ప్రతిపక్షాలది బాధ్యతారాహిత్యం

బాధ్యతలేని ప్రతిపక్షాలు పార్లమెంటు జరగకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నాయని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆరోపించారు.

Updated : 22 Mar 2023 05:27 IST

దేశాన్ని తప్పుదోవ పట్టించేందుకు నిరాధార ఆరోపణలు
కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ మండిపాటు

దిల్లీ: బాధ్యతలేని ప్రతిపక్షాలు పార్లమెంటు జరగకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నాయని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆరోపించారు. ప్రధాని మోదీకి అంతర్జాతీయంగా వస్తున్న గుర్తింపును తట్టుకోలేక దేశాన్ని తప్పుదోవ పట్టించేందుకు నిరాధార ఆరోపణలకు దిగుతున్నాయని విమర్శించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషితో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలు రాజ్యసభ ఛైర్మన్‌ ధన్‌ఖడ్‌ను అవమానించారని, సమావేశం ఏర్పాటు చేస్తే రాలేదని విమర్శించారు. బడ్జెట్‌పై ప్రశంసలు రావడం, మోదీకి అంతర్జాతీయంగా గుర్తింపు దక్కడం, ఈశాన్య రాష్ట్రాల్లో భాజపా జయకేతనం ఎగరేయడం వంటివి విపక్షాలకు మింగుడుపడటం లేదని, అందుకే సభలను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. తొలుత ధన్‌ఖడ్‌ ఏర్పాటు చేసిన సమావేశానికి తెదేపా, వైకాపా, బిజూ జనతాదళ్‌ తప్ప దాదాపుగా మిగిలిన విపక్ష పార్టీలన్నీ గైర్హాజరయ్యాయని వివరించారు. ఆ తర్వాత రెండోసారి ఏర్పాటు చేసిన సమావేశానికి ఛైర్మన్‌ వ్యక్తిగత విజ్ఞప్తి మేరకు తృణమూల్‌, డీఎంకే హాజరయ్యాయని, అప్పుడూ మిగిలిన పార్టీలు రాలేదని తెలిపారు.

ఖర్గేను అడ్డుకున్నదెవరు: కాంగ్రెస్‌

గోయల్‌ ఆరోపణలపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ స్పందించారు. రాజ్యసభలో ఖర్గే మాట్లాడటానికి ఛైర్మన్‌ అనుమతించినా భాజపా సభ్యులే అడ్డుకుని గందరగోళం సృష్టించారని ధ్వజమెత్తారు. ‘ఛైర్మన్‌ సమావేశానికి ఆహ్వానిస్తే రాలేదని మమ్మల్ని గోయల్‌ తప్పుబడుతున్నారు. వాస్తవానికి ఆయనే సభా నాయకుడిగా ఉండీ.. ఖర్గే మాట్లాడేందుకు ఛైర్మన్‌ అవకాశమిచ్చినా మాట్లాడనివ్వకుండా భాజపా సభ్యులు గందరగోళం సృష్టిస్తుంటే అడ్డుకోలేదు’ అని విమర్శించారు.

రూ.1.48 లక్షల కోట్ల అదనపు అనుబంధ పద్దులకు ఆమోదం

2022-23లో ఖర్చు చేయనున్న రూ.1.48 లక్షల కోట్ల అదనపు అనుబంధ పద్దులకు లోక్‌సభ మంగళవారం ఆమోదం తెలిపింది. అదానీ అంశంపై గందరగోళం కొనసాగుతున్న సమయంలోనే ఈ పద్దులకు ఆమోదం లభించింది.
జమ్మూ కశ్మీర్‌ బడ్జెట్‌కూ..
కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌ బడ్జెట్‌ను లోక్‌సభ మంగళవారం ఆమోదించింది. 2023-24 సంవత్సరానికిగానూ 1.18 లక్షల కోట్లతో ప్రతిపాదించిన బడ్జెట్‌కు గందరగోళం మధ్యే లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తరఫున సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి ప్రవేశపెట్టారు.

స్పీకర్‌ భేటీలోనూ కుదరని సయోధ్య

లోక్‌సభ వాయిదాల పర్వానికి ముగింపు పలికేందుకు స్పీకర్‌ ఓం బిర్లా ఏర్పాటు చేసిన సమావేశమూ ఎలాంటి ఫలితమివ్వలేదు. జేపీసీ వేయాల్సిందేనన్న తమ డిమాండును వీడేది లేదని కాంగ్రెస్‌, మిగిలిన ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. దీనిని అధికార పక్షం వ్యతిరేకించింది. రాహుల్‌ను సభలో మాట్లాడనివ్వాలని కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధరి కోరారు. రాహుల్‌ క్షమాపణ చెప్పాల్సిందేనని భాజపా డిమాండు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని