హిట్‌మ్యాన్‌ షో!

ఓపెనర్‌ రోహిత్ శర్మ (161; 231 బంతుల్లో, 18×4, 2×6) భారీ శతకంతో విజృంభించడంతో తొలి రోజు ఆటలో టీమిండియా పైచేయి సాధించింది. చెపాక్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో...

Updated : 13 Feb 2021 17:32 IST

తొలి రోజు ఆటలో భారత్ 300/6

ఇంటర్నెట్‌డెస్క్‌: ఓపెనర్‌ రోహిత్ శర్మ (161; 231 బంతుల్లో, 18×4, 2×6) భారీ శతకంతో విజృంభించడంతో తొలి రోజు ఆటలో టీమిండియా పటిష్ఠ స్థితిలో నిలిచింది. చెపాక్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసేసరికి భారత్‌ ఆరు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె (67; 149 బంతుల్లో, 9×4) అర్ధశతకంతో రాణించాడు. క్రీజులో రిషభ్‌ పంత్ (33*, 56 బంతుల్లో, 5×4, 1×6), అక్షర్‌ పటేల్ (5*, 7 బంతుల్లో, 1×4)‌ ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో లీచ్, మొయిన్‌ అలీ చెరో రెండు, స్టోన్‌, రూట్‌ తలో వికెట్ తీశారు.

గిల్‌, కోహ్లీ డకౌట్‌

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే షాక్! ఖాతా తెరవకముందే శుభ్‌మన్‌ గిల్‌ను స్టోన్‌ ఔట్‌ చేశాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమైన యువఓపెనర్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన పుజారాతో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. పిచ్‌ బౌలర్లకు సహకరిస్తున్నా దూకుడుగా పరుగులు సాధించాడు. 47 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు.

మరోవైపు ఇంగ్లాండ్‌ బౌలర్లు పుంజుకుని వరుస ఓవర్లలో పుజారా (21; 58 బంతుల్లో, 2×6), విరాట్‌ కోహ్లీ (0)ని పెవిలియన్‌కు చేర్చారు. లీచ్‌ బౌలింగ్‌లో పుజారా స్లిప్‌లో ఉన్న స్టోక్స్‌కు దొరకగా, కోహ్లీని అలీ బౌల్డ్‌ చేశాడు. దీంతో లంచ్‌ విరామానికి టీమిండియా 106/3తో నిలిచింది.


రెండో సెషన్‌లో పూర్తి ఆధిపత్యం

పిచ్‌ బౌలర్లకు సహకరిస్తుండటంతో టీమిండియా మరోసారి తక్కువ స్కోరుకు వెనుదిరుగుతుందేమోనని భావించారంతా. కానీ హిట్‌మ్యాన్‌ షోకు రహానె క్లాస్‌ ఇన్నింగ్స్‌ తోడవ్వడంతో భారత్ పట్టుబిగించింది. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 162 పరుగులు జోడించారు. రెండో సెషన్‌లో వికెట్‌ కోల్పోకుండా సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో రోహిత్ శతకం అందుకున్నాడు. 130 బంతుల్లో సాధించాడు. రహానె కూడా 104 బంతుల్లో అర్ధశతకం సాధించడంతో టీ విరామానికి భారత్‌ 189/3తో మంచి స్థితిలో నిలిచింది.


చివరి సెషన్‌లో 3 వికెట్లు

అనంతరం ఆఖరి సెషన్‌లోనూ రోహిత్‌, రహానె జోరు తగ్గలేదు. లైన్‌ అండ్ లెంగ్త్ బంతుల్ని గౌరవిస్తూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధించారు. రోహిత్‌ 208 బంతుల్లో 150 మార్క్‌ను అందుకున్నాడు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు వెనుదిరిగారు. లీచ్‌ బౌలింగ్‌లో భారీషాట్‌కు యత్నించి హిట్‌మ్యాన్‌ ఔటవ్వగా.. తర్వాతి ఓవర్‌లోనే రహానెను అలీ బౌల్డ్ చేశాడు. దీంతో 249 పరుగులకు టీమిండియా సగం వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్‌, అశ్విన్‌ దూకుడుగా పరుగులు సాధించారు. పంత్ ధనాధన్ షాట్లతో అలరించాడు. అయితే ఆట ఆఖరిలో అశ్విన్‌ (13; 19 బంతుల్లో, 1×4) ను రూట్ ఔట్ చేశాడు.

తొలి రోజు ఆటలో హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్‌ హైలైట్‌. పిచ్‌ సహకారంతో ఇంగ్లాండ్ బౌలర్లు అదనపు బౌన్స్‌, టర్న్‌తో వికెట్లు సాధిస్తునా.. మరోవైపు రోహిత్‌ మాత్రం ముచ్చటైన షాట్లు ఆడాడు. లాఫ్టెడ్, స్వీప్‌ షాట్లతో పరుగులు రాబట్టాడు. కరోనా విరామం తర్వాత తొలిసారి స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచాడు. విమర్శకులకు సమాధానం చెబుతూ శతకం సాధించాడు. టెస్టుల్లో అతడికిది ఏడో సెంచరీ. అన్ని శతకాలు స్వదేశంలోనే సాధించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని