Uttar Pradesh: నాడు ప్రధాని మోదీపై పోటీ చేసిన గ్యాంగ్‌స్టర్‌.. మళ్లీ ఇప్పుడు వార్తల్లో ఎందుకు..?

2019 ఓ గ్యాంగ్‌స్టర్‌ ప్రధాని నరేంద్రమోదీపై పోటీచేసి చిత్తుగా ఓడిపోయాడు. తాజాగా ఇప్పుడు అతడి పేరు ఓ హత్యకేసులో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. యూపీ పోలీసులు ఇప్పటికే అతడి అనుచరులు ఇద్దర్ని ఎన్‌కౌంటర్‌ చేశారు. 

Updated : 06 Mar 2023 14:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యూపీలో హంతకులపై మరోసారి తుపాకులు గర్జించాయి. ఓ ఎమ్మెల్యే హత్యకేసులోని ముఖ్య సాక్షిని అంతమొందించిన షార్ప్‌షూటర్‌ను యూపీ పోలీసులు నేడు ఎన్‌కౌంటర్‌ చేశారు. బీఎస్పీ ఎమ్మెల్యే రాజ్‌పాల్‌ హత్యకేసులో ప్రధాన సాక్షి అయిన ఉమేశ్‌పాల్‌ను గతనెల 24 వతేదీ సాయంత్రం ప్రయాగ్‌రాజ్‌లో పట్టపగలే హంతకులు కాల్చి చంపారు. ఆయన తన అంగరక్షకులతో కలిసి ఇంటివద్దకు చేరుకోగానే తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఉమేశ్‌ అంగరక్షకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ పరిణామాలు మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్‌వైపు వేలెత్తి చూపాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీని కుదిపేసింది. ‘అహ్మద్‌ వంటి మాఫియా, క్రిమినల్స్‌ని నిర్మూలిస్తాం’ అని యూపీ సీఎం యోగినే సభలో ప్రకటించాల్సి వచ్చింది. అంతేకాదు..  నిందితులపై ప్రభుత్వం రూ.2.5 లక్షల రివార్డు ప్రకటించింది. ఇది జరిగిన రోజుల్లోనే ఉమేశ్‌పాల్‌ హత్యకేసులో ఇద్దరు కీలక  నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు.

తమ్ముడిని ఓడించాడని ఎమ్మెల్యేనే హత్యచేయించినట్లు ఆరోపణలు

ప్రయాగ్‌రాజ్‌(నాటి అలహాబాద్‌) పశ్చిమ స్థానం నుంచి అతీక్‌ అహ్మద్‌ ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004-09 వరకు  ఫూల్‌పూర్‌ ఎంపీగా బాధ్యతలు నిర్వహించాడు. ప్రయాగ్‌రాజ్‌ వ్యవసాయ పరిశోధనశాలలో సిబ్బందిపై దాడి కేసులో 2016 నుంచి గుజరాత్‌లోని ఓ జైల్‌లో ఉన్నాడు. 1989లో అహ్మద్‌ తొలిసారి అలహాబాద్‌ వెస్ట్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాడు. ఆ తర్వాత రెండు ఎన్నికల్లో కూడా విజయం సాధించాడు. 1996లో సమాజ్‌వాదీ పార్టీలో చేరి ఎమ్మెల్యే స్థానం నిలబెట్టుకొన్నాడు. మూడేళ్ల తర్వాత అప్నాదళ్‌లో చేరి 2002 ఎన్నికల్లో విజయం సాధించాడు. 2004లో సమాజ్‌వాదీ టికెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో ఫూల్‌పూర్‌ నుంచి విజయం సాధించాడు. దీంతో అతడు ఎమ్మెల్యేగా ఉన్న అలహాబాద్‌ వెస్ట్‌ నియోజకవర్గంలో సోదరుడు అష్రఫ్‌ను నిలబెట్టాడు. కానీ, బీఎస్పీ అభ్యర్థి రాజుపాల్‌ చేతిలో అష్రఫ్‌ ఓడిపోయాడు. అప్పటి వరకు అతీక్‌ కుటుంబానికి కోటలా ఉన్న ఎమ్మెల్యే నియోజకవర్గం చేజారిపోయింది.

2005 జనవరిలో రాజుపాల్‌ తన సహచరులతో కలిసి ఆసుపత్రి నుంచి తిరిగి వస్తుండగా కొందరు వ్యక్తులు కాల్చిచంపారు. ఈ హత్యలో అష్రఫ్‌ సహా‌, సోదరుడు అతీక్‌, షాహిస్తా పర్వీన్‌ పేర్లు కూడా ఉన్నాయి. ఆ తర్వాత అష్రఫ్‌ ఎన్నికల్లో విజయం సాధించాడు. 2008లో పోలీసుల ఒత్తిడి కారణంగా అతీక్‌ అహ్మద్‌ పోలీసులకు లొంగిపోయాడు. ఆ తర్వాత సమాజ్‌వాదీ టికెట్‌పై విజయం సాధించలేదు. ఆ తర్వాత నుంచి అఖిలేశ్‌ యాదవ్‌ కూడా అతడిని దూరం పెట్టడం మొదలుపెట్టారు.  రాజ్‌పాల్‌ కేసులో ఉమేశ్‌ పాల్‌ ప్రధాన సాక్షి. తాజాగా ఉమేశ్‌ను చంపిన  బృందంలో అర్బాజ్‌ అనే వ్యక్తి అతీక్‌ అహ్మద్‌కు అత్యంత సన్నిహితుడిగా భావిస్తారు. 2006లో ఉమేశ్‌ను అతీక్‌ మనుషులు కిడ్నాప్‌ చేశారు. అప్పట్లో అతీక్‌కు అనుకూలంగా కోర్టులో వాంగ్మూలం ఇవ్వాలని అతడిపై తీవ్ర  ఒత్తిడి చేశారు.

కిడ్నాప్‌ చేయించి.. జైలుకు రప్పించి..

2017లో అతీక్‌ అహ్మద్‌ ప్రయాగ్‌ రాజ్‌లోని ఓ అగ్రికల్చర్‌ యూనివర్శిటీలో సిబ్బందిపై దాడి చేశాడు.  ఈ కేసులో అతడిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి డియోరియా జైల్లో ఉండగా.. ఓ వ్యాపార వేత్తను కిడ్నాప్‌ చేయించి.. జైలుకు తీసుకొచ్చి దాడి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అతడిని బరేలీ జైలుకు.. ఆ తర్వాత 2019లో అహ్మదాబాద్‌ జైలుకు తరలించారు.

2019లో మోదీపై పోటీ.. 855 ఓట్లు..

అతీక్‌ అహ్మద్‌పై పదుల సంఖ్యలో క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఆయన 2019లో వారణాసి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇక్కడ ఆయనకు 855 ఓట్లు మాత్రమే వచ్చాయి. అతీక్‌ అహ్మద్‌ పై మొత్తం 70 వరకు క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని