Pawan Kalyan: తొక్కే కొద్దీ పైకి లేస్తాం: పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరంలో పార్టీ కార్యకర్తలతో కలిసి శ్రమదానం చేశారు.
రాజమహేంద్రవరం: తొక్కే కొద్దీ పైకి లేస్తాం తప్ప వంగేది లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజమహేంద్రవరంలో పార్టీ కార్యకర్తలతో కలిసి శ్రమదానం చేశారు. అనంతరం బాలాజీపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘‘పనులు జరగనప్పుడు ప్రశ్నించే హక్కు ఉంది. ప్రజలకు ఉన్న హక్కునూ ఎవరూ ఆపలేరు. రాజ్యాంగం కల్పించిన హక్కును అడ్డుకోలేరు. వీర మహిళలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కుల, మత, వర్గ రహిత సమాజం నిర్మించడం మన ఆకాంక్ష. రాజకీయ సాధికారత కోసం పోరాటం చేస్తున్నా. ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు అండగా ఉండాలని వచ్చా.
నా సహనాన్ని తేలిగ్గా తీసుకోకండి..
రాజకీయ పార్టీ నడపటం అంత సులువు కాదు. శ్రమదానం నాకు సరదా కాదు. రాజకీయం అనేది కష్టమైన ప్రక్రియ. నేను నిలబడటానికి ఎన్ని దెబ్బలు తిన్నానో మీకేం తెలుసు. ఒడిదొడుకులు, ఓటములు అధిగమించి నిలబడేందుకు వచ్చా. మనం ఇచ్చే పన్నులు ప్రభుత్వం ఖాజానాకు వెళ్తాయి. ప్రభుత్వం వద్ద డబ్బులున్నాయి. మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. గాంధీ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాం. యాక్షన్, కెమెరా, కట్ అని వెళ్లే వ్యక్తిని కాదు. పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాదు.
సీఎం అయ్యాకే సీఎం అని పిలవండి..
నా కోసమే ఆలోచిస్తే తిట్టినవారిని కింద కూర్చోబెట్టి నార తీసేవాడిని. ప్రజల కోసమే తిట్లు తింటున్నా. ఇంతకాలం మానసిక అత్యాచారాలు భరించా. ఎన్నో మాటలు పడ్డా.. నా సహనాన్ని తేలిగ్గా తీసుకోకండి. పవర్ వచ్చాకే పవర్ స్టార్ అని పిలవండి. సీఎం అయ్యాకే సీఎం అని పిలవండి. ఇప్పుడు జనసేనాని అని పిలవండి.
ఒక కులాన్ని వర్గ శత్రువుగా ప్రకటించడం మంచిది కాదు..
మేము బాధ్యతగా ఉంటాం. అధికార ఎమ్మెల్యేలకు కూడా పోలీసులు, అధికారులు బాధ్యతగా ఉండాలని చెప్పాలి. ఏ కులంలో పుట్టాలో ఎంపిక చేసుకునే అవకాశం లేదు. ఎలా ప్రవర్తించాలనేది మన చేతిలో ఉంది. కులంలో చాలా గొప్పోళ్లు ఉంటారు. ఒకరు అన్నారని కులాన్ని నిందించకూడదు. ఒక కులాన్ని వర్గ శత్రువుగా ప్రకటించడం మంచిది కాదు. కులాల పేరిట కొట్లాటలతో ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. రాష్ట్ర పెత్తనమంతా కేవలం రెండిళ్లకే పరిమితం అంటే కుదరదు. ప్రజాస్వామ్యంలో అణచివేత ఏమాత్రం శ్రేయస్కరం కాదు.
వైకాపా దేనికంటే దానికి సై..
గుంతలు లేని రహదారి రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా?జనసైన సైనికులపై దాడులు చేసి వేధిస్తున్నారు. భాజపా కార్యకర్తలను కూడా వైకాపా వదల్లేదు. వైకాపా దేనికంటే దానికి నేను సై. యువత వైకాపాకు ఓటు వేసింది. వైకాపా ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇచ్చిందా?పరిశ్రమలు రావాలి.. ఉద్యోగాలు కావాలి. రెండు వేలు, ఐదు వేలు ఇస్తామంటే కుదరదు. వైకాపాకు అధికారమిస్తే కులాల్ని కుళ్ల బొడుస్తోంది. రెడ్డి సామాజిక వర్గంలోనూ చాలా బాధ ఉంది. వారి చుట్టూ ఉండే వారికి తప్ప ఎవరికీ మేలు జరగట్లేదు.
చేయాల్సిన నేరాలు, ఘోరాలు చేస్తోంది..
సజ్జల.. మేము సమస్యల గురించి మాట్లాడుతాం. మా కార్యక్రమాన్ని అడ్డుకోవాలని పోలీసులకు చెప్పడం సరికాదు. వైకాపా ద్వంద వైఖరిని బలంగా ఎండగడతాం. వైకాపా చేయాల్సిన నేరాలు, ఘోరాలన్నీ చేస్తోంది. వివేకా హత్యపై వైకాపా ఎందుకు మాట్లాడదు. పోలీసులే మా వెంట పడితే మేం ఎవరికి చెప్పకోవాలి. క్రిమినల్ గ్యాంగ్కు వంతపాడి సెల్యూట్ చేయడం బాధగా ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వారి పని వాళ్లు చేయాలి. యంత్రాంగం తమ పని తాము చేయకపోతే రోడ్డు మీదికి మేము వస్తాం.
అందుకే తెదేపాకు మద్దతిచ్చా..
వచ్చే ఎన్నికల్లో జనసేన విజయకేతనం ఎగురవేస్తుంది. జనసేన అంటే వైకాపాకు భయం ఉంది. సభకు వచ్చే వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నవాణ్ని. పోతే ప్రాణం పోవాలి.. రాజకీయాల నుంచి పారిపోయేది లేదు. కోపాన్ని దాచుకునే కళ అందరూ నేర్చుకోవాలి. రాయలసీమలో కోపాన్ని మూడు తరాలు దాచుకుంటారు. మన కోపంతో అన్యాయం చేసేవాడికి వెన్నులో వణుకు పుట్టించాలి. కాపు, తెలగ, ఒంటరి, బలిజలు ముందుకొస్తే తప్ప రాష్ట్రం బాగుపడదు. కమ్మలకు జనసేన వ్యతిరేకం కాదని చెప్పేందుకు తెదేపాకు మద్దతిచ్చా. సమాజంలో మార్పు అనేది గోదావరి జిల్లాలపై ఆధారపడి ఉంది’’ అని పవన్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.