Chandrababu: ఎన్నికలకు సమయం లేదు.. దూకుడు పెంచాలి: చంద్రబాబు

రాష్ట్రంలో ఎన్నికలకు ఎక్కువ సమయం లేదని.. పార్టీ నేతలు, ఇన్‌ఛార్జ్‌లు మరింత దూకుడు..

Published : 18 Aug 2022 02:02 IST

అమరావతి: రాష్ట్రంలో ఎన్నికలకు ఎక్కువ సమయం లేదని.. పార్టీ నేతలు, ఇన్‌ఛార్జ్‌లు మరింత దూకుడు పెంచాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రానున్న ఏడాది కాలం పార్టీకి అత్యంత కీలకమని, అలసత్వం వీడి ప్రణాళికతో పనిచేయాలని తేల్చి చెప్పారు. పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో సమీక్షలు నిర్వహిస్తున్న చంద్రబాబు.. మొదటి రోజు అవనిగడ్డ, పెనమలూరు, మార్కాపురం, సంతనూతలపాడు ఇన్‌ఛార్జ్‌లతో భేటీ అయ్యారు. ప్రత్యేకంగా జరిగిన ముఖాముఖిలో పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు, బాదుడే బాదుడు కార్యక్రమం, ఓటర్ల జాబితా పరిశీలన, పార్టీ కార్యక్రమాల నిర్వహణ, నేతల పనితీరుపై చర్చించారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.

ఆయా నియోజకవర్గాలపై తన వద్ద ఉన్న నివేదికల ఆధారంగా ఇన్‌ఛార్జ్‌లతో మాట్లాడి చంద్రబాబు పలు సూచనలు చేశారు. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాల్లో నేతలు, కార్యకర్తలు పాల్గొనడంతో పాటు స్థానిక సమస్యలపై పోరాటం చేయాలని స్పష్టం చేశారు. మూడేళ్లలో వైకాపా ప్రభుత్వం ఏ నియోజకవర్గంలోనూ ఒక్క పని కూడా చేయలేదని, ప్రజల సమస్యలను జగన్‌ సర్కారు పూర్తిగా గాలికి వదిలేసిన అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రజా సమస్యలతో పాటు ఎమ్మెల్యేలు, జిల్లాల్లో మంత్రుల అవినీతిపైనా స్థానికంగా కార్యక్రమాలు రూపొందించుకుని ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని