Shah Rukh Khan: షారుక్‌కు బాలీవుడ్‌ ప్రముఖుల అండ

గోవా నౌక డ్రగ్స్‌ కేసులో కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ (23) జైలుపాలై కష్టాల్లో ఉన్న హిందీ సినిమాల సూపర్‌స్టార్‌ షారుక్‌ఖాన్‌కు పలువురు బాలీవుడ్‌

Published : 11 Oct 2021 09:42 IST

కుమారుడి డ్రగ్స్‌ కేసు నుంచి బయటపడతారన్న భరోసా

ముంబయి: గోవా నౌక డ్రగ్స్‌ కేసులో కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ (23) జైలుపాలై కష్టాల్లో ఉన్న హిందీ సినిమాల సూపర్‌స్టార్‌ షారుక్‌ఖాన్‌కు పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు అండగా నిలిచారు. కష్టాన్ని నమ్ముకొని పైకెదిగిన షారుక్‌ ఈ ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకొని నిలబడతారని వారు తమ మద్దతు తెలిపారు. కాంగ్రెస్‌ నేత, సీనియర్‌ నటుడు రాజ్‌బబ్బర్‌ ‘ఓ యోధుని కుమారుడు యోధుడిలాగే బయటికి వస్తాడు’ అని ట్వీట్‌ చేశారు. మరో నటుడు శేఖర్‌ సుమన్‌ స్పందిస్తూ.. ‘11 ఏళ్ల నా కుమారుడు మరణించినపుడు పరిశ్రమ నుంచి నా వద్దకు వచ్చి పరామర్శించిన ఒకే వ్యక్తి షారుక్‌. ఆయన పరిస్థితి తలచుకుంటే చాలా బాధగా ఉంది’ అని ట్వీట్‌ చేశారు. దర్శకుడు అశ్విన్‌ చౌధరి, సంగీత దర్శకుడు విశాల్‌ దదలానీ సైతం షారుక్‌కు తమ మద్దతు తెలిపారు. హృతిక్‌ రోశన్, జోయా అఖ్తర్, ఫరా ఖాన్, హన్సాల్‌ మెహతా, రవీనా టాండన్, పూజాభట్, సుచిత్రా కృష్ణమూర్తి, సోమి అలి, హాస్యనటుడు జానీ లీవర్‌ తదితరులు ఇప్పటికే తమ సహనటుడికి అండగా ఉంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. 

మరోవైపు.. శనివారం సాయంత్రం షారుక్‌ఖాన్‌ డ్రైవరు వాంగ్మూలం నమోదు చేసిన ఎన్సీబీ అధికారులు అదే రోజు రాత్రి ముంబయిలో పలుచోట్ల దాడులు జరిపి, శాంతాక్రజ్‌ ప్రాంతానికి చెందిన శివరాజ్‌ రామదాసును అరెస్టు చేశారు. నిర్మాత ఇంతియాజ్‌ ఖత్రి ఇల్లు, ఆఫీసులను తనిఖీ చేశారు. ఆయన్ను విచారించిన అనంతరం.. సోమవారం మళ్లీ తమ ముందు హాజరుకావలసిందిగా కోరారు. 

*  ఆదివారం మరో నైజీరియన్‌ను ఎన్సీబీ అధికారులు అరెస్టు చేయడంతో ఈ కేసులో ఇద్దరు విదేశీయులతో కలిపి మొత్తం అరెస్టయినవారి సంఖ్య 20కు చేరింది. ఈ కేసులో తాజాగా మరో విషయం బయటపడింది. ఓ మహిళా నిందితురాలు.. శానిటరీ న్యాప్‌కిన్స్‌ ద్వారా నౌకలోకి డ్రగ్స్‌ తీసుకెళ్లినట్లు తెలిసింది. 5 గ్రాముల పిల్స్‌ రూపంలో ఉన్న ఈ డ్రగ్స్‌ను ఎన్‌సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని