నీకేనా బాధలు.. మాకు లేవా..?పార్టీలో ఉంటే ఉండు లేకపోతే పో..: వైకాపా నేతపై బొత్స ఆగ్రహం

విజయనగరం జిల్లా ఎస్‌.కోట నియోజకవర్గంలోని అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు మరోమారు బయటపడ్డాయి. పార్టీలోని ఓ వర్గంపై ఫిర్యాదు చేసిన ఎస్‌.కోట పట్టణ వైకాపా అధ్యక్షుడిపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు.

Updated : 09 Apr 2023 08:39 IST

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లా ఎస్‌.కోట నియోజకవర్గంలోని అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు మరోమారు బయటపడ్డాయి. పార్టీలోని ఓ వర్గంపై ఫిర్యాదు చేసిన ఎస్‌.కోట పట్టణ వైకాపా అధ్యక్షుడిపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం ఇక్కడ జరిగిన ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. కార్యక్రమం ముగిశాక తిరిగి వెళ్లేందుకు కారు ఎక్కిన ఆయన వద్దకు ఎస్‌.కోట పట్టణ పార్టీ అధ్యక్షుడు షేక్‌ రహమాన్‌ వెళ్లారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసి ఓడించిన వారికి పదవులు ఇచ్చారు. ఇప్పుడు వారు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు చేస్తున్న వారిని అందలం ఎక్కిస్తే మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న మాలాంటి వారి పరిస్థితి ఏమిటి? అటువంటి వారి వల్ల నియోజకవర్గంలో చాలా బాధలు పడుతున్నాం’  అంటూ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై మంత్రికి ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పక్కనే ఉన్నారు. ఇలాంటివి మాట్లాడడానికి సమయం కాదని.. ఏమైనా ఉంటే విజయనగరం వచ్చి మాట్లాడాలంటూ మంత్రి బదులిచ్చారు. రహమాన్‌ ఇంకా ఏదో చెప్పబోతుండగా మంత్రి ఒక్కసారిగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘పార్టీలో ఉంటే ఉండు లేకపోతే బయటకు పో.. ఏం మాట్లాడుతున్నావు. బాధ]లా, ఏంటి నీ బాధలు, నీకేనా మాకు లేవా బాధలు. ఇక్కడ బాగా క్రమశిక్షణరాహిత్యం పెరిగిపోయింది. నువ్వే పోటుగాడివా, వీరందరికీ చేతగాదనుకున్నావా రాజకీయం చేయడం?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి సభలో మైకులు.. పది విద్యార్థులకు అవస్థలు

ఎస్‌.కోటలో జరిగిన ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం కారణంగా సమీపంలోని కేంబ్రిడ్జి పాఠశాలలో పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం 9 గంటల నుంచే సభా వేదిక వద్ద మైక్‌ శబ్దాలు మొదలయ్యాయి. మైక్‌ వల్ల విద్యార్థులు ఇబ్బంది పడతారని, వాటిని ఆపించాలని పరీక్ష కేంద్రం సూపరింటెండెంటు కె.లక్ష్మికి ఉదయం 9.15 గంటలకు తనిఖీకి వచ్చిన స్క్వాడ్‌ సూచించింది. 11 గంటల ప్రాంతంలో ఎంఈవో పి.సత్యనారాయణ కూడా రావడంతో ఆయనకు కూడా ఈ విషయం తెలియజేసినా ప్రయోజనం లేదు. 11.45 గంటల వరకు విద్యార్థులు మైక్‌ సౌండ్‌తో ఇబ్బందులు పడ్డారు. విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టడం విద్యాశాఖ మంత్రికి తగునా? అని కేంద్రం వద్ద కొందరు తల్లిదండ్రులు వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని