Revanth reddy: ఐదు శీర్షికలుగా హైదరాబాద్‌ యూత్‌ డిక్లరేషన్‌.. ప్రవేశపెట్టిన రేవంత్‌ రెడ్డి

‘యువ సంఘర్షణ’ సభలో హైదరాబాద్‌ యూత్‌ డిక్లరేషన్‌ను ఐదు శీర్షికలుగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రవేశపెట్టారు.

Updated : 08 May 2023 19:29 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమంలో 60 ఏళ్లు పోరాడినా ఆకాంక్షలు నెరవేరలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ యూత్‌ డిక్లరేషన్‌నకు విచ్చేసిన కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకా గాంధీకి ఆయన ఘన స్వాగతం పలికారు. సరూర్‌నగర్‌లో నిర్వహించిన ‘యువ సంఘర్షణ’ సభలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఓయూ, కాకతీయ వర్సిటీలు కేవలం విశ్వవిద్యాలయాలే కావని.. అవి తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలు అని అన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తి చాటిన వేదికలని తెలిపారు. వర్సిటీలు తెలంగాణ పౌరుషానికి వేదికలుగా నిలిచాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాల సంఖ్య 12.5 లక్షలు, విభజన వేళ తెలంగాణకు 5.3 లక్షలు కేటాయించారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది 1.07 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పి కేసీఆర్‌ మాటిచ్చి మరిచారని ఆయన విమర్శించారు.

ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ యూత్ డిక్లరేషన్‌ను ఐదు శీర్షికలలో ప్రవేశపెట్టారు. అమరవీరుల ఉద్యమకారుల త్యాగాలకు గుర్తుగా తొలి డిక్లరేషన్‌ ప్రకటించారు. ‘‘తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో ప్రాణాలర్పించిన ఉద్యమకారులను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు రూ.25 వేల గౌరవ పింఛను అందిస్తాం. అమరవీరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యమకారుల మీద పెట్టిన కేసులు ఎత్తివేస్తాం. జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర అవిర్భావం రోజున ఉద్యమకారులకు గుర్తింపు కార్డులను అందిస్తాం.

ఇదీ చదవండి: సోనియమ్మ బిడ్డగా మాటిస్తున్నా.. యూత్ డిక్లరేషన్ అమలు చేస్తాం: ప్రియాంక గాంధీ

* తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడమే రెండో డిక్లరేషన్‌. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులను కాంగ్రెస్‌ పార్టీ భర్తీ చేస్తోంది. ఉద్యోగ ఖాళీల కోసం జాబ్‌ క్యాలెండర్‌ ఏర్పాటు చేసి ఏటా జూన్‌ 2నాటికి ప్రభుత్వ ఖాళీలు గుర్తించి నోటిఫికేషన్లు ఇస్తాం. సెప్టెంబరు 17న నియామక పత్రాలు అందిస్తాం. 

* ఉద్యోగ ప్రయత్నాలు చేసి నిరుద్యోగులుగా మిగిలిపోయిన యువకులకు రూ.4వేలను నిరుద్యోగ భృతి ఇస్తాం. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను బలోపేతం చేసి.. యూపీఎస్సీ తరహాలో నియామక పరీక్షలు నిర్వహిస్తాం. మొత్తం పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియను కాంగ్రెస్‌ చేపడుతుంది.

* నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దటానికి సెంట్రలైజ్డ్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ను ఏర్పాటు చేస్తాం. ఏడు జోన్లుగా విభజించిన రాష్ట్రంలో వీటిలో ఎంప్లాయంట్‌మెంట్‌ ఎక్స్ఛేంజ్‌లను ఏర్పాటు చేస్తాం. ప్రైవేట్‌ పరిశ్రమలో 75శాతం స్థానిక నిరుద్యోగ యువకులకే ఉద్యోగాలు ఇచ్చే విధంగా చట్టాన్ని తీసుకొస్తాం. నిరంతరం నిరుద్యోగ యువతకు అండగా ‘యూత్‌ కమిషన్‌’ ఏర్పాటు చేస్తాం. రూ.10లక్షల వరకు వడ్డీలేని రుణాలను ఇస్తాం. 

* ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు ఫీజు రియంబర్స్‌మెంట్ ఇవ్వడమే కాకుండా పాత బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లిస్తాం. తెలంగాణ, పాలమూరు, మహత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీలను ఇంటిగ్రేటెడ్‌ యూనివర్సిటీలుగా మారుస్తాం. ఖమ్మం, మెదక్‌, ఆదిలాబాద్‌ జిల్లాలో నూతన ఇంటిగ్రేటెడ్‌ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తాం. బాసర ట్రిపుల్‌ ఐటీ తరహాలో రాష్ట్రంలో నాలుగు ట్రిపుల్‌ ఐటీలను ఏర్పాటు చేస్తాం. 

* అమెరికాలో ఉండే ఐఎమ్‌జీ తరహాలో స్పోర్ట్స్‌ అకాడమీని తెలంగాణలో ఏర్పాటు చేసి క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రత్యేకంగా పోలీసు సిబ్బంది, ఆర్టీసీ కార్మికుల పిల్లల కోసం  వరంగల్‌, హైదరాబాద్‌లో ప్రత్యేక యూనివర్సిటీలు నిర్మించి ఆరో తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తాం. ముఖ్యంగా ప్రియాంకా గాంధీకి ఇష్టమైన యువ మహిళా సాధికారత. అందుకోసం చదువుకునే యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్‌ స్కూటీలను ఉచితంగా అందిస్తాం’’ అని రేవంత్‌ ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని