Modi: ఈశాన్య రాష్ట్రాల సీఎంల ప్రమాణస్వీకారానికి మోదీ..!

ఈశాన్య రాష్ట్రాల్లో మోదీ (Modi) పర్యటించనున్నారు. ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారానికి ప్రధాని హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

Published : 04 Mar 2023 18:49 IST

దిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లో భాజపా తన ఉనికిని వేగంగా విస్తరించుకుంటోంది. ఇటీవల జరిగిన త్రిపుర (Tripura), నాగాలాండ్ (Nagaland)‌, మేఘాలయ (Meghalaya) అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఆయా రాష్ట్రాల్లో త్వరలోనే కాషాయ పార్టీ (BJP) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) త్వరలో ఆ రాష్ట్రాలకు వెళ్లనున్నారు. ఆ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, ఇతర నేతల ప్రమాణస్వీకారానికి ప్రధాని హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో త్రిపుర (Tripura)లో భాజపా (BJP) కూటమి 32 చోట్ల విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీని దక్కించుకుంది. మార్చి 8న అక్కడ కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఆ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నట్లు సీనియర్‌ అధికారి ఒకరు శనివారం వెల్లడించారు. ఇక్కడ మరోసారి మాణిక్‌ సాహాకే ముఖ్యమంత్రి పగ్గాలు అప్పజెప్పే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఇక మేఘాలయ (Meghalaya)లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రానప్పటికీ.. అధికార ‘నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ’ 26 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే భాజపా (BJP), ఇతర చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాన్రాడ్‌ సంగ్మా ముందుకొచ్చారు. తమకు సరైన మెజార్టీ ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినివ్వాలని గవర్నర్‌ కోరారు. ఇందుకు అనుమతి లభించడంతో మార్చి 7వ తేదీన సంగ్మా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమానికీ మోదీ హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

నాగాలాండ్‌ (Nagaland)లో ప్రస్తుతం అధికారంలో ఉన్న భాజపా- నేషనలిస్ట్‌ డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (ఎన్డీపీపీ) సంకీర్ణ ప్రభుత్వం మరోసారి విజయం సాధించింది. దీంతో ప్రస్తుత సీఎం నెయిపియు రియో మరోసారి సీఎం బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. ఆదివారం ఆయన భాజపాతో మంతనాలు జరపనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతినివ్వాలంటూ సోమవారం గవర్నర్‌ను కోరనున్నట్లు తెలుస్తోంది. మార్చి 7నే రియో ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమానికి కూడా ప్రధాని (Modi) హాజరకానున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని