Pawan Kalyan: అప్రమత్తంగా ఉండండి.. జనసైనికులకు పవన్‌ బహిరంగలేఖ

జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సూచించారు. ఈ మేరకు జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులను ఆయన బహిరంగ లేఖ రాశారు.

Updated : 24 Apr 2023 15:20 IST

అమరావతి: జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని.. మాట్లాడేముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సూచించారు. ఈ మేరకు జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులను ఆయన బహిరంగ లేఖ రాశారు.

కుట్రలకు పాల్పడుతున్నట్లు సమాచారం..

‘‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి, ప్రజాశ్రేయస్సు కోసం మనం శ్రమిస్తున్న తరుణంలో మన దృష్టి మళ్లించేందుకు, భావజాలాన్ని కలుషితం చేసేందుకు కొన్ని శక్తులు నిరంతరం పనిచేస్తున్నాయి. మన పార్టీ పట్ల ఉన్న సానుకూల దృక్పథాన్ని దెబ్బతీసే కల్పిత సమాచారాన్ని శ్రేణులకు చేర్చి కుట్రలకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉంది. వాటిని మనం అర్థం చేసుకుని పార్టీ నాయకులు, శ్రేణులు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.

ప్రతి విమర్శలు, తీవ్రమైన ఆర్థిక నేరాల గురించి మాట్లాడాల్సి వచ్చినపుడు ముందుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ దృష్టికి తీసుకెళ్లండి. వారి సూచనలు, సలహా మేరకు మాట్లాడండి. పార్టీలోని నాయకులు, వీరమహిళలు, జనసైనికులు మాట్లాడే ప్రతి మాట పార్టీపై ప్రభావం చూపుతుంది. అందుకే పార్టీలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరిస్తూ మాట్లాడే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి. స్థాయి, తీవ్రత హద్దులు దాటినట్లు సభ్య సమాజం భావించని విధంగా మన మాటలు ఉండాలి.

ఆధారాల్లేకుండా నేరారోపణలు చేయొద్దు..

ఒక వ్యక్తి గురించి మాట్లాడే సమయంలో అకారణంగా వారి కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించవద్దు. ఆధారాలు లేకుండా నేరారోపణలు చేయొద్దు.. అది పార్టీకి, సమాజానికి మంచిది కాదు. నన్ను విమర్శించే వారికీ, వ్యక్తిగతంగా దూషించే వారికి బదులు చెప్పే సమయంలో నేను చాలా అప్రమత్తంగా ఉంటానన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ప్రతి అక్షరాన్ని, మాటను బేరీజు వేసుకుంటూ హద్దులు దాటకుండానే కొంత తగ్గి బదులు చెబుతాను. ఎందుకంటే మన నుంచి వచ్చే ప్రతీ మాటకు అంత బలం ఉంటుంది.. ఆ బలం అపసవ్యంగా మారకూడదు.

సరైన ధ్రువపత్రాలు లేకుండా ఎవరిపైనా ఆర్థిక నేరారోపణలు చేయొద్దు. మీడియాలో వచ్చిందనో.. ఎవరో మాట్లాడారనో నిర్ధారణ కానీ అంశాలపై చెప్పొద్దు. పొత్తులపై సోషల్‌ మీడియాలో వచ్చే సమాచారం ఆధారంగా మాట్లాడకండి. ఈ విషయంలో మేలు చేసే నిర్ణయం నేనే స్వయంగా తీసుకుంటా. సయోధ్యగా ఉన్న రాజకీయపక్షాల్లో చిన్నా చితకా నాయకులు మనపై ఏమైనా విమర్శలు చేస్తే వాటిని ఆ నాయకుడి వ్యక్తిగత విమర్శలుగా భావించండి. వాటిని ఆయా పార్టీలకు ఆపాదించవద్దు’’ అని పవన్‌ బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని