IND vs AUS: గిల్‌ సెంచరీ.. కోహ్లీ హాఫ్‌ సెంచరీ.. మూడో రోజు ఆట పూర్తి

భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది.

Updated : 11 Mar 2023 17:34 IST

అహ్మదాబాద్‌: భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా మూడు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (59; 128 బంతుల్లో 5 ఫోర్లు బ్యాటింగ్‌), రవీంద్ర జడేజా (16; 54 బంతుల్లో 1 సిక్స్‌ బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 191 పరుగుల వెనుకంజలో ఉంది. శుభ్‌మన్‌ గిల్ (128; 235 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌) శతకం బాదగా.. ఛెతేశ్వర్‌ పుజారా (42; 121 బంతుల్లో 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్‌ లైయన్‌, మాథ్యూ కునెమన్‌, టాడ్‌ మార్ఫీ తలో వికెట్‌ పడగొట్టారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 480 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

ఓవర్‌ నైట్ స్కోరు  36/0తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమ్‌ఇండియా కాసేపు నిలకడగానే ఆడింది. ఓ గంట తర్వాత భారత్‌కు షాక్‌ తగిలింది. రోహిత్ శర్మ (35).. కునెమన్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడేందుకు యత్నించి షార్ట్‌ కవర్‌ పాయింట్‌లోని లబుషేన్‌ చేతికి చిక్కాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి గిల్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలో లంచ్‌ బ్రేక్ సమయానికి భారత్‌ వికెట్ నష్టానికి 129 పరుగులు చేసింది. రెండో సెషన్‌ ప్రారంభంలో ఆసీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో భారత్ బ్యాటర్లు నిదానంగా ఆడారు. తర్వాత కాస్త దూకుడు పెంచారు. టీ విరామానికి ముందు గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కొద్ది సేపటికే పుజారా ఔటయ్యాడు. అతడు మర్ఫీ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. రెండో సెషన్‌లో భారత్‌ 59 పరుగులు మాత్రమే రాబట్టి రెండు వికెట్లను కోల్పోయింది. 

మూడో సెషన్‌లో కోహ్లీ దూకుడు 

188/2తో చివరి సెషన్‌ను ఆరంభించింది భారత్. ఈ సెషన్లో మొదట్లో నెమ్మదిగా ఆడిన కోహ్లీ తర్వాత  బ్యాట్‌ను ఝుళిపించాడు. స్టార్క్, మర్ఫీ వేసిన వరుస ఓవర్లలో బౌండరీలు బాదాడు. కొద్దిసేపటికే అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడిన గిల్‌.. లైయన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు. డీఆర్‌ఎస్‌కు వెళ్లినా.. సమీక్షలోనూ ఔట్‌గా తేలడంతో పెవిలియన్‌ బాట పట్టాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజా నిదానంగా ఆడగా.. కోహ్లీ నిలకడగా పరుగులు రాబట్టి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. కోహ్లీకిది టెస్టుల్లో గత 16 ఇన్నింగ్స్‌ల్లో మొదటి హాఫ్‌ సెంచరీ కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని