Ap News: సీఎం జగన్‌ తీరుతో రాష్ట్రానికి తీవ్ర నష్టం: చంద్రబాబు

రాజధానిపై సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రానికి తీవ్రంగా నష్టం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఉపాధి అవకాశాలు

Updated : 22 Nov 2021 18:54 IST

అమరావతి: రాజధానిపై సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రానికి తీవ్రంగా నష్టం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఉపాధి అవకాశాలు పోవడంతో పాటు రాష్ట్ర ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతుందని ధ్వజమెత్తారు. కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక విషయంలో అధికార పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తెదేపా ముఖ్య నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో వరదల వల్ల ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇప్పటివరకు 34 మంది చనిపోగా, 10 మంది గల్లంతయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు అవసరమైన సహాయ కార్యక్రమాలను అందించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అజాగ్రత్త, ముందస్తు జాగ్రత్త చర్యలు లేకపోవడం వల్లే ఇంత మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. తెదేపా ఆధ్వర్యంలో బృందాలు బాధితులకు అన్ని విధాల అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 23, 24 తేదీల్లో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు వెల్లడించారు.

జగన్ రెడ్డి పాలనపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శించారు. ఇళ్ల స్థలాలు, వాటిల్లో నిర్మించిన ఇళ్లను క్రమబద్ధీకరణ పేరుతో ఒక్కో పేద కుటుంబం నుంచి రూ.10 వేల నుంచి రూ.20 వేలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విధంగా ఆదాయం పొందాలనుకోవడం దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు. పేద కుటుంబాలు ఎవరూ ఈ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని.. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే నెలరోజుల్లోగా ఉచితంగా పేదలకు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని