఆక్సిజన్‌ కొరత ఏర్పడినట్లు ఫిర్యాదులు వస్తే సహించేది లేదని అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించామని రాజేష్ తోపే స్పష్టంచేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ తీవ్రతపై ముఖ్యమంత్రితో జరిగిన సమీక్షలో పలు అంశాలు చర్చించామని వెల్లడించారు. రాష్ట్రంలో కొవిడ్‌ విలయం కొనసాగుతున్న వేళ వాణిజ్య, కార్పొరేట్‌  సంస్థలు సామాజిక బాధ్యత కింద కొవిడ్‌ సంబంధిత సేవా కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారని చెప్పారు.

ఇదిలాఉంటే, మహారాష్ట్రలో గతకొన్నిరోజులుగా నిత్యం 65వేల పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. నిన్న ఒక్కరోజే అక్కడ 66,159 కేసులు నమోదు కాగా 771 మంది మృత్యువాతపడ్డారు. ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 3లక్షల 86వేల పాజిటివ్‌ కేసులు, 3498 మరణాలు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని