GHMC: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ భేటీ.. పోడియం వద్ద తెరాస-భాజపా ‘ఢీ’

జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ ప్రవేశపెట్టే సందర్భంగా మేయర్‌ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్‌ భేటీ అయింది. ఈ సమావేశం వాడీవేడిగా జరిగింది.

Updated : 12 Apr 2022 14:14 IST

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ ప్రవేశపెట్టే సందర్భంగా మేయర్‌ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్‌ భేటీ అయింది. ఈ సమావేశం వాడీవేడిగా జరిగింది. ప్రజా సమస్యలను కార్పొరేటర్లు ఏకరువు పెట్టారు. ఈ క్రమంలో తెరాస, భాజపా కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. తెరాస కార్పొరేటర్లు మాట్లాడుతూ భాజపా వాళ్లకు వరికి గోధుమలకు తేడా తెలియదని ఆరోపించారు. ఈ క్రమంలో తెరాస కార్పొరేటర్‌ కవిత చేసిన వ్యాఖ్యలపై భాజపా కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అభివృద్ధిపై చర్చించకుండా పక్కదారి పట్టస్తున్నారంటూ పోడియం వద్దకు నిరసన తెలిపారు. దీంతో అక్కడ ఒకింత ఉద్రిక్తత తలెత్తింది. భాజపా కార్పొరేటర్ల ఆందోళన నేపథ్యంలో తెరాస కార్పొరేటర్‌ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని మేయర్‌ తెలిపారు.

అంతకుముందు ఎంఐఎం కార్పొరేటర్‌, మాజీ మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ నగరంలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయిందని కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. పన్నులు కట్టే వారికి జరిమానాలు విధిస్తున్నారన్నారని.. చెల్లించని వారి జోలికి అధికారులు వెళ్లడం లేదన్నారు. దీనిపై చర్యలు చేపడతామని మేయర్‌ ఆయనకు తెలిపారు.

తొలుత మేయర్‌ గద్వాల విజయలక్ష్మి జీహెచ్‌ఎంసీ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదించాల్సిందిగా సభను కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అభివృద్ధి, సౌకర్యాల కల్పనలో హైదరాబాద్‌ పురోగతి సాధిస్తోందని చెప్పారు. 2022-23 ఏడాదికి సంబంధించి రూ.6,150 కోట్లతో జీహెచ్‌ఎంసీ వార్షిక బడ్జెట్‌ ఆమె ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. రోడ్ల అభివృద్ధి స్కైవేలు, పై వంతెనలు కోసం రూ.1,500కోట్లు కేటాయించినట్లు వివరించారు. ఎస్ఎన్డీపీలో భాగంగా చేపడుతున్న పనులకు రూ.340 కోట్లు, ఇతర నాలా పనుల నిర్వహణకు రూ.200కోట్లు, ఈ ఏడాది వరద నివారణ కోసం రూ.340 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. నగరంలో పచ్చదనం పెంపునకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. గ్రీనరీ పెంపునకు రూ.332.23 కోట్లతో గ్రీన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టినట్లు మేయర్‌ తెలిపారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని