Women T20 World Cup: మహిళా సభ్యులతో తొలిసారిగా ప్యానెల్‌..భారత్‌ నుంచి ముగ్గురికి చోటు

ప్రపంచ క్రికెట్‌లో తొలిసారిగా మహిళా సభ్యులతో ఐసీసీ ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ముగ్గురు భారతీయ మహిళా క్రికెటర్లకు స్థానం దక్కింది.

Published : 28 Jan 2023 01:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ క్రికెట్‌లో తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్‌ సమాఖ్య మహిళా సభ్యులతో ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. అందులో ముగ్గురు భారత్‌ మహిళా క్రికెటర్లు జీఎస్‌ లక్ష్మి, వ్రిందా రాతి, జనని నారాయణన్‌లకు ప్యానెల్‌లో చోటు దక్కింది. త్వరలో దక్షిణాఫ్రికాలో జరిగే మహిళల టీ20 ప్రపంచకప్‌లో వారు భాగం కానున్నారు. ముగ్గురు మ్యాచ్‌ రిఫరీలు, 10 మంది అంపైర్లతో మొత్తం 13 మందిని ఐసీసీ ఎంపిక చేసింది. ఇందులో 8 మంది 2020లో జరిగిన టీ20 ప్రపంచకప్‌, గతేడాది జరిగిన ప్రపంచకప్‌లో విధులు నిర్వర్తించారు. 9మంది ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్‌19 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో విధులు నిర్వహిస్తున్నారు. వ్రిందా రాతి, జనని నారాయణన్‌ తొలిసారిగా గత నెలలో రంజీ ట్రోఫీలో అంపైరింగ్‌ చేశారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2023లో భారత్‌ నుంచి జీఎస్‌ లక్ష్మి రిఫరీగా ఎంపికయ్యారు. వ్రిందా రాతి, జనని అంపైరింగ్ చేయనున్నారు. 
 
ఐసీసీ క్రికెట్‌ జనరల్‌ మేనేజర్‌ వసీం ఖాన్‌ మాట్లాడుతూ..‘ఇటీవల మహిళల క్రికెట్‌ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అందువల్ల మహిళలకు అత్యున్నత స్థాయిలో అంపైరింగ్‌ చేసే అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించాం. క్రికెట్‌లో పరుషులు, మహిళలకు సమానమైన అవకాశాలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని అన్నారు. మహిళల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడానికి, వారికి అత్యున్నత స్థాయి అవకాశాలు కల్పించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని