WTC Final - IND vs AUS: కథ మారేనా.. గద చిక్కేనా..!
జూన్ 23, 2013.. ధోని సారథ్యంలోని టీమ్ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తేదీ. అది జరిగి.. ఇప్పుడు పదేళ్లు కావస్తోంది. మధ్యలో రెండు వన్డే ప్రపంచకప్లు వెళ్లిపోయాయి. నాలుగు టీ20 పొట్టి కప్పులూ జరిగాయి. ఓ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా నిర్వహించారు.
జూన్ 7 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్
జూన్ 23, 2013.. ధోని సారథ్యంలోని టీమ్ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తేదీ. అది జరిగి.. ఇప్పుడు పదేళ్లు కావస్తోంది. మధ్యలో రెండు వన్డే ప్రపంచకప్లు వెళ్లిపోయాయి. నాలుగు టీ20 పొట్టి కప్పులూ జరిగాయి. ఓ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా నిర్వహించారు. కానీ భారత ఐసీసీ ట్రోఫీ నిరీక్షణ మాత్రం కొనసాగుతూనే ఉంది. దాదాపు దశాబ్దం గడుస్తున్నా మరో ఐసీసీ టైటిల్ మాత్రం దక్కలేదు. ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రూపంలో టీమ్ఇండియాకు మరో అవకాశం వచ్చింది. మరి మన ఆటగాళ్లు ఇప్పుడైనా విజేతగా నిలిచి ఐసీసీ ట్రోఫీల కరవు తీరుస్తారేమో చూడాలి.
ఈనాడు క్రీడావిభాగం
ఊరించి.. ఉసూరుమనిపించి
వన్డే లేదా టీ20 ప్రపంచకప్.. ఇలా ప్రతిసారి మెగా టోర్నీ రాగానే భారత్ విజేతగా నిలుస్తుందని అభిమానులు ఆశలు పెంచుకోవడం.. జట్టేమో కప్పును అందుకోకుండానే నిష్క్రమించడం ఈ మధ్య కాలంలో పరిపాటిగా మారింది. కెప్టెన్లు మారినా.. జట్టులో మార్పులు జరిగినా.. మరో ఐసీసీ కప్పు కల మాత్రం నెరవేరడం లేదు. ధోని సారథ్యంలో 2011 వన్డే ప్రపంచకప్లో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. కానీ ఆ తర్వాత రెండు వన్డే ప్రపంచకప్ల్లోనూ రిక్తహస్తమే మిగిలింది. 2015, 2019ల్లో సెమీస్లోనే జట్టు నిష్క్రమించింది. 2015లో ఆస్ట్రేలియా చేతిలో, 2019లో న్యూజిలాండ్ చేతిలో ఓడింది. టీ20 ప్రపంచకప్లో అయితే దాదాపు 16 ఏళ్లుగా ఎదురు చూపులు తప్పడం లేదు. 2007లో మొట్టమొదటి టీ20 ప్రపంచకప్లో ధోని కెప్టెన్సీలోని భారత్ కప్పు సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత నుంచి మరో కప్పు కోసం జట్టు పోరాడుతూనే ఉంది. 2014లో అందినట్లే అంది టైటిల్ చేజారింది. అప్పుడు ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓటమి ఎదురైంది. 2016లో సెమీస్లో వెస్టిండీస్ చేతిలో పరాభవం తప్పలేదు. కెప్టెన్గా ధోనీకి అదే చివరి ప్రపంచకప్. మరోవైపు 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఖరి మెట్టుపై భారత్ బోల్తా పడింది. కోహ్లి కెప్టెన్సీలోని టీమ్ఇండియా.. ఆ తుదిపోరులో చిరకాల ప్రత్యర్థి పాక్ చేతిలో చిత్తయింది. ఆ ఓటమి కంటే కూడా ఓడిన తీరు మరింత ఆవేదన కలిగించింది. 2019 వన్డే, 2021 టీ20 ప్రపంచకప్లతో పాటు 2021 ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ జట్టును నడిపించిన కోహ్లి.. కెప్టెన్గా ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలనే కలను సాకారం చేసుకోలేకపోయాడు. ఇక రోహిత్ నాయకత్వంలోని భారత్ నిరుడు టీ20 ప్రపంచకప్ సెమీస్లో ఇంగ్లాండ్ చేతిలో మట్టికరిచింది.
గెలిచేలా కనిపించి..
టెస్టులకు ఆదరణ పెంచేందుకు ఐసీసీ ప్రయోగాత్మకంగా 2019లో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)కు శ్రీకారం చుట్టింది. ఇందులో కోహ్లి కెప్టెన్సీలోని టీమ్ఇండియా అద్భుత ప్రదర్శన చేసింది. ఆడిన 6 సిరీస్లకు గాను అయిదింటిని సొంతం చేసుకుని, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో ఆరంభ డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధించింది. న్యూజిలాండ్తో 2021 జూన్ 18 నుంచి 23 వరకు ఈ తుది పోరు జరిగింది. వర్షం కారణంగా రెండు రోజుల ఆట సాధ్యం కాకపోవడంతో రిజర్వ్ డే అయిన ఆరో రోజూ మ్యాచ్ నిర్వహించాల్సి వచ్చింది. ఇంగ్లాండ్లోని సౌథాంప్టన్లో జరిగిన ఈ మ్యాచ్లో టీమ్ఇండియానే ఫేవరెట్గా కనిపించింది. అప్పటికే ఈ డబ్ల్యూటీసీ చక్రంలో 1000కి పైగా పరుగులు చేసిన ఆటగాళ్లలో రహానె, రోహిత్ ఉండడంతో పాటు కోహ్లి కూడా మంచి ఫామ్లో కనిపించాడు. అత్యధిక వికెట్లు పడగొట్టిన అశ్విన్తో పాటు పేసర్లు షమి, బుమ్రా, ఇషాంత్తో బౌలింగ్ విభాగమూ పటిష్ఠంగా ఉంది. శుభ్మన్, పుజారా, పంత్, జడేజా.. ఇలా బలమైన జట్టు బరిలో దిగింది. కానీ మంచి అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో విఫలమైన భారత్.. బ్యాటింగ్, బౌలింగ్లో రాణించలేక సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీని అందుకునే ఛాన్స్ చేజార్చుకుంది. తొలి ఇన్నింగ్స్లో 217కే ఆలౌటైన భారత్.. ప్రత్యర్థి (249 ఆలౌట్)ని బాగానే కట్టడి చేసింది. కానీ రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 170కే కుప్పకూలింది. దీంతో 139 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించిన కివీస్ మొట్టమొదటి డబ్ల్యూటీసీ గదను దక్కించుకుంది.
కంగారూల సవాల్..
ఇప్పుడు వరుసగా రెండో సారి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడబోతున్న టీమ్ఇండియాకు, ఐసీసీ ట్రోఫీకి మధ్య ఆస్ట్రేలియా అడ్డుగా ఉంది. 2021-23 డబ్ల్యూటీసీ చక్రంలోనూ భారత్ ఆధిపత్యం చలాయించినా కొంత తడబాటు తప్పలేదు. ఒడుదొడుకులు దాటి 18 మ్యాచ్ల్లో 10 విజయాలు, 3 డ్రాలతో పట్టికలో రెండో స్థానంతో తుదిపోరుకు అర్హత సాధించింది. కానీ ఈ సారి బ్యాటింగ్లో నిలకడగా రాణించిన ఆటగాళ్లు లేరు. భారత్ తరపున అత్యుత్తమ ప్రదర్శన పుజారా (16 మ్యాచ్ల్లో 887 పరుగులు)దే. ఆ తర్వాత కోహ్లి (16 మ్యాచ్ల్లో 869) ఉన్నాడు. కాస్త మెరుగ్గా కనిపించిన పంత్ (12 మ్యాచ్ల్లో 868) ఇప్పుడు జట్టుతో లేడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే అశ్విన్ (13 మ్యాచ్ల్లో 61 వికెట్లు) ఎప్పటిలాగే అదరగొడుతున్నాడు. కానీ ఆ తర్వాత ఉత్తమ ప్రదర్శన చేసిన భారత్ బౌలర్ బుమ్రా (10 మ్యాచ్ల్లో 45) జట్టుకు దూరమయ్యాడు. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుంటున్న పంత్తో పాటు గాయాలతో బుమ్రా, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఈ తుదిపోరుకు అందుబాటులో లేకపోవడంతో జట్టుకు ముందే ఎదురు దెబ్బ తగిలింది. మరోవైపు బ్యాటింగ్లో ఖవాజా (1608 పరుగులు), లబుషేన్ (1509), స్మిత్ (1252), హెడ్ (1208).. బౌలింగ్లో లైయన్ (83 వికెట్లు), కమిన్స్ (53), స్టార్క్ (51)తో ఆస్ట్రేలియా దుర్బేధ్యంగా కనిపిస్తోంది. తాజా సంచలనం కామెరూన్ గ్రీన్తో ఆ జట్టు మరింత బలపడింది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న వనరులతో అత్యుత్తమ కూర్పును బరిలో దించి, మంచి ప్రదర్శన చేసేలా సహచరుల్లో స్ఫూర్తి నింపి.. కెప్టెన్ రోహిత్ అయినా టీమ్ఇండియా నిరీక్షణకు ముగింపు పలకాలన్నది అభిమానుల ఆశ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: మాదాపూర్లో క్షణాల్లో నేలమట్టమైన బహుళ అంతస్తుల భవనాలు
-
Phonepe appstore: గూగుల్కు పోటీగా ఫోన్పే కొత్త యాప్స్టోర్
-
ఎక్స్ ఇండియా హెడ్ రాజీనామా.. కారణమిదేనా?
-
Cricket News: సిరాజ్ స్పెషల్ అదేనన్న ఏబీడీ... జట్టుకు కాంబినేషనే కీలకమన్న షమీ!
-
Chandrababu Arrest: చంద్రబాబు విడుదలయ్యే వరకు దీక్ష కొనసాగిస్తా: కాలవ శ్రీనివాసులు
-
TS Election: చురుగ్గా ఏర్పాట్లు.. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు?