Odisha Train Tragedy: 300 ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, 200 అంబులెన్సులు.. రెస్క్యూ ఆపరేషన్‌ సాగిందిలా..!

భారత రైల్వే చరిత్రలోనే దారుణ ఘటనల్లో ఒకటిగా నిలిచిన ఒడిశా రైలు ప్రమాదంలో (Odisha Train Tragedy) బాధితులను రక్షించేందుకు భారీ రెస్క్యూ ఆపరేషన్‌ (Rescue Operation) చేపట్టారు.

Updated : 03 Jun 2023 14:42 IST

కోల్‌కతా: ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో (Odisha Train Tragedy) సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. దేశ రైల్వే (Indian Railways) చరిత్రలోనే అత్యంత దారుణ ఘటనల్లో ఒకటిగా నిలిచింది. శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరగగా.. విపత్తు నిర్వహణ సిబ్బందితోపాటు (NDRF) వైద్య బృందాలు, అంబులెన్సులు సహా ఇతర విభాగాలు వేగంగా స్పందించాయి. భారత సైన్యం (Indian Army), వాయుసేన (Air Force) బృందాలు కూడా రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. క్షతగాత్రులను వీలైనంత తొందరగా బయటకు తీయడంతోపాటు వారిని సమీప ఆస్పత్రులకు తరలించాయి. శనివారం మధ్యాహ్నానికి సహాయక చర్యలు దాదాపు పూర్తయినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్‌ జరిగిన తీరును పరిశీలిస్తే..

  • బెంగళూరు- హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు ఓ గూడ్స్‌ రైలు ఒకేచోట ఈ ప్రమాదానికి గురయ్యాయి.
  • భువనేశ్వర్‌కు 170 కి.మీ, కోల్‌కతాకు 250 కి.మీ దూరంలో బాలేశ్వర్‌ జిల్లాలో శుక్రవారం సాయంత్రం 6.55 గంటలకు ఈ పెను ప్రమాదం చోటుచేసుకుంది.
  • ప్రమాద సమాచారం అందిన వెంటనే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు రంగంలోకి దిగాయి. రాత్రి 8.30 నాటికి బాలేశ్వర్‌లోని తొలి బృందం అక్కడకు చేరుకుంది. అనంతరం కటక్‌, కోల్‌కతా నుంచి మరిన్ని బృందాలు వచ్చాయి. మొత్తం 300 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్టీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
  • తొమ్మిది బృందాలుగా ఏర్పడి క్షతగాత్రులను బయటకు తీసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ప్రాణాలతో ఉన్నవారిని గుర్తించి వారిని తొలుత కాపాడారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ జాగిలాలు, మహిళా సిబ్బందితోపాటు వైద్య బృందాలు ఇందులో పాలుపంచుకున్నాయి.
  • భారీ క్రేన్లు, గ్యాస్‌, ప్లాస్మా కట్టింగ్‌ యంత్రాలతో రైలు కోచ్‌లను విడదీస్తూ అందులో ఇరుక్కుపోయిన వారిని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు బయటకు తీసేందుకు శ్రమించాయి. అనంతరం లిఫ్టింగ్‌ ప్యాడ్‌లతో వారిని సమీప ప్రాంతానికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స నిర్వహించాయి.
  • రైల్వే కోచ్‌లలో ఇరుక్కుపోయిన 44 మంది బాధితులను రక్షించడంతోపాటు 71 మృతదేహాలను ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు బయటకు తీశాయి. ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు ఎలా స్పందించాలనే విషయంపై ఈ ఏడాదిలో దాదాపు 55 సార్లు మాక్‌ డ్రిల్‌లు చేపట్టామని ఎన్డీఆర్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ అతుల్‌ కార్వాల్‌ వెల్లడించారు.
  • ఘటన తీవ్రమైనది కావడంతో ఇతర విభాగాలూ వేగంగా స్పందించాయి. 200 అంబులెన్సులు, 50 బస్సులు ఘటనా స్థలానికి చేరుకోవడంతోపాటు 45 మొబైల్‌ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 1200 మంది రెస్య్కూ సిబ్బంది సాయంతో గాయపడిన వారిని వివిధ ఆస్పత్రులకు తరలించారు.
  • కటక్‌నుంచి 25 వైద్య బృందాలతోపాటు మరో 50 మంది వైద్యులు ఇందులో పాల్గొన్నారు. వీరికితోడు ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ నిపుణులు కూడా సహాయక చర్యల్లో భాగమయ్యారు.
  • ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో భారత వాయుసేన కూడా పాలుపంచుకుంది. తీవ్ర గాయాలపాలైన వారికోసం వైద్య బృందాలతో కూడిన రెండు ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్ల (ఎంఐ 17)ను రంగంలోకి దించింది.
  • భారత సైన్యం ఆరోగ్య సిబ్బంది కూడా.. అంబులెన్సులు, ఇతర సామగ్రితో గాయపడిన వారికి చికిత్స అందించారు. మరోవైపు బాధితులకు నీరు, టీ, ఆహార పొట్లాలను అందించేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు.
  • ఇలా దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన ఒడిశా రైలు ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని