tokyo olympics: పతక వీరుల వెనకున్నది వీరే!

తాజాగా జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు ఏడు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. నీరజ్‌ చోప్రా స్వర్ణం గెలవగా.. మీరాబాయి చాను, రవి కుమార్‌ దహియా రజత పతకాలు.. పీవీ సింధు, లవ్లీనా, బజరంగ్‌ పునియా, పురుషుల హాకీ జట్టుకు కాంస్య పతకాలు దక్కాయి. అయితే, ఈ అథ్లెట్ల విజయంలో

Published : 10 Aug 2021 01:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాజాగా జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు ఏడు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. నీరజ్‌ చోప్రా స్వర్ణం గెలవగా.. మీరాబాయి చాను, రవి కుమార్‌ దహియా రజత పతకాలు.. పీవీ సింధు, లవ్లీనా, బజరంగ్‌ పునియా, పురుషుల హాకీ జట్టుకు కాంస్య పతకాలు దక్కాయి. అయితే, ఈ అథ్లెట్ల విజయంలో వారి కష్టంతోపాటు.. కోచ్‌ల కీలక పాత్ర ఉంది. అథ్లెట్లను క్రీడల్లో ఛాంపియన్‌గా మలవడం కోసం వారు కూడా ఎంతో శ్రమిస్తుంటారు. మరి ఈ ఒలింపిక్స్‌ పతక వీరుల వెనకున్న కోచ్‌లు ఎవరు? తెలుసుకుందాం పదండి..

నీరజ్‌ చోప్రా - డాక్టర్‌ క్లాస్‌ బార్టోనియెట్జ్‌, ఉవె హాన్‌

జర్మనీకి చెందిన డాక్టర్‌ క్లాస్‌ బార్టోనియెట్జ్‌, ఉవె హాన్‌ ఇద్దరూ నీరజ్‌ చోప్రాకు కోచ్‌లుగా వ్యవహరించారు. 2018 కామన్‌వెల్త్‌, ఆసియా క్రీడల్లో నీరజ్‌ స్వర్ణ పతకాలు గెలిచిన తర్వాత అతడికి ఉవె హాన్‌ కోచ్‌గా మారారు. జావెలిన్‌ త్రోలో 100 మీటర్లకు మించి జావెలిన్‌ను విసిరిన ఏకైక అథ్లెట్‌ హాన్‌ మాత్రమే. ఆయన రికార్డును ఇప్పటి వరకు ఎవరూ బద్ధలు కొట్టలేకపోయారు. అలాంటి వ్యక్తి వద్ద నీరజ్‌ శిక్షణ తీసుకున్నాడు. 2019లో నీరజ్‌ చోప్రాకు మోచేయి శస్త్ర చికిత్స తర్వాత అతనికి వ్యక్తిగత కోచ్‌గా డాక్టర్‌ క్లాస్‌ బార్టోనియెట్జ్‌ నియమితులయ్యారు. డాక్టర్‌ క్లాస్‌కు జావెలిన్‌ త్రోలో ఉండే సమస్యలు అన్ని తెలుసు. దీంతో ఈ ఇద్దరు కోచ్‌లు కలిసి నీరజ్‌ను స్వర్ణ పతక వీరుడిగా తీర్చిదిద్దారు. 


మీరాబాయి చాను -  విజయ్‌ శర్మ

టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌ లిఫ్టింగ్‌లో రజతం సాధించిన మీరాబాయి చాను.. మాజీ వెయిట్‌ లిఫ్టర్‌ విజయ్‌ శర్మ వద్ద శిక్షణ తీసుకుంది. విజయ్‌ శర్మ 2014లో నేషనల్‌ ఛాంపియన్‌గా ఎదిగారు. అదే ఏడాది కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పురుషుల జట్టుకు ఇంఛార్జ్‌గా వ్యవహరించారు. చాను జయాపజయాల్లో ఆమెకు అండగా నిలిచారు. 2016లో వెయిట్‌ లిఫ్టింగ్‌లో విఫలమైనప్పుడు చానుకు ధైర్యం చెప్పి.. మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చేలా శిక్షణ ఇచ్చారు. దానికి ఫలితమే ఈ ఒలింపిక్స్‌లో ఆమె సాధించిన రజత పతకం. 


రవి కుమార్‌ దహియా - కమల్‌ మాలికొవ్‌

రష్యాకు చెందిన కమల్‌ మాలికొవ్‌.. భారత రెజ్లర్‌ సుశీల్‌కుమార్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేలా క్వాలిఫికేషన్‌ పోటీల్లో గెలుపొందడం కోసం శిక్షణ ఇవ్వడానికి భారత్‌కు వచ్చారు. అయితే, సుశీల్‌ ఓ కేసులో ఇరుక్కుపోవడంతో అది సాధ్యపడలేదు. దీంతో గత ఏప్రిల్‌ నెలలో మాలికొవ్‌ను ప్రభుత్వం టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌(టాప్స్‌)లో చేర్చుకుంది. ప్రముఖ రెజ్లర్‌ సత్పాల్‌ సింగ్‌ వద్ద శిక్షణ పొందిన రవి కుమార్‌ దహియా ఒలింపిక్స్‌ కోసం సన్నద్ధమవుతున్న వేళ.. మాలికొవ్‌ను అతడికి కోచ్‌గా నియమించారు. దీంతో రవి కుమార్‌ను మాలికొవ్‌ తనతోపాటు రష్యాకు తీసుకెళ్లి కఠోర శిక్షణ ఇప్పించారు. అలా రవి కుమార్‌ రెజ్లింగ్‌లో నైపుణ్యం సాధించి రజత పతకం పట్టాడు. 


బజరంగ్‌ పునియా - షాకో బెంటినిడిస్‌

రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన బజరంగ్‌ పునియాకు జార్జియాకు చెందిన షాకో బెంటినిడిస్‌ శిక్షణ ఇచ్చారు. బజరంగ్ రింగులో తనపై స్పీడ్‌గా అటాక్‌ చేసే రెజ్లర్‌ కోసం ఆన్వేషించేవాడు. అలాంటి వారితో ఆట ఆడుతున్నప్పుడు స్పీడ్‌ అటాక్‌లో తన లెగ్‌ డిఫెన్స్‌ను మెరుగుపర్చుకోవాలని భావించాడు. అదే సమయంలో షాకో బెంటినిడిస్‌ కోచ్‌గా మారాడు. బజరంగ్‌ బలహీనతలను గుర్తించి వాటిని అధిగమించడంలో, బలాన్ని ఏ విధంగా ఉపయోగించాలో తర్ఫీదునిచ్చి ఒలింపిక్స్‌కు సిద్ధం చేశాడు. కోచ్‌ దిశనిర్దేశంలో అద్భుతమైన ప్రదర్శన చేసిన బజరంగ్‌ కాంస్య పతకంతో మెరిశాడు. 


లవ్లీనా - రాఫెల్‌ బెర్గామాస్కో

మెర్గామాస్కో.. ఇటలీకి చెందిన ఈ బాక్సర్‌ ఐదు సార్లు బాక్సింగ్‌లో నేషనల్‌ ఛాంపియన్‌గా నిలిచారు. బీజింగ్‌, లండన్‌, రియో ఒలింపిక్స్‌లో ఇటలీ జట్టు కోచ్‌గా వ్యవహరించారు. అతడి శిక్షణలో ఇటలీ అథ్లెట్లు ఆరు ఒలింపిక్‌ పతకాలు సాధించారు. 2017లో భారత్‌కు వచ్చి ఇక్కడి బాక్సర్లకు కోచ్‌గా మారారు. అదే ఏడాది నవంబర్‌లో యూత్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో అతడి వద్ద శిక్షణ తీసుకున్న భారత బాక్సర్లు ఐదు స్వర్ణం, రెండు కాంస్య పతకాలు సాధించారు. దీంతో రాఫెల్‌ శిక్షణను మెచ్చిన ప్రభుత్వం సీనియర్‌ వుమెన్‌ బాక్సింగ్‌ విభాగానికి హై పర్ఫామెన్స్‌ డైరెక్టర్‌గా నియమించింది. ఆయన ఆధ్వర్యంలోనే లవ్లీనా ఒలింపిక్స్‌ పోటీలకు సిద్ధమై.. పతకం సాధించింది. 


పీవీ సింధు - పార్క్‌ టాయి సంగ్‌

తెలుగుతేజం పీవీ సింధు బ్యాడ్మింటన్‌ క్రీడలో సాధించని విజయం లేదు. అంతర్జాతీయ టోర్నీలో తన సత్తా ఏంటో ఇప్పటికే చాటుకుంది. అయితే, రియో ఒలింపిక్స్‌లో రజతంతో మెరిసిన సింధు.. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ ఛాంపియన్లతో గెలవాలంటే సింధుకి ఉన్న బలం, వేగంతోపాటు ఆటలో కాస్త వైవిధ్యం అవసరమైంది. ఈ క్రమంలోనే దక్షిణ కొరియాకు చెందిన పార్క్‌ టాయి సాంగ్‌ వద్ద శిక్షణ తీసుకుంది. పార్క్‌.. సింధుకు ఆటలో మెలుకువలు నేర్పించారు. మ్యాచ్‌ల సమయంలోనూ నెట్‌ దగ్గరే ఉండి ఆమెను ప్రోత్సహించారు. కానీ, సింధు సెమీఫైనల్‌లో ఓడిపోయింది. అయినా ఆమెలో పార్క్‌ ఆత్మవిశ్వాసాన్ని నింపారు. కోచ్‌ ప్రోత్సాహంతో కాంస్యం కోసం జరిగిన పోటీలో సింధు వరుసగా రెండు గేమ్స్‌ గెలిచి కాంస్య పతకాన్ని ముద్దాడింది. 


హాకీ జట్టు - గ్రాహం రీడ్‌

41 ఏళ్ల తర్వాత భారత హాకీ జట్టు పతకం సాధించిందంటే దీనికి కారణం ఆ జట్టు కోచ్‌ గ్రాహం రీడ్‌ అనడంలో సందేహం లేదు. రియో ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా జట్టుకు రీడ్‌ కోచ్‌గా ఉన్నారు. ఆ సమయంలో క్వార్టర్‌ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా జట్టు నెదర్లాండ్‌ చేతిలో 4-0తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో అప్పటి నుంచి అనూహ్య పరిస్థితుల్లోనూ భారీ మూల్యం చెల్లించే తప్పులను ఎలా నివారించాలో ఆటగాళ్లకు చెప్పడం మొదలుపెట్టారు. ఒలింపిక్స్‌లో భారత్‌ హాకీ జట్టుకు కోచ్‌గా వచ్చిన రీడ్‌.. సెమీఫైనల్‌లో బెల్జియం చేతిలో ఓడిపోయిన తర్వాత భారత ఆటగాళ్లు నిరూత్సాహంలో ఉన్నప్పుడు వారిలో ఆత్మవిశ్వాసం నింపారు. కాంస్య పతక పోరుకు సన్నద్ధం చేశారు. కోచ్‌ ఇచ్చిన ధైర్యంతో కాంస్యం కోసం భారత్‌.. జర్మనీతో తలపడింది. ఉత్కంఠంగా సాగిన ఆ మ్యాచ్‌లో 5-4 తేడాలో భారత్‌ గెలిచి కాంస్య పతకాన్ని సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని