Nitya Menon: ఆ విషయం చెప్పగానే పవన్‌ ఆశ్చర్యపోయారు

‘‘నేనెప్పుడూ ఏ పాత్రని ఛాలెంజింగ్‌ అనుకోను. అలా అనుకుంటే అబ్బో చాలా కష్టపడ్డానేమో అనిపిస్తుంది. అందుకే ఏ పాత్రనైనా ఎంజాయ్‌ చేస్తూనే చేస్తా. కథ వింటున్నప్పుడే నేను నా పాత్రలోకి లీనమైపోతా’’ అంది నటి నిత్యామేనన్‌. వైవిధ్యభరిత కథా చిత్రాలకు చిరునామాగా నిలిచే ఆమె..

Updated : 28 Nov 2021 08:50 IST

‘‘నేనెప్పుడూ ఏ పాత్రని ఛాలెంజింగ్‌ అనుకోను. అలా అనుకుంటే అబ్బో చాలా కష్టపడ్డానేమో అనిపిస్తుంది. అందుకే ఏ పాత్రనైనా ఎంజాయ్‌ చేస్తూనే చేస్తా. కథ వింటున్నప్పుడే నేను నా పాత్రలోకి లీనమైపోతా’’ అంది నటి నిత్యామేనన్‌. వైవిధ్యభరిత కథా చిత్రాలకు చిరునామాగా నిలిచే ఆమె.. ఇప్పుడు ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం ‘స్కైలాబ్‌’. విశ్వక్‌ ఖండేరావు తెరకెక్కించారు. సత్యదేవ్‌, రాహుల్‌ రామకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది నిత్యామేనన్‌. ఆ సంగతులు ఆమె మాటల్లోనే..

ఈ కథని తొలుత నటిగా విన్నారా? నిర్మాతగా విన్నారా?

ముంబయిలో ఉన్నప్పుడు విశ్వక్‌ నాకీ కథ చెప్పారు. ఇంటర్వెల్‌ వరకు వినగానే.. ఈ సినిమా నేను చేస్తానని చెప్పా. తొలుత ఈ కథని నేను నటిగానే విన్నా. అయితే ఇలాంటి చిత్రాలు తెరపైకి రావడం అనుకున్నంత ఈజీ కాదు. నిర్మాణ పరంగా కొన్ని అవరోధాలు ఎదురవుతుంటాయి. అలాంటి కొన్ని సమస్యలు ఎదురైనప్పుడే ఈ చిత్రానికి సహాయ పడాలనిపించింది. ఈ క్రమంలోనే అనుకోకుండా నిర్మాతగా మారా. మంచి కథా బలమున్న స్క్రిప్ట్‌ ఇది. ఇలాంటి స్క్రిప్ట్‌ వింటే ఎవరైనా ఎగ్జైట్‌ అవ్వాల్సిందే. దీన్ని దర్శకుడు తెరకెక్కించిన విధానం చాలా కొత్తగా ఉంటుంది. తెలంగాణలోని ఓ మారుమూల ప్రాంతంలో జరిగే కథయినా.. ఎక్కడా రా లుక్‌ ఉండదు. చాలా పాలిష్‌ లుక్‌ కనిపిస్తుంటుంది. మంచి వెస్ట్రన్‌ క్లాసికల్‌ మ్యూజిక్‌ వినిపిస్తుంటుంది. తెరపై కనిపించే కలర్స్‌, విజువల్స్‌.. ప్రతిదీ చాలా విభిన్నంగా ఉంటాయి.

ఇంతకీ స్కైలాబ్‌ కథేంటి? ఈ చిత్రం చేయడానికి ముందు స్కైలాబ్‌ గురించి ఏమైనా కథలు విన్నారా?

తెలంగాణలోని బండలింగపల్లి అనే గ్రామం నేపథ్యంలో సాగే కథ ఇది. ప్రధానంగా మూడు పాత్రల చుట్టూనే కథంతా తిరుగుతుంటుంది. వాటిలో రెండు పాత్రల్ని సత్యదేవ్‌, రాహుల్‌ రామకృష్ణ పోషించగా.. మరో పాత్రలో నేను నటించా. నేనిందులో జర్నలిస్ట్‌ గౌరమ్మగా కనిపిస్తా. మా ముగ్గురికి వేరు వేరు లక్ష్యాలుంటాయి. అయితే స్కైలాబ్‌ వల్ల మా జీవితాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. అవేంటి? దాని వల్ల మాకెదురైన సమస్యలేంటి? అన్నది తెరపై చూడాలి.

ఈ సినిమా కోసం తొలిసారి తెలంగాణ యాసలో సంభాషణలు పలికారు. ఎలా అనిపించింది?

నాకు తెలంగాణ యాసంటే చాలా ఇష్టం. ఈ చిత్రం కోసం తొలిసారి ఆ యాసలో సంభాషణలు పలకడం మంచి అనుభూతినిచ్చింది. అది కూడా లైవ్‌ లొకేషన్‌లో.. సింక్‌ సౌండ్‌లో చెప్పా. సినిమా పూర్తయ్యాక ఏమన్నా కరెక్షన్స్‌ ఉంటే మళ్లీ డబ్బింగ్‌ చెబుదామనుకున్నా. కానీ, ఎక్కడా ఒక్క మాట కూడా మళ్లీ మార్చాల్సిన అవసరమే రాలేదు. అంత కచ్చితత్వంతో తెలంగాణ యాసలో మాట్లాడా. సినిమా మొత్తం గౌరమ్మ పాత్రని చాలా ఎంజాయ్‌ చేస్తూ చేశా. ఒక్కసారి ఆ కాస్ట్యూమ్‌ వేసుకున్నానంటే చాలు.. టక్కున ఆ పాత్రలోకి వెళ్లిపోయేదాన్ని. 

‘భీమ్లా నాయక్‌’ విశేషాలేంటి? పవన్‌ కల్యాణ్‌తో కలిసి పని చేయడం ఎలా ఉంది?

పవన్‌తో కలిసి పని చేయడం చాలా సౌకర్యంగా అనిపించింది. సెట్లో ఆయన చాలా తక్కువ మాట్లాడతారు. ఎలాంటి సీన్‌ అయినా ఠక్కున చేసి.. చూపిస్తారు. ఈ సినిమా కోసం త్రివిక్రమ్‌ సర్‌ నాకు ఫోన్‌ చేసినప్పుడు.. ‘భీమ్లా నాయక్‌’ కోసం ఓ లేడీ పవన్‌ కల్యాణ్‌ను తీసుకొస్తానని, మీ ఇద్దరికీ సరిగ్గా సరిపోతుంద’ని పవన్‌తో అన్నట్లు చెప్పారు. సెట్లో ఉన్నప్పుడు ఆ విషయాన్ని సరదాగా గుర్తు చేస్తుండేవారు. ఈ చిత్రంలో నా పాత్ర చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. ఓ పాట చిత్రీకరించాల్సి ఉంది. ఈ చిత్ర షూటింగ్‌ సమయంలో పవన్‌ సర్‌తో నేను నిర్మాతగా ‘స్కైలాబ్‌’ చేస్తున్నట్లు చెప్పా. చాలా ఆశ్చర్యపోయారు. ప్రత్యేకంగా అభినందించారు.

ఇకపై తెలుగులో మీ నుంచి వరుస సినిమాలు చూడొచ్చా?

వేరే భాషల్లో చేయడం వల్ల గ్యాప్‌ వచ్చినట్లు అనిపిస్తోంది కానీ, ఈ ఆరేళ్లలో నేను ఏరోజు ఖాళీగా లేను. ప్రస్తుతం తమిళంలో ధనుష్‌తో ఓ సినిమా చేస్తున్నా. హిందీలో ‘బ్రీత్‌’ సిరీస్‌ చేస్తున్నా. తెలుగులో ‘భీమ్లా నాయక్‌’తో పాటు అమెజాన్‌ కోసం ‘కుమారి శ్రీమతి’ అనే వెబ్‌సిరీస్‌ చేస్తున్నా. అలాగే ఇంకొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయి. వాటిలో కొన్ని నేనే నిర్మించనున్నా. నా దృష్టిలో రియల్‌ ఆర్టిస్ట్‌ ఎప్పుడూ ఓ ఫ్యాక్టరీలా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లడు. అది నటీనటులే కావొచ్చు.. దర్శక నిర్మాతలు కావొచ్చు.. ఎవరైనా సరే. ఎందుకంటే సినిమా అనేది ఓ సృజనాత్మక కళ. మన మనసు అలసిపోతే అది సరైన రీతిలో రాదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని