
ప్రముఖ గాంధేయవాది దొరైస్వామి కన్నుమూత
బెంగళూరు: ప్రముఖ గాంధేయవాది, స్వాతంత్ర్య పోరాట యోధుడు హెచ్ఎస్ దొరైస్వామి కన్నుమూశారు. 103 ఏళ్ల దొరైస్వామి అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులోని జయదేవ ఊపిరిత్తుల వ్యాధుల ఆసుపత్రిలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఈ నెల 8న కరోనా సోకగా ఇదే ఆసుపత్రిలో చేరారు. మే 13న కోలుకుని ఇంటికి చేరుకున్నారు. అయితే మరుసటి రోజు నీరసంగా ఉందని తెలపడంతో ఆయనను మళ్లీ ఆసుపత్రిలో చేర్చారు. దొరైస్వామి ఆస్తమా, ఊపిరిత్తుల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.
దొరైస్వామి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని 14 నెలలు జైలు జీవితం గడిపారు. ఎమర్జెన్సీ కాలంలో ఆందోళన చేస్తానని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి లేఖ రాయడంతో ఆయనను 4 నెలలు జైలులో ఉంచారు. గనుల మాఫియా, భూ కబ్జాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. దేశంలో కరోనా మహమ్మారి ప్రవేశించే వరకు ఆయన ప్రజా ఉద్యమాల్లోనే ఉన్నారు. దొరైస్వామి మృతిపట్ల కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సంతాపం ప్రకటించారు.