Motkupalli: జగన్‌.. నీ విధానాలు చూసి జనం నవ్వుకుంటున్నారు: మోత్కుపల్లి

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్‌ రాజ్యాంగ విరుద్ధమని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.

Updated : 24 Sep 2023 14:40 IST

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్‌ రాజ్యాంగ విరుద్ధమని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంపై 2021లో కేసు నమోదైతే.. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేని వ్యక్తిని నాలుగేళ్ల తర్వాత అరెస్ట్‌ చేయించిన ఘనత ఏపీ సీఎం జగదేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద మోత్కుపల్లి నిరసన దీక్షకు దిగారు. సాయంత్రం 5 గంటల వరకు ఆయన నిరసన దీక్ష కొనసాగనుంది.

ఈ సందర్భంగా మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జగన్‌.. నిన్ను, నీ విధానాలను చూసి ప్రజలు నవ్వుతున్నారు. వచ్చిన అధికారాన్ని కాపాడుకోలేని అసమర్థుడివి. ప్రజలు నిన్ను ఛీత్కరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నియంత అని పేరు తెచ్చుకున్నావు. చంద్రబాబును అరెస్ట్ చేసి ఏం ఆనందం పొందారో అర్థం కావడం లేదు. నారా భువనేశ్వరి ఏడుపు జగన్‌కు తగులుతుంది. ఎదుటి వారిని ఇబ్బంది పెడితే జగన్‌కే నష్టం. రానున్న రోజుల్లో 4 సీట్లు కూడా వైకాపాకు రావు. సొంత చెల్లికి తండ్రి ఆస్తిలో కూడా భాగం ఇవ్వకుండా బయటకు పంపారు. జగన్‌ గెలుపు పాపంలో నాకూ భాగస్వామ్యం ఉందని బాధపడుతున్నా. ఆయన కళ్లకు అహంకార పొరలు కమ్ముకున్నాయి. సొంత బాబాయ్‌ని చంపిన నేరస్థుడిని పట్టుకోలేని జగన్‌ ఎలాంటి నాయకుడు? నేను జగన్‌కు వ్యతిరేకం కాదు.. ఆయన దుర్మార్గానికి వ్యతిరేకం’’ అని మోత్కుపల్లి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని