రైతుల ఆందోళనలో క్రికెటర్‌

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా హస్తిన సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్న అన్నదాతలకు పలువురు క్రీడా ప్రముఖులు ఇప్పటికే మద్దతు ప్రకటించారు. తాజాగా జాతీయ స్థాయి క్రికెటర్‌ మన్‌దీప్‌

Updated : 09 Dec 2020 13:26 IST

దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా హస్తిన సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్న అన్నదాతలకు పలువురు క్రీడా ప్రముఖులు ఇప్పటికే మద్దతు ప్రకటించారు. తాజాగా జాతీయ స్థాయి క్రికెటర్‌ మన్‌దీప్‌ సింగ్‌ రైతులకు మద్దతివ్వడమేగాక.. స్వయంగా వెళ్లి ఆందోళనలో పాల్గొన్నారు. తన సోదరుడు హర్వీందర్‌ సింగ్‌, మరో ముగ్గురు స్నేహితులతో కలిసి గత సోమవారం సాయంత్రం సింఘు సరిహద్దుకు వెళ్లిన మన్‌దీప్‌.. మంగళవారం సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. అన్నదాతలతో పాటు రోడ్డుపై బైఠాయించి నిరసనలో పాల్గొన్నారు. 

ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా చెప్పిన మన్‌దీప్‌.. రైతులు లేకపోతే మనకు ఆహారం ఉండదని, త్వరలోనే అన్నదాతల సమస్యలకు పరిష్కారం లభించాలని ఆకాంక్షించారు. ‘దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను చూసి చలించిపోయా. అందుకే వారికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నా. ఈ మధ్యే నా తండ్రి చనిపోయారు. నాన్న బతికుంటే ఆయన కూడా వచ్చి ఆందోళనలో పాల్గొనేవారు’ అని మన్‌దీప్‌ మీడియాతో చెప్పారు. 28ఏళ్ల మన్‌దీప్‌ ఇటీవల యూఏఈలో జరిగిన ఐపీఎల్‌లో పంజాబ్‌ తరఫున ఆడాడు. ఆ సమయంలోనే మన్‌దీప్‌ తండ్రి, అథ్లెటిక్స్‌ మాజీ కోచ్‌ హర్‌దేవ్‌ సింగ్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. తండ్రి మరణవార్త తెలిసినా.. ఆ బాధను దిగమింగుకుని మ్యాచ్‌ ఆడి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు.

కాగా.. రైతుల ఆందోళనకు ఇప్పటికే ప్రముఖ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ సహా పలువురు క్రీడాప్రముఖులు మద్దతు పలికారు. అన్నదాతలకు మద్దతుగా పంజాబ్‌కు చెందిన కొందరు క్రీడాకారులు తమ పురస్కారాలను వెనక్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 

ఇవీ చదవండి..

14వ రోజూ.. దిల్లీ శివారుల్లోనే రైతన్నలు

ఒక్కటైన నిలిచిన దేశం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని