Modi: కొవిడ్‌ కలవరం.. నేడు మోదీ కీలక భేటీ

దేశంలో కొత్త రకం ఒమిక్రాన్‌ వైరస్‌ కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది.

Updated : 22 Dec 2022 10:02 IST

దిల్లీ: చైనా (China) సహా పలు దేశాల్లో మళ్లీ కరోనా (Corona Virus) మహమ్మారి విజృంభిస్తుండటంతో భారత్‌లోనూ ఆందోళన మొదలైంది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికే రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా రంగంలోకి దిగారు. దేశంలో కొవిడ్‌ తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ (Modi) గురువారం మధ్యాహ్నం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సహా ఇతర ఉన్నతాధికారులు దీనిలో పాల్గొననున్నారు.

దేశంలో కొవిడ్ (Covid) పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ బుధవారం సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. కొవిడ్‌ పూర్తిగా అంతరించిపోలేదని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఈ సందర్భంగా సూచించింది. కొత్త వేరియంట్లు వస్తుండడం, పండుగలు సమీపిస్తుండడంతో కేసులపై ఓ కన్నేసి ఉంచాలని అధికారులను ఆదేశించింది. రద్దీ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని ప్రజలను సూచించింది. చైనా సహా కరోనా కేసులు అధికంగా ఉన్న దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే పరీక్షలు నిర్వహించాలని ఆదేశించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

చైనాలో కరోనా మళ్లీ విశ్వరూపం చూపుతున్న బీఎఫ్‌.7 (BF.7 ) రకానికి చెందిన ఒమిక్రాన్‌ (Omicron) వైరస్‌ భారత్‌లోనూ వెలుగు చూసింది. దేశంలో ఈ రకానికి చెందిన కేసులు నాలుగు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం అప్రమత్తమైంది. అయితే ప్రస్తుతానికి దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉన్నప్పటికీ.. కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 185 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. క్రియాశీల కేసుల సంఖ్య 3,402గా ఉంది. రికవరీ రేటు 98.80శాతంగా ఉండటం ఊరటనిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని