ఒబామా.. మీరు 6 ముస్లిం దేశాలపై బాంబుల వర్షం కురిపించలేదా?: నిర్మలా సీతారామన్‌

ప్రధాని మోదీ అమెరికా పర్యటన సమయంలో ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా చేసిన వ్యాఖ్యలపై  కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ మండిపడ్డారు. గతంలో ఆరు  ముస్లిం దేశాలపై ఆయన బాంబుల వర్షం కురిపించారని విమర్శించారు.

Updated : 25 Jun 2023 22:02 IST

దిల్లీ: భారత్‌లో మైనార్టీల హక్కులపై అమెరికాలో (USA) ప్రధాని మోదీకి (PM Modi) ఎదురైన ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సమర్థించారు. కానీ, ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా (Barack Obama) వ్యాఖ్యలను మాత్రం ఆమె తీవ్రంగా ఖండించారు. వైట్‌ హౌస్‌లో మోదీ మీడియా సమావేశానికి ముందు ఒబామా ఓ అంతర్జాతీయ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. ‘నేను ప్రధాని మోదీతో మాట్లాడితే.. భారత్‌లోని మైనార్టీ హక్కులు గురించి ప్రస్తావిస్తాను. వారి హక్కులను పరిరక్షించలేకపోతే.. భారత్‌ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది’ అన్నారు. ఈ వ్యాఖ్యలను నిర్మలా సీతారామన్‌ తప్పుబట్టారు. భారత ప్రధాని అమెరికాలో పర్యటిస్తూ అక్కడ తన దేశం గురించి చెబుతున్న సమయంలో ఒబామా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆమె తెలిపారు.

దిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిర్మలాసీతారామన్‌ మాట్లాడుతూ.. ‘‘ ఒబామా వ్యాఖ్యలపై మాట్లాడేందుకు నేను చాలా ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇది రెండు దేశాలతో ముడిపడి ఉన్న అంశం. మేం అమెరికాతో స్నేహం కోరుకుంటున్నాం. కానీ, అక్కడ కూడా భారత్‌లో మతస్వేచ్ఛ, మైనార్టీల హక్కుల గురించి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా హయాంలో ఆరు ముస్లిం దేశాలపై బాంబులతో విరుచుకుపడలేదా? 26,000 బాంబులను ప్రయోగించినట్లు లెక్కలు చెబుతున్నాయి. అలాంటి వ్యక్తి మాటలను ఎవరైనా విశ్వసిస్తారా?’’ అని సీతారామన్‌ వ్యాఖ్యానించారు.

‘సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌ అన్నదే’ కేంద్ర ప్రభుత్వ సిద్ధాంతమని, ఇదే విషయాన్ని ప్రధాని మోదీ కూడా అమెరికాలో నిర్వహించిన  మీడియా సమావేశంలో చెప్పినట్లు  సీతారామన్‌ గుర్తు చేశారు. అంతేగాని మత వివక్ష గురించి ఆయన మాట్లాడలేదన్నారు. కానీ, ఆ చర్చలో పాల్గొన్నవారు మాత్రం ఈ విషయాన్ని పక్కనపెట్టి సమస్యలు కాని వాటిని బూతద్దంలో పెట్టి పెద్దదిగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీకి వచ్చిన దాదాపు 13 విదేశీ అవార్డుల్లో 6 అవార్డులు ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశాల నుంచే వచ్చాయన్నారు. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్‌పైనా నిర్మలాసీతారామన్‌ నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి విధానాలకు వ్యతిరేకంగా తాము గెలవలేమని భావించిన కొందరు.. దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు, అసందర్భ వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్‌కు అలవాటైపోయిందని మండిపడ్డారు.

ఇంతకీ మోదీ ఏం చెప్పారు?

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌(Joe Biden)తో ద్వైపాక్షిక చర్చల అనంతరం జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడిన సంగతి తెలిసిందే. ‘మైనార్టీల హక్కులను మెరుగుపరచడానికి భారత్  ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది?’ అని ఓ పాత్రికేయుడు ప్రశ్నించారు. దానికి ప్రధాని బదులిస్తూ ‘మనమంతా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యం మన రక్తంలో నిండిపోయింది. దానినే మనం శ్వాసిస్తున్నాం. అది మన రాజ్యాంగంలోనే ఉంది. మానవ విలువలు, హక్కులు లేకపోతే.. ప్రజాస్వామ్యం అనేదే ఉండదు. మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నప్పుడు.. వివక్ష అనే ప్రశ్నే ఉండదు’ అని ప్రధాని స్పష్టం చేశారు. సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్, సబ్‌ కా విశ్వాస్‌ అనే నినాదం మీదే తమ ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. మతం, కులం, వయసు, ప్రాంతంతో సంబంధం లేకుండా  ప్రతి ఒక్కరికీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు