Congress - BRS: ఒకటికి ఎక్కువ.. రెండుకు తక్కువ!

Updated : 27 Dec 2023 09:35 IST

రాజ్యసభ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాలకు చాలీచాలని బలం
ఏకగ్రీవానికే మొగ్గు.. కాంగ్రెస్‌కు 2, భారాసకు ఒకటి దక్కే అవకాశం
ఏప్రిల్‌ 2తో ముగియనున్న సంతోష్‌, లింగయ్య, రవిచంద్రల పదవీకాలం

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల కంటే ముందే తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు (Rajya Sabha elections) జరగనున్నాయి. రాష్ట్రానికి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్‌కుమార్‌, బడుగుల లింగయ్యయాదవ్‌ల పదవీకాలం వచ్చే ఏప్రిల్‌ రెండో తేదీన ముగియనుంది. ఈ మూడు స్థానాలకు మార్చి నెలలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించనుంది. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలంతా ఓటింగులో పాల్గొని రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. రాష్ట్రంలో 119 మంది శాసనసభ్యులు ఉండగా.. ప్రతి 39.6  సభ్యులకొకరు చొప్పున ముగ్గురు రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం  ఈ పూర్తి కోటాతో ఏ పార్టీ కూడా రెండు గానీ, మూడు గానీ సీట్లు గెలిచే అవకాశం లేదు. అధికార పార్టీ కాంగ్రెస్‌ (Congress),  ప్రధాన ప్రతిపక్షమైన భారాసలకు (BRS) మిత్రపక్షాలతో కలిసినా.. ఒక సీటుకు సరిపడా మాత్రమే ఓట్లున్నాయి. రెండో సీటుకు మెజారిటీ చాలదు. దీంతో అవి తమకున్న బలాల మేరకే అభ్యర్థులను నిలిపే అవకాశం ఉంది.

  • ప్రస్తుత ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్‌కు 64 మంది, దాని మిత్రపక్షమైన సీపీఐకి ఒకరు, భారాస 39, భాజపా 8, మజ్లిస్‌కు ఏడుగురు సభ్యుల బలం ఉంది.
  • నిర్ణీత 39.6 శాతం ఓట్ల ప్రకారం.. కాంగ్రెస్‌ తన బలంతో ఒక సీటును గెలుచుకున్నాక.. ఆ పార్టీకి సీపీఐతో కలిపి మరో 25 ఓట్లు ఉంటాయి. అంటే రెండో స్థానంలో 40 ఓట్లు సాధించడం కష్టమే. మరోవైపు భారాసకు 39 ఓట్లు మాత్రమే ఉన్నాయి. దాని మిత్రపక్షమైన మజ్లిస్‌కు గల ఏడు స్థానాలు కలిస్తే మొత్తం 46 అవుతాయి. అంటే ఒక సీటు గెలిచాక.. మిగిలేవి ఆరు ఓట్లు. 40 ఓట్ల కోటాతో రెండో స్థానంలో అది పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు.

పోటీ ఎలా ఉంటుంది?

రాష్ట్రంలో మూడు స్థానాలు ఖాళీ అవుతున్నందున ముగ్గురే అభ్యర్థులు బరిలో నిలిస్తే.. పోలింగుతో, సంఖ్యాబలంతో సంబంధం లేకుండా వారి ఎన్నిక ఏకగ్రీవమవుతుంది.

  • ముగ్గురికి మించి అభ్యర్థులు బరిలో ఉంటే పోలింగు అనివార్యమవుతుంది. అప్పుడు మొదటి మూడు స్థానాల్లో అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థులను విజేతలుగా ప్రకటిస్తారు.
  • కాంగ్రెస్‌కు ఒక స్థానం గెలిచే ఓట్ల కంటే మరో 25 ఎక్కువ ఓట్లు ఉన్నందున అది రెండు స్థానాలకు పోటీ చేసే వీలుంది.
  • భారాసకు ఒక స్థానం గెలిచిన తర్వాత అదనంగా మరో ఆరు ఓట్లే ఉన్నందున అది రెండోస్థానానికి పోటీ చేసే వీలు ఉండదు.
  • ఈ సమీకరణాల దృష్ట్యా కాంగ్రెస్‌ రెండు, భారాస ఒక స్థానానికి పోటీ చేసి ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
  • రాజ్యసభ బరిలో ఒక అభ్యర్థిని బరిలోకి దింపడానికి 10 మంది శాసనసభ్యులు ఆయన పేరును ప్రతిపాదించాలి. కాంగ్రెస్‌, భారాస మినహా మిగిలిన పార్టీలకు పోటీ పడేంత బలం లేదు. 

కాంగ్రెస్‌ మూడింటికి పోటీ చేస్తే..

కాంగ్రెస్‌ మూడు స్థానాలకు పోటీ చేసినా.. భారాస రెండు స్థానాలకు పోటీ చేసినా ఎన్నికలు ఉత్కంఠగా మారుతాయి. కాంగ్రెస్‌కు ముగ్గురు అభ్యర్థులు ఉంటే అప్పుడు ఆ పార్టీ ఒక్కో అభ్యర్థికి ఓట్ల బలం 21.6 ఉంటుంది. కాంగ్రెస్‌ అలాంటి నిర్ణయం తీసుకుంటే భారాస, మిత్రపక్షం మజ్లిస్‌తో కలిసి పోటీ చేయడానికి సాహసిస్తుంది. అప్పుడు వాటి బలం 46 అవుతుంది. అంటే దానికి రెండు స్థానాల్లో 23 చొప్పున ఓట్లు ఉంటాయి. అది కాంగ్రెస్‌ అభ్యర్థుల సగటు ఓట్ల కంటే ఎక్కువ అవుతుంది. ఇలాంటి సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్‌, భారాసలు తమ బలానికి తగ్గట్లుగా అభ్యర్థులను నిలిపి ఏకగ్రీవంగా గెలిపించుకోవడానికే మొగ్గు చూపే వీలుంది.

ఆశావహులెందరో..

రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్‌, భారాసలో భారీ సంఖ్యలో ఆశావహులున్నారు. శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పలువురికి హామీలిచ్చిన నేపథ్యంలో ఎవరిని ఎంపిక చేస్తుందో వేచి చూడాలి. భారాసలో సైతం పార్టీ ముఖ్యనేతలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు