manasantha nuvve: 20 వసంతాల మనసంతా నువ్వే.. ఈ విశేషాలు తెలుసా?

మనసంతా నువ్వే విడుదలై నేటికి 20 ఏళ్లు

Updated : 19 Oct 2021 17:38 IST

‘తూనీగ..తూనీగ..’ అంటూ  ప్రేమకథతో కుర్రకారు గుండెల్ని తొలిచేసిన సినిమా ‘మనసంతా నువ్వే’.  ఉదయ్‌కిరణ్‌ని స్టార్‌గా మరో మెట్టు ఎక్కించిన చిత్రమిది. ప్రేమకథల్లో నూతన ఒరవడిని సృష్టించి,  ట్రెండ్‌సెట్టర్‌లా నిలిచిందీ సినిమా. ‘మనసంతా నువ్వే’ విడుదలై నేటికి 20 ఏళ్లు. ఈ సందర్భంగా సినిమా గురించి ఆసక్తికర విశేషాలు..

ట్రెండ్‌ మార్చాలని 

నిర్మాత యం.యస్‌ రాజు నిర్మించిన ‘దేవీపుత్రుడు’ 2001 సంక్రాంతికి విడుదలై ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దీనికన్నా ముందు ‘దేవీ’ తీశారు. రెండు ఒకరకమైన సినిమాలు కావడంతో, ఇక  రూట్‌ మార్చాలని నిర్ణయానికొచ్చారాయన. అందమైన ప్రేమకథతో అదిరిపోయే సినిమా తీయాలని తహతహలాడిపోయారు. చాలామంది దర్శకులను అనుకున్నారు. కొత్త దర్శకుడైతేనే బాగుంటుందని కెమెరామేన్‌ ఎస్‌. గోపాల్‌రెడ్డికి తన మనసులో మాట చెప్పారు. ఆయన వెంటనే జయంత్‌ సి.పర్జానీ, సింగీతం శ్రీనివాస్‌ల దగ్గర చేసిన కత్తిలాంటి కుర్రాడున్నాడని ఫోన్‌ నంబరిచ్చారు. ఆ చాకులాంటి కుర్రాడే ‘మనసంతా నువ్వే’  దర్శకుడు వి.ఎన్‌. ఆదిత్య. 


అలా మొదలైంది

అంత పెద్ద నిర్మాత నుంచి పిలుపు రావడం వి.ఎన్‌.ఆదిత్య నమ్మలేకపోయారు. నాలుగైదు సార్లు ఫోన్‌ చేసిన వెళ్లేందుకు ధైర్యం చాల్లేదాయనకి. చివరిసారి ఫోన్‌ రావడంతో ఇక వెళ్లక తప్పలేదు. ధైర్యం చేసి సుమంత్‌ ఆర్ట్స్‌ ఆఫీసుకి వెళ్లారు. ఎం.ఎస్‌. రాజుని కలిస్తే తన దగ్గరున్న ఒక ఐడియాను పంచుకున్నారు. ‘ప్రేమించుకుందాం రా’ కథలా ఉంది. దానికి అసోసియేట్‌ డైరెక్టర్‌గా పని చేశాను. చేసిన కథనే మళ్లీ తీయాలేను సర్‌’ అని వి.ఎన్‌. ఆదిత్య మొహం మీదే చెప్పేశాడు. ఆ ముక్కుసూటితనం నచ్చి తను అనుకున్న అసలు కథను వినిపించాడు. ఆ పాయింట్ వినగానే మొహం బల్బులా వెలిగింది.  తెగ నచ్చేసింది. వెంటనే సినిమా చేసేందుకు అంగీకరించాడు. అలా ‘మనసంతా నువ్వే’ మొదలైంది. 


ఎడిటింగ్ మాయ

 కొద్దిరోజులకే ఉదయ్‌ కిరణ్‌ హీరోగా ‘మనసంతా నువ్వే’ సినిమాను ప్రకటించారు నిర్మాత. అప్పుడే మరో పెద్ద చిక్కొచ్చిపడింది. ఈ స్ర్కిప్ట్‌ చదివిన పరుచూరి బ్రదర్స్‌ కథ ఏమాత్రం బాగోలేదన్నారు. దీంతో మళ్లీ  కథా చర్చలు మొదలయ్యాయి. యం.ఎస్‌. రాజు, వి.ఎన్‌. ఆదిత్య, వీరూపోట్ల, పరిచూరి బ్రదర్స్‌ కలిసి కథకు కొత్తరూపం తీసుకొచ్చారు. శిల్పంలా చెక్కి అద్భుతమైన కథగా మారిన తర్వాత కానీ వారికి సంతృప్తి దొరకలేదు. పదిరోజుల్లో సెట్స్‌ మీదకు వెళ్లింది. నాలుగు నెలల్లోనే సినిమా అంతా పూర్తయింది.  షూటింగ్‌ అయిపోయాక మళ్లీ అందరి మొహాల్లో నిరాశ. క్లైమాక్స్‌ సరిగా పేలట్లేదని ఎడిటింగ్ రూం నుంచి బయటకొచ్చేశారు. ఇదంతా వింటున్న ఎడిటర్‌ కె.వి. కృష్ణారెడ్డి కాస్త మార్పులు చేసి.. ‘మళ్లీ ఓసారి చూడండి’ అని క్లైమాక్స్‌ చూపించారు. సినిమా ఆరంభంలో వచ్చే ‘నీ స్నేహం’ పాటను  తిరిగి క్లైమాక్స్‌లో పెట్టడం భలే కుదిరింది. ఆనందంతో ఎగిరి గంతులేశారు. అదే ఏడాది దసరాకు విడుదల చేశారు. తెలుగు చిత్రసీమలో సరికొత్త ట్రెండ్‌ సృష్టించింది.


ఇదీ కథ

సినిమా కథ అరకు లోయలో మొదలవుతుంది. అను సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి. చంటిది నిరుపేద కుటుంబం. వీరిద్దరూ బాల్యంలో మంచి స్నేహితులవుతారు. ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఈ స్నేహం అను వాళ్ల నాన్నకు నచ్చదు. ఒకరోజు వాళ్ల నాన్నకి బదిలీ అవడంతో అను కుటుంబం ఊరు విడిచి వెళ్లిపోతుంది. విడిపోయే ముందు గుర్తుగా ఒక గడియారాన్ని చంటికికానుకగా ఇస్తుంది. కొన్నాళ్లకు తల్లి కూడా చనిపోవడంతో అనాథగా మారతాడు చంటి. మోహన్‌రావు దంపతులు చంటిని చేరదీసి కొత్త జీవితమిస్తారు. వేణు అని పేరు మారుస్తారు. విదేశాల్లో చదువు పూర్తిచేసుకొని ఇండియాకి తిరిగొచ్చాక చంటికోసం అను వెతుకుతుంది. ఎక్కడా చిన్ననాటి ప్రియుడి జాడ దొరకదు. దీంతో వారి ప్రేమకథనే రేణు అనే కలం పేరుతో ఓ మ్యాగజైన్‌ ‘మనసంతా నువ్వే’ సీరియల్‌గా రాస్తుంది.  అది సూపర్‌హిట్‌ అవుతుంది. వేణు చెల్లెలి ద్వారా అనుతో పరిచయం ఏర్పడుతుంది. ఓ సందర్భంలో  వేణు మరెవరో కాదు చంటినే అని అనుకి తెలుస్తుంది. అసలు వివరాలు చెప్పకుండా స్నేహం చేస్తుంది. ‘మనసంతా నువ్వే’ సీరియల్‌ చదివిన తర్వాత చిన్ననాటి ప్రేయసి అనునే అన్న విషయం చంటికి తెలుస్తుంది.  వీరిద్దరి మధ్య అను వాళ్ల నాన్న విలన్‌లా మళ్లీ ప్రవేశిస్తాడు. అన్ని అడ్డంకులు దాటుకొని చివరకు వీరిద్దరూ ఒక్కటవడంతో ఈ ప్రేమకథ సుఖాంతం అవుతుంది. 


మలయాళం నుంచి బాణీ

సినిమా విజయంలో ‘తూనీగ..తూనీగ’ పాటకి భాగముంది. అంతగా హిట్టైన గీతమది. బాల్యంలో వచ్చే ప్రేమకథకు ఆయువుపట్టులాంటి పాట.  అయితే ఈ ట్యూన్‌ ఆర్పీపట్నాయక్‌ సొంతగా చేసింది కాదు.  మలయాళ చిత్రం ‘ప్రణయవమంగళ్’లోని  “కన్నాడీ కూడుమ్ కూట్టి” గీతం నుండి తీసుకున్నారు. ‘తూనీగ..తూనీగ..’ తోపాటు ఆర్పీపట్నాయక్‌ స్వరపరిచిన అన్ని పాటలు అలరించాయి. ఇందులోని పాటలంన్నిటికీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు.  ‘చెప్పవే ప్రేమా..చెలిమి చిరునామా’, ‘నీ స్నేహం ఇక రాదు అని’, ‘కిటకిట తలుపులు’ ఇలా ఆర్పీ పట్నాయక్‌ స్వరపరిచిన బాణీలన్నీ యువతను అమితంగా ఆకట్టుకున్నాయి.  అతిథి పాత్రలో సిరివెన్నెల సీతారామశాస్త్రి మెరవడం మరో విశేషం. 


ఉదయ్‌కిరణ్‌కి హ్యాట్రిక్‌ హిట్‌

గత చిత్రాలతో నష్టపోయిన ఎం.ఎస్‌. రాజు వసూళ్ల సునామీలో మునిగితేలారు. ఐదారు భాషల్లో రీమేక్‌ అయిందీ సినిమా. ‘చిత్రం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఉదయ్‌కిరణ్‌కిది హ్యాట్రిక్‌ హిట్‌.  ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ ఒకే ఏడాది విడుదలయ్యాయి. ‘నువ్వునేను’ వర్షాకాలంలో వచ్చి తెలుగు యువతను వలపు వానలో ముంచేసింది. ఇది విడుదలైన రెండు నెలలకి ‘మనసంతా నువ్వే’ దసరాకి వచ్చి ట్రెండ్‌ సృష్టించింది. ఈ విజయంతో ఉదయ్‌కిరణ్‌ స్టార్‌గా మారిపోయాడు. ‘చిత్రం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఉదయ్‌కిరణ్‌, రీమాసేన్‌లకు ‘మనసంతా నువ్వే’ మరిచిపోలేని విజయాన్ని అందించింది.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని