రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారమివ్వాలి

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతి చెందిన వారందరికీ రూ. కోటి చొప్పున నష్టపరిహారం అందజేయాలని సీపీఐ నాయకుడు నారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Published : 04 Jun 2023 05:06 IST

సీపీఐ నేత నారాయణ డిమాండ్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతి చెందిన వారందరికీ రూ. కోటి చొప్పున నష్టపరిహారం అందజేయాలని సీపీఐ నాయకుడు నారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఅంబర్‌పేట్‌ మున్సిపాలిటీ కుంట్లూర్‌ రావి నారాయణ రెడ్డి కాలనీలో తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకల సందర్భంగా శనివారం బహిరంగసభ నిర్వహించారు. పార్టీ నాయకులు పల్లా వెంకట్‌రెడ్డి, ఈటీ నర్సింహతో కలిసి ఆయన హాజరయ్యారు. నారాయణ మాట్లాడుతూ... రైలు దుర్ఘటనలో చనిపోయిన వారివి.. కేంద్ర ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రధాని మోదీకి 31 మంది దత్తపుత్రులు

దేశ ఆర్థిక సంపదను ప్రధాని మోదీ తన 31 మంది దత్తపుత్రులకు దోచిపెడుతున్నారని నారాయణ ధ్వజమెత్తారు. వారిలో అదానీతోపాటు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఉన్నారని ఆరోపించారు. దేశంలో నంబర్‌వన్‌ అవినీతిపరుడు మోదీ అని ఆరోపించారు. కేంద్ర క్యాబినెట్‌లో పలువురు మంత్రులపై హత్యలు, అత్యాచారాలు తదితర కేసులు ఉన్నాయన్నారు. భాజపాపై పోరాటం విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ తన వైఖరిని స్పష్టం చేయాలని ఆయన కోరారు. కేసీఆర్‌ యజ్ఞాలు, యాగాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం సిద్ధించలేదని, 1400 మంది బలిదానాలతోనే సాధ్యమైందన్నారు. తెలంగాణలో భాజపాకు వ్యతిరేకంగా చిత్తశుద్ధితో పోరాటం చేయాలనుకుంటే వామపక్ష పార్టీలను కలుపుకొనిపోవాలని సూచించారు. ఏపీ సీఎం జగన్‌ కేంద్ర ప్రభుత్వానికి, మోదీకి ఎప్పుడో బానిసయ్యారని నారాయణ ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రవీంద్రచారి, ముత్యాల యాదిరెడ్డి, పానుగంటి పర్వతాలు, పల్లె నర్సింహ, సామిడి శేఖర్‌రెడ్డి, పెద్దఅంబర్‌పేట్‌ కౌన్సిలర్‌ పబ్బతి లక్ష్మణ్‌, మాజీ కౌన్సిలర్‌ అజ్మీర్‌ హరిసింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని