Covid Vaccine: కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ మార్కెట్‌ విక్రయానికి గ్రీన్‌సిగ్నల్‌

కొవిడ్‌ నివారణకు మన దేశంలో అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలకు మార్కెట్‌లో విక్రయానికి ఆమోదం లభించింది. ఈ రెండు టీకాలకూ కొన్ని షరతులతో.......

Published : 27 Jan 2022 16:33 IST

దిల్లీ: కొవిడ్‌ నివారణకు మన దేశంలో అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌లను బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు అవసరమైన సాధారణ అనుమతులను భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) మంజూరు చేసింది. కొన్ని షరతులకు లోబడి ఈ రెండు టీకాల విక్రయానికి అనుమతి ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. న్యూడ్రగ్స్‌ అండ్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ రూల్స్‌-2019 కింద రెగ్యులర్‌ మార్కెట్లో అనుమతులు ఇచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న క్లినికల్‌ ట్రయల్స్‌ సమాచారం, ప్రొగ్రమాటిక్‌ సెట్టింగ్‌ కోసం సరఫరా చేసిన టీకాల సమాచారాన్ని ఆయా సంస్థలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతికూల ప్రభావాలపైనా పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టంచేశారు. ప్రతి ఆరు నెలలకొకసారి సేఫ్టీ డేటాను అందజేయాలని డీసీజీఐ నిపుణుల కమిటీ సూచించింది. అయితే, ఈ రెండు వ్యాక్సిన్లు అన్ని దుకాణాల్లో అందుబాటులోకి రావనీ.. ప్రజలు వీటిని కేవలం ఆసుపత్రులు, క్లినిక్‌ల నుంచి మాత్రమే పొందగలుగుతారని ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ టీకాలు ఎప్పట్నుంచి అందుబాటులో ఉంటాయనే అంశంపై  పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. 

అయితే, గత ఏడాది అక్టోబర్‌ 25న కొవిషీల్డ్‌ను అభివృద్ధి చేసిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థలు బహిరంగ విపణిలో విక్రయించుకునేందుకు అనుమతి కోరుతూ డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ)కు దరఖాస్తు చేసుకుంది. కొన్ని వారాల క్రితం భారత్‌ బయోటెక్‌ సంస్థ కూడా తమ టీకా కొవాగ్జిన్‌కు ఇదే తరహా అనుమతివ్వాలంటూ సంబంధిత పత్రాలను డీసీజీఐకు సమర్పించింది. ఈ నెల 19న కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థలోని కొవిడ్‌-19 నిపుణుల కమిటీ కూడా ఈ దరఖాస్తులపై సానుకూలంగా స్పందించింది. షరతులతో కూడిన అనుమతులివ్వొచ్చని సిఫార్సు చేసింది.  మరోవైపు, వీటి ధరలను సామాన్యులకు అందుబాటులో ఉంచాలని నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌పీపీఏ) భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఒక్కో డోసు ధరను రూ.275కు పరిమితం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికి అదనంగా సర్వీసు ఛార్జీ కింద మరో రూ.150 చెల్లించాల్సి ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవాగ్జిన్‌ డోసు ధర రూ.1200 ఉండగా.. కొవిషీల్డ్‌ డోసు రూ.780గా ఉంది. దీనికి రూ.150 సర్వీసు ఛార్జీ అదనం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని