పవన్‌ కొత్త చిత్రం: అదిరే కాంబినేషన్‌!

అగ్రకథానాయకుడు పవన్‌కల్యాణ్‌ సినిమాల విషయంలో జోరు పెంచారు. దాదాపు మూడేళ్ల తర్వాత ‘వకీల్‌సాబ్‌’తో రీఎంట్రీ ఇస్తున్న ఆయన.. క్రిష్‌, హరీశ్‌ శంకర్‌తోపాటు సాగర్‌ కె.చంద్ర ప్రాజెక్ట్‌లతో రానున్న రోజుల్లో మరింత బిజీగా మారనున్నారు.

Updated : 21 Dec 2020 14:34 IST

‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌ అప్‌డేట్‌ అదుర్స్‌

హైదరాబాద్‌: అగ్రకథానాయకుడు పవన్‌కల్యాణ్‌ సినిమాల విషయంలో జోరు పెంచారు. దాదాపు మూడేళ్ల తర్వాత ‘వకీల్‌సాబ్‌’తో రీఎంట్రీ ఇస్తున్న ఆయన.. క్రిష్‌, హరీశ్‌ శంకర్‌తోపాటు సాగర్‌ కె.చంద్ర ప్రాజెక్ట్‌లతో రానున్న రోజుల్లో మరింత బిజీగా మారనున్నారు. మరోవైపు అభిమానులు సైతం పవన్‌ సినిమాల సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో పవన్‌ నటించనున్న సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్‌డేట్‌ను చిత్రబృందం సోమవారం అభిమానులతో పంచుకుంది.

‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మరో కీలక పాత్రకు యువ నటుడు రానాను చిత్ర బృందం ఎంపిక చేసింది. ఈ పాత్ర కోసం ఇప్పటికే సుదీప్‌, విజయ్‌సేతుపతి, రానా పేర్లు విస్తృతంగా వినిపించగా, చివరకు ఆ అవకాశం రానాను వరించింది. ఈ మేరకు టీమ్‌లోకి రానాకు ఆహ్వానం పలుకుతూ చిత్రబృందం తాజాగా ఓ స్పెషల్‌ వీడియోను పంచుకుంది. ‘ఓ అద్భుతమైన ప్రయాణం నేటి నుంచి ప్రారంభం! పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ గారుతో మేము తెరకెక్కించనున్న చిత్రంలోకి మన భళ్లాలదేవుడు రానాకు స్వాగతం పలుకుతున్నాం.’ అని చిత్రబృందం పేర్కొంది. మరోవైపు పవన్‌ సినిమాలో భాగమైనందుకు రానా సంతోషం వ్యక్తం చేశారు. ‘మరో ప్రయాణం ప్రారంభమైంది!! ఇప్పటివరకూ పలు పరిశ్రమలకు చెందిన ఎంతోమంది స్టార్స్‌తో కలిసి పనిచేశాను. కానీ ఇప్పుడు మన పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌తో కలిసి స్క్రీన్‌ పంచుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. సెట్స్‌లోకి అడుగుపెట్టేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు ధన్యవాదాలు’ అని రానా ట్వీట్‌ చేశారు. దీంతో మరో క్రేజీ కాంబోను తెలుగు ప్రేక్షకులు చూడబోతున్నారు.

 

ఇవీ చదవండి..

 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని