ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా చిరంజీవిరావు

శాసనమండలి ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా విశ్రాంత అధ్యాపకుడు వేపాడ చిరంజీవిరావును ఎంపిక చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు.

Published : 05 Feb 2023 04:38 IST

విశాఖపట్నం (వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: శాసనమండలి ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా విశ్రాంత అధ్యాపకుడు వేపాడ చిరంజీవిరావును ఎంపిక చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం, రావికమతం మండలం, దొండపూడి గ్రామానికి చెందిన చిరంజీవిరావును ఎన్నికల బరిలో నిలుపుతున్నట్లు వెల్లడించారు. శనివారం విశాఖ తెదేపా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పేరును అచ్చెన్నాయుడు ప్రకటించారు. జీవీఎంసీ కార్పొరేటరు గాడు చిన్నికుమారిలక్ష్మిని ఎన్నికల బరిలో దింపుతున్నట్లు గతంలో తెదేపా ప్రకటించింది. అయితే కొంత కాలం నుంచి అభ్యర్థి మార్పుపై తెదేపా వర్గాల్లో జోరుగా చర్చ సాగింది. ఈ క్రమంలో చిన్నికుమారిలక్ష్మి స్థానంలో చిరంజీవిరావును ఎంపిక చేసినట్లు పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. స్థానిక తెదేపా నేతలకు చివరి నిమిషం వరకు ఈ సమాచారం లేకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చిరంజీవిరావు ఎంఏ, బీఈడీ, పీహెచ్‌డీ చేశారు. సబ్బవరం డిగ్రీ కళాశాలలో అర్థశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసి ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని