JP Nadda: ఎన్డీయే భేటీకి 38 పార్టీలు హాజరవుతున్నాయ్‌: నడ్డా

మంగళవారం సాయంత్రం జరగనున్న ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశానికి 38 పార్టీలు హాజరవుతున్నట్టు భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా వెల్లడించారు.

Published : 17 Jul 2023 18:13 IST

దిల్లీ: ఈ నెల 18న దిల్లీలో జరిగే ఎన్డీయే కూటమి (NDA Meeting) సమావేశానికి 38 పార్టీలు హాజరవుతున్నట్టు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) వెల్లడించారు. గత కొన్నేళ్లుగా ఎన్డీయే పరిధి పెరిగిందన్నారు. గత 9ఏళ్లలో అనేకమంది ప్రశంసలు అందుకున్న ప్రధాని నరేంద్ర మోదీ బలమైన నాయకత్వాన్ని అందరం చూశామని తెలిపారు. నేడు, రేపు బెంగళూరులో విపక్షాల భేటీకి 26 పార్టీలు హాజరయ్యే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో దిల్లీలో నడ్డా మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వ పథకాలు, విధానాల సానుకూల ప్రభావం కారణంగా ఎన్‌డీయే భాగస్వామి పక్షాలు ఉత్సాహంగా ఉన్నాయన్నారు. ఎన్డీయే కూటమిని దేశానికి సేవ చేసేందుకు, బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ఆదర్శ కూటమిగా అభివర్ణించిన నడ్డా.. యూపీయేకు నాయకుడే కాదు.. నిర్ణయాలు తీసుకొనే శక్తి కూడా లేదంటూ ఎద్దేవా చేశారు.  వారిది స్వార్థ ప్రయోజనాల ఆధారంగా ఏర్పడిన పొత్తులేనని విమర్శించారు. 

జేడీఎస్‌ కథ ముగిసిపోయిందన్న భ్రమలో కాంగ్రెస్‌ ఉంది : కుమారస్వామి

గత తొమ్మిదేళ్ల ఎన్డీయే పాలనలో అవినీతిని ఉపేక్షించలేదని.. కరోనాను కట్టడి చేయడంలో ప్రధాని మోదీ ప్రపంచానికే ఒక ఉదాహరణగా నిలిచారని నడ్డా కొనియాడారు. ఎన్డీయే ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో సుపరిపాలన అందించిందని..  అందుకోసం నిరంతరం కృషిచేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు రూ.28లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి బదిలీ చేసినట్టు వెల్లడించారు.  నేడు, రేపు విపక్షాల భేటీ బెంగళూరులో జరుగుతున్న వేళ ఎన్డీయే తన బలాన్ని నిరూపించుకునేలా నిర్వహించే రేపటి ఎన్డీయే భాగస్వామ్యపక్షాల భేటీ కీలక ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని