స్టెప్పుల జోరు.. పాటల హుషారు

కరోనా కారణంగా గత రెండు సీజన్లలో టీ20 లీగ్‌ ముగింపు వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించలేదు. కానీ ఈ సారి 15వ సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు సందడి అంబరాన్ని తాకింది. బాణాసంచా మెరుపులు.. విద్యుత్‌ దీపాలు వెలుగులు.. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో కిక్కిరిసిన ప్రేక్షకులు మధ్య  వైభవంగా...

Updated : 30 May 2022 09:34 IST

కరోనా కారణంగా గత రెండు సీజన్లలో టీ20 లీగ్‌ ముగింపు వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించలేదు. కానీ ఈ సారి 15వ సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు సందడి అంబరాన్ని తాకింది. బాణాసంచా మెరుపులు.. విద్యుత్‌ దీపాలు వెలుగులు.. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో కిక్కిరిసిన ప్రేక్షకులు మధ్య  వైభవంగా వేడుకలు జరిగాయి. బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ తన నృత్య ప్రదర్శనతో సరికొత్త ఉత్సాహాన్ని తెచ్చాడు. తెలుగు సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నా పాట సూడు నాటు నాటు’ గీతానికి అతను కాళ్లు కదపడం విశేషం. ఆ తర్వాత దిగ్గజం ఏఆర్‌ రెహమాన్‌ సంగీత ప్రదర్శన ఆకట్టుకుంది. స్టాండ్స్‌లో అక్షయ్‌ కుమార్‌ కనిపించాడు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మ్యాచ్‌కు హాజరయ్యారు.

జెర్సీతో గిన్నిస్‌ రికార్డు..

15 ఏళ్ల టీ20 లీగ్‌ ప్రయాణాన్ని పురస్కరించుకుని ఫైనల్‌కు ముందు బీసీసీఐ ఆధ్వర్యంలో స్టేడియంలో ఏర్పాటు చేసిన అతిపెద్ద జెర్సీ (66/42 మీటర్లు)కి గిన్నిస్‌ రికార్డు దక్కింది. ప్రపంచంలోనే అతిపెద్ద మొతెరా మైదానంలో.. ఈ జెర్సీని ఏర్పాటు చేశారు. దాదాపు సగం మైదానాన్ని ఆక్రమించిన ఈ జెర్సీపై 15 ఏళ్ల టీ20 లీగ్‌ అనే పేరుతో పాటు 10 జట్ల లోగోలు ముద్రించారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ జెర్సీగా గిన్నిస్‌ రికార్డును దాని ప్రతినిధులు.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, కార్యదర్శి జై షా, టీ20 లీగ్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌కు అందించారు.

2008 ఛాంపియన్లకు సత్కారం..

టీ20 లీగ్‌ ఆరంభ సీజన్‌లో దివంగత దిగ్గజం షేన్‌వార్న్‌ సారథ్యంలో రాజస్థాన్‌ టైటిల్‌ నెగ్గిన సంగతి తెలిసిందే. 15వ సీజన్‌ ఫైనల్‌ సందర్భంగా అప్పటి ఛాంపియన్లను రాజస్థాన్‌ ప్రత్యేకంగా సత్కరించింది. అప్పటి జట్టు ఆటగాళ్లు రవీంద్ర జడేజా, మునాఫ్‌ పటేల్‌, యూసుఫ్‌ పఠాన్‌, స్వప్నిల్‌, దినేశ్‌ సాలుంకె, సిద్ధార్థ్‌ త్రివేది, గ్రేమ్‌ స్మిత్‌లను మేనేజ్‌మెంట్‌ ఆహ్వానించింది.


టీ20 లీగ్ టైటిల్‌ నెగ్గిన ఏడో జట్టు గుజరాత్‌. అంతకుముందు రాజస్థాన్‌ (2008), ఒకప్పటి డెక్కన్‌ ఛార్జర్స్‌ (2009), హైదరాబాద్‌ (2016), కోల్‌కతా (2012, 2014), చెన్నై (2010, 2011, 2018, 2021), ముంబయి (2013, 2015, 2017, 2019, 2020) విజేతలుగా నిలిచాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు