ఇది ఇంకెవరికైనా సాధ్యమా..?: నమ్రత

ప్రస్తుతం విదేశాల్లో విహరిస్తోంది టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కుటుంబం. తమ అనుభవాలను సామాజిక మాధ్యమాల వేదికగా ఫొటోలతో అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. తాజాగా..

Published : 18 Nov 2020 01:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం విదేశాల్లో విహరిస్తోంది టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కుటుంబం. తమ అనుభవాలను సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటూనే ఉంది. తాజాగా విమానాశ్రయంలో వేచి చూస్తున్న మహేశ్‌బాబు ఫొటోను ఆయన సతీమణి నమత్ర అభిమానులతో పంచుకున్నారు. ఆ పోస్టులో ‘తెల్లవారుజామున 3 గంటలకు ఎవరైనా ఇలా కనిపిస్తారా..! ఎవరికైనా ఇది సాధ్యమా..? మనతో ఒక అందమైన వ్యక్తి ఉండి.. విమానం కోసం వేచి చూస్తున్నప్పుడు సమయం కూడా రెక్కలు కట్టుకొని గాల్లోకి ఎగురుతుంది’ అని ఆమె పేర్కొన్నారు. అయితే.. ఆ పోస్టుకు స్పందించిన మహేశ్‌బాబు సోదరి మంజుల ‘మీ భర్తకు సాధ్యమే’ కామెంట్‌ చేశారు.

కరోనా మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమలో సినిమాల చిత్రీకరణకు అడ్డుకట్ట పడింది. ఆ తర్వాత ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. ఇప్పుడిప్పుడే సినీ నటులు తిరిగి మేకప్‌ వేసుకుంటున్నారు. అయితే.. మహేశ్‌బాబు మాత్రం ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. తీరికలేని సినిమాలతో బిజీగా ఉండే ప్రిన్స్‌ ప్రతి సినిమా ప్రారంభానికి ముందు తన కుటుంబంతో గడిపేందుకు సమయం కేటాయిస్తుంటారు. ప్రస్తుతం మహేశ్‌బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు. ‘గీత గోవిందం’ ఫేమ్‌ పరశురామ్‌ డైరెక్టర్‌. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ పోస్టర్‌లో చెవి పోగు, మెడపై రూపాయి టాటూతో మహేశ్‌ సరికొత్తగా కనిపించారు. దీంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని