కోహ్లీసేన.. ఓటమితోనే ఆరంభం

ఐదు టీ20ల సిరీస్‌ను టీమ్‌ఇండియా ఓటమితో ఆరంభించింది. ఇంగ్లాండ్‌తో తొలిపోరులో 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. భారత్‌ నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు కేవలం 15.3 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు జేసన్‌ రాయ్‌ (49), బట్లర్‌ (28) మెరుపు ఆరంభాన్నిచ్చారు. అంతకు ముందు

Updated : 12 Mar 2021 22:38 IST

8 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్‌

కోహ్లీసేన.. మళ్లీ అదే దారిలో నడిచింది. సుదీర్ఘ ఫార్మాట్‌ తరహాలోనే పొట్టి క్రికెట్‌ సిరీస్‌నూ ఓటమితోనే ఆరంభించింది. మొతేరాలో ఇంగ్లాండ్‌తో తలపడ్డ తొలి టీ20లో పరాజయం చవిచూసింది. 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. టీమ్‌ఇండియా నిర్దేశించిన నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ కేవలం 15.3 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు జేసన్‌ రాయ్‌ (49; 32 బంతుల్లో 4×4, 3×6), జోస్‌ బట్లర్‌ (28; 24 బంతుల్లో 2×4, 1×6) మెరుపు ఆరంభాన్నివ్వగా డేవిడ్‌ మలన్‌ (24*; 20 బంతుల్లో 2×4, 1×6), జానీ బెయిర్‌స్టో (26*; 17 బంతుల్లో 1×4, 2×6) మ్యాచ్‌ను ముగించారు. వీరంతా భారీ సిక్సర్లు, బౌండరీలతో చెలరేగారు. అంతకు ముందు భారత్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ (67; 48 బంతుల్లో 8×4, 1×6) అర్ధశతకం చేశాడు.

టాప్‌ ఆర్డర్‌ టపటపా..

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కలేదు. 3 పరుగులకే 2 వికెట్లు చేజార్చుకుంది. ఇంగ్లాండ్‌ పేసర్లు చక్కని పేస్‌తో కోహ్లీసేనను విలవిల్లాడేలా బంతులు విసిరారు. భారీ షాట్లు ఆడేందుకు అవకాశమే ఇవ్వలేదు. ఆర్చర్‌ (3/23) వేసిన రెండో ఓవర్లో దూరంగా వెళ్తున్న బంతిని ఆడిన రాహుల్‌ ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ రూపంలో బౌల్డయ్యాడు. మరికాసేపటికే విరాట్‌ కోహ్లీ (0) ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో జోర్డాన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. 20 పరుగుల వద్ద మార్క్‌ వుడ్‌ వేసిన ఐదో ఓవర్‌ చివరి బంతికి ధావన్‌ (3) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

ఆదుకున్న శ్రేయస్‌

కష్టాల్లో పడ్డ జట్టును రిషభ్ పంత్‌ (21; 23 బంతుల్లో 2×4, 1×6)తో కలిసి శ్రేయస్‌ అయ్యర్‌ గట్టెక్కించేందుకు ప్రయత్నించాడు. నాలుగో వికెట్‌కు 28 పరుగుల భాగస్వామ్యం అందించాడు. ఆర్చర్‌ బౌలింగ్‌ పంత్‌ రివర్స్‌స్వీప్‌తో కొట్టిన భారీ సిక్సర్‌ అభిమానులను అలరించింది. స్కోరు వేగం పెంచే క్రమంలో పదో ఓవర్‌ చివరి బంతికి పంత్‌ ఔటయ్యాడు. ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్య (19; 21 బంతుల్లో 1×4, 1×6)తో కలిసి ఐదో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యం అందించాడు శ్రేయస్‌. ఇంగ్లాండ్‌ పేసర్లు పాండ్యను సిక్సర్లు కొట్టకుండా తెలివిగా బంతులు వేశారు. అర్ధశతకం తర్వాత అయ్యర్‌ను జోర్డాన్‌, పాండ్య, శార్దూల్‌ను ఆర్చర్‌ ఔట్‌ చేశారు. టీమ్‌ఇండియాను 124/7కు పరిమితం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని