Pramod Sawant: తెలంగాణ కంటే గోవాలోనే ఎక్కువ పథకాలు: ప్రమోద్‌ సావంత్‌

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ విజయవంతంగా సాగుతోందని గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ అన్నారు.

Updated : 12 May 2022 15:01 IST

హైదరాబాద్‌: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ విజయవంతంగా సాగుతోందని గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ అన్నారు. పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూస్తే తెలంగాణలో భాజపా ప్రభుత్వం ఏర్పడుతుందనే నమ్మకం కలుగుతోందని చెప్పారు. తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రమోద్‌ సావంత్‌.. గురువారం నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

గోవా వచ్చి చూడండి..

‘‘చివరి వ్యక్తి వరకూ సంక్షేమ పథకాలు అందడమే ప్రధాని మోదీ లక్ష్యం. డబుల్ ఇంజిన్ సర్కారు అన్ని రాష్ట్రాల్లో రావాలనేదే మా ఆకాంక్ష. ఆత్మనిర్భర్‌ భారత్‌ అమలుకు కృషి చేస్తున్నాం. గోవాలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశాం. పర్యాటకులకు కూడా పూర్తి వ్యాక్సిన్ వేయించిన రాష్ట్రం గోవా. మా రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటే ఏంటో గోవా వచ్చి చూడండి. గోవా తరహా అభివృద్ధి కావాలంటే తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కారు రావాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతాం.

వడ్డీలేని రుణాలు మేము కూడా ఇస్తున్నాం..

వితంతు పింఛన్లు, కల్యాణ లక్ష్మి, రైతులకు వడ్డీలేని రుణాలు మేము కూడా ఇస్తున్నాం. తెలంగాణ కంటే ఎక్కువ పథకాలను అందిస్తున్నాం. పంచాయతీ స్థాయిలో గెజిటెడ్ అధికారులు ప్రతివారం పర్యటిస్తున్నారు. సంక్షేమ పథకాలు కింది స్థాయి వరకు చేరేలా కృషి చేస్తున్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ నెల 14న తెలంగాణకు రాబోతున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గోవా ఎన్నికల్లో బాగా పని చేశారు. ఆయూష్ అభివృద్ధి కోసం జైపూర్‌లో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటును అభినందిస్తున్నా’’ అని ప్రమోద్‌ సావంత్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని