SC: అగ్నిపథ్‌పై పిటిషన్లు.. వచ్చే వారం విచారించనున్న సుప్రీం

దేశవ్యాప్తంగా విమర్శలకు దారితీసిన అగ్నిపథ్‌ పథకంపై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సోమవారం సుప్రీంకోర్టు అంగీకరించింది.

Updated : 04 Jul 2022 12:49 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా విమర్శలకు దారితీసిన అగ్నిపథ్‌ పథకంపై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సోమవారం సుప్రీంకోర్టు అంగీకరించింది. వచ్చేవారం దీనిపై వాదనలు విననున్నట్లు వెల్లడించింది. యువత సాయుధ బలగాల్లో స్వల్పకాలం సేవలందించే నిమిత్తం కేంద్రం గత నెల అగ్నిపథ్‌ పథకాన్ని తీసుకువచ్చింది. 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య వయస్కులు ఈ ఉద్యోగాలకు అర్హులు. అయితే ఈ ఏడాదికి ఆ పరిమితిని 23 ఏళ్లకు పెంచింది. ఎంపికైన వారు అగ్నివీరులుగా నాలుగేళ్లపాటు సేవలు అందిస్తారు. తర్వాత 25 శాతం మంది శాశ్వత కేడర్‌కు ఎంపికవుతారని చెప్పింది. మిగిలిన 75 శాతం మంది పెన్షన్ లేకుండా రిలీవ్‌ కానున్నారు. అయితే రిలీవ్‌ సమయంలో కేంద్రం వారికి కొంత మొత్తం ఇవ్వనుంది. కరోనా కారణంగా రెండేళ్లుగా సైనిక ఉద్యోగ నియామకాల కోసం ఎదురుచూస్తోన్న అభ్యర్థులను ఈ ప్రకటన మెప్పించలేదు. దాంతో దేశవ్యాప్తంగా నిరసనలు, విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వైమానిక దళ అభ్యర్థుల తరఫున పిటిషన్ దాఖలైంది. ఆ అభ్యర్థులు ప్రస్తుతం శిక్షణ పొందారని, వారు అపాయింట్‌మెంట్‌ కోసం వేచి చేస్తున్నారని వారి తరఫు న్యాయవాది వెల్లడించారు. ఈ సమయంలో వారు ఉద్యోగంలో ఉండే కాలం.. 20 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలకు తగ్గిపోనుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘ఇది చాలా ముఖ్యమైన విషయం. దీనిపై సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపించండి. ఎంతోమంది అభ్యర్థుల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి’ అని అభ్యర్థించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని