Indw vs Ausw: తొలి టీ20లో భారత్‌పై ఆసీస్‌ ఘన విజయం

మహిళల టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టీ20లో ఆసీస్‌ అదరగొట్టింది. టీమ్‌ఇండియాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యం సంపాదించింది.

Updated : 09 Dec 2022 22:26 IST

ముంబయి: మహిళల టీ20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టీ20లో ఆసీస్‌ అదరగొట్టింది. టీమ్‌ఇండియాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యం సాధించింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 18.1 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే  నష్టపోయి ఛేదించింది. ఆసీస్‌ ఓపెనర్‌ బెత్ మూనీ (89; 57 బంతుల్లో 16 ఫోర్లు) విజయంలో కీలకపాత్ర పోషించింది. అలిస్సా హీలీ (37; 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా.. తహ్లియా మెక్‌గ్రాత్ (40) ఫర్వాలేదనిపించింది. భారత బౌలర్లలో దేవిక వైద్య ఒక వికెట్ పడగొట్టగా మిగతా బౌలర్లు ఒక్క వికెట్టూ కూడా పడగొట్టలేకపోయారు. 

ఓపెనర్లు తొలి మూడు ఓవర్లపాటు నెమ్మదిగా ఆడినా తర్వాత నుంచి జోరు పెంచారు. దీంతో 8 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు 68/0గా నమోదైంది. ఈ జోడీ దూకుడుకు తొమ్మిదో ఓవర్‌లో దేవిక వైద్య బ్రేక్‌లు వేసింది. అలిస్సాని ఔట్‌ చేసి భారత్‌కు ఉపశమనాన్ని అందించింది. తర్వాత క్రీజులోకి వచ్చిన మెక్‌గ్రాత్‌తో కలిసి బెత్‌ మూనీ ఇన్నింగ్స్‌ని ముందుకు తీసుకెళ్లి ఆసీస్‌కు విజయాన్ని అందించింది.

భారత్‌ ఇన్నింగ్స్‌లో దీప్తి శర్మ (36;15 బంతుల్లో 8 ఫోర్లు), రీచా ఘోష్‌ (36; 20 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఓపెనర్‌ షెఫాలీ వర్మ (21; 10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడగా..  స్మృతి మంధాన (28; 22 బంతుల్లో 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. జెమీమా రోడ్రిగ్స్‌ (0) నిరాశపర్చగా.. హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (21), దేవికా వైద్య (24) పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఎల్లీస్ పెర్రీ రెండు వికెట్లు పడగొట్టగా.. కిమ్ గార్త్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్ తలో వికెట్ తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని