Tamannaah: ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా

ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఓ హీరోయిన్‌ని ప్రశంసించారు తమన్నా. ఆమె ఎవరంటే?

Published : 29 Apr 2024 00:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమన్నా, రాశీఖన్నా కలిసి నటించిన తాజా చిత్రం ‘బాక్‌’ (Baak). ‘అరణ్మనై’ (Aranmanai) సిరీస్‌లో 4వ సినిమా ఇది. కోలీవుడ్‌ దర్శకుడు సుందర్‌ సి (Sundar C). ప్రధాన పాత్ర పోషిస్తూ స్వయంగా తెరకెక్కించారు. మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ఆదివారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఆ ఇద్దరు హీరోయిన్లతోపాటు ఖుష్బూ, కోవై సరళ తదితరులు హాజరయ్యారు.

ఇలాంటి వ్యక్తిని చూడలేదు: తమన్నా

‘‘ఇంతకు ముందు నేను సుందర్‌ దర్శకత్వంలో ‘యాక్షన్‌’ చిత్రంలో నటించా. ‘బాక్‌’లోనూ కొంత యాక్షన్‌ ఉంది. ప్రోమో సాంగ్‌ ‘అయ్యయ్యో’ మీ అందరికీ నచ్చిందా..? ఆ పాటలో ఉన్న గ్లామర్‌ సినిమాలో కనిపించదు. అది ప్రచారం కోసం చిత్రీకరించిన సాంగ్‌ మాత్రమే. సుందర్‌ సర్‌ ఎప్పుడూ మహిళా పాత్రలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. విమెన్‌ పవర్‌ని సెలబ్రేట్‌ చేస్తారు. ఆయన ప్రతిభ ఎలాంటిదో ట్రైలర్‌ చూస్తేనే అర్థమవుతుంది. రాశీఖన్నాతో కలిసి గతంలో ‘బెంగాల్‌ టైగర్‌’ (రవితేజ హీరో) చిత్రంలో నటించా. ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు. నిజాయతీగా పనిచేస్తుంది. కోవై సరళ మేడమ్‌ని ఇంకా మరిన్ని చిత్రాల్లో చూడాలని కోరుకుంటున్నా’’ అని తమన్నా పేర్కొన్నారు.

స్క్రిప్టు వినకుండా..!: రాశీఖన్నా

‘‘సుందర్‌ సర్‌ తెరకెక్కించిన ‘అరణ్మనై’ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. నాకూ హారర్‌ సినిమాలంటే ఇష్టం. అందుకే సుందర్‌ కాల్‌ చేసి ‘బాక్‌’లో నటిస్తావా? అని అడిగారు. స్క్రిప్టు కూడా వినకుండా నటిస్తానని చెప్పా. సాంకేతిక బృందం ఈ సినిమాకి ప్రధాన బలం. ఇందులో తమన్నా చాలా కొత్తగా కనిపిస్తుంది’’ అని రాశీఖన్నా తెలిపారు.

ఆయనకు నేనే స్ఫూర్తి: ఖుష్బూ

‘‘నా భర్తకు ఆరోగ్యం బాగోలేదు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అందుకే ఇక్కడికి రాలేకపోయారు. మీ అందరికీ సారీ చెప్పమన్నారు. నన్ను స్ఫూర్తిగా తీసుకుని ఆయన దెయ్యాల సినిమాలను తెరకెక్కిస్తున్నారు (నవ్వుతూ). ‘బాక్‌’ని చూశా. చాలా బాగుంది. విజయం అందుకుంటుందనే నమ్మకం ఉంది. బాక్‌ అంటే ఏంటో మూవీ చూస్తే అర్థమవుతుంది’’ అని ఖుష్బూ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని