క్రిమినల్‌ కోసం పని చేస్తున్నవారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు

సైకో ఎవరో.. ఎవరి పుట్టుక రాష్ట్రానికి, సొంత కుటుంబానికి శాపంలా మారిందో యావత్తు రాష్ట్ర ప్రజానీకానికి తెలుసని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పేర్కొన్నారు.

Updated : 05 Jun 2023 06:33 IST

తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సైకో ఎవరో.. ఎవరి పుట్టుక రాష్ట్రానికి, సొంత కుటుంబానికి శాపంలా మారిందో యావత్తు రాష్ట్ర ప్రజానీకానికి తెలుసని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పేర్కొన్నారు. తండ్రి శవం పక్కన సంతకాలు సేకరించిన నీతిమాలిన నాయకత్వం కింద పనిచేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి అసహనంతో లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. లోకేశ్‌ పుట్టుక గురించి మాట్లాడే అర్హత సజ్జలకు ఏ మాత్రం లేదని ట్విటర్‌ వేదికగా ఆదివారం ధ్వజమెత్తారు. ‘క్రిమినల్‌ కోసం క్రిమినల్‌ పనులు చేస్తున్న మీరు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మీ భవిష్యత్తు దుర్భరంగా ఉండనుంది. మీ అహంకారం కుప్పకూలుతుంది. నాడు మీ బానిసత్వం, మీ పుట్టుక మీకే అసహ్యం కలిగిస్తుంది’ అని సజ్జలను ఉద్దేశించి నరేంద్ర ట్వీట్‌ చేశారు.  

స్మాష్‌రెడ్డి సారథ్యంలో హత్యా పాఠాలు: బుచ్చయ్యచౌదరి

హైదరాబాద్‌ అభివృద్ధిలో దూసుకుపోతుంటే, ఏపీ మాత్రం జగన్‌రెడ్డి పాలనలో హత్యలెలా చేయాలి? ఏ విధంగా తప్పించుకోవాలి? అనే అంశాల చుట్టూనే తిరుగుతోందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎద్దేవా చేశారు. ‘హైదరాబాద్‌ వైపు సీ, సీప్లస్‌, జావా, ఎస్‌క్యూఎల్‌ కోచింగ్‌ సెంటర్లు.. ఏపీ వైపు గొడ్డలిపోటు గుండెపోటుగా ఎలా చిత్రీకరించాలి? బెయిల్‌ ఎలా పొందాలి? సీబీఐ నుంచి ఎలా తప్పించుకోవాలనే అంశాలపై నిపుణులైన ఫ్యాకల్టీతో కోచింగ్‌ సెంటర్లు.. స్మాష్‌రెడ్డి సారథ్యంలో రాష్ట్రం దుస్థితి ఇది’ అని ఆయన ఆదివారం ట్వీట్‌ చేశారు.  

బాధితులను ఆదుకోవడంలో చిత్తశుద్ధి ఏదీ?: బుద్ధ నాగజగదీశ్వరరావు

అనకాపల్లి, న్యూస్‌టుడే: ఒడిశాలో భారీ రైలు ప్రమాదమేర్పడినా ముఖ్యమంత్రి జగన్‌లో చలనం లేదని తెదేపా మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రధానితో సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వయంగా సంఘటన స్థలానికి వెళ్లి మానవత్వం చాటుకున్నారని వివరించారు. ఉత్తరాంధ్రలో ఎంతోమంది అనుభవజ్ఞులైన మంత్రులు ఉండగా కనీస అవగాహన లేని మంత్రి అమర్‌నాథ్‌ను పంపారంటేనే ముఖ్యమంత్రికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని