PV Sindhu: తల్లిదండ్రులు క్రీడాకారులు కావడం నా అదృష్టం

తల్లిదండ్రులు క్రీడాకారులు కావడం తనకెంతో కలిసొచ్చిందని దీన్నొక గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి.సింధు మీడియాకు తెలిపింది. తను ఓటమి చవిచూసినపుడు వారెంతో ప్రోత్సాహం అందించారని.. క్రీడల్లో గెలుపోటముల గురించి వారికి బాగా తెలుసునని పేర్కొంది.

Published : 15 Aug 2021 02:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తల్లిదండ్రులు క్రీడాకారులు కావడం తనకెంతో కలిసొచ్చిందని దీన్నొక గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి.సింధు మీడియాకు తెలిపింది. తను ఓటమి చవిచూసినపుడు వారెంతో ప్రోత్సాహం అందించారని.. క్రీడల్లో గెలుపోటముల గురించి వారికి బాగా తెలుసునని పేర్కొంది. ఈ సందర్భంగా వరుస ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన సింధు తన తల్లిదండ్రుల గురించి ఆసక్తికరమైన విషయాలను మీడియా ముందు వెల్లడించింది. ‘క్రీడాకారులైన నా తల్లిదండ్రుల నుంచి చాలా నేర్చుకున్నా.  ఓటమి ఎలా ఉంటుందో వారికి తెలుసు. వాళ్ల గతానుభవం నుంచి నాకు ఎంతో నేర్పించారు. అటువంటి తల్లిదండ్రులను నేను కలిగి ఉండడం నిజంగా అదృష్టం’ అని సింధు పేర్కొంది.

సింధు తండ్రి ఎంతో గొప్ప క్రీడాకారుడని తెలిపింది. ఆమె తండ్రి పీవీ రమణ మాజీ వాలీబాల్‌ ప్లేయర్‌. 1986 ఆసియన్‌ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత జట్టులో ఒక సభ్యుడిగా ఉన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా 2000ల్లో అర్జున అవార్డును ప్రభుత్వం అందజేసింది. ఆమె తల్లి విజయ కూడా వాలీబాల్‌ ప్లేయర్. ‘మా తల్లిదండ్రులు వాలీబాల్‌ ప్లేయర్స్‌ అయినప్పటికీ నేను బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ అవ్వాలనుకున్నాను. మా నాన్న హైదరాబాద్‌ రైల్వే గ్రౌండ్‌లో ఆడుతుంటే.. నేను పక్కనే ఉన్న బ్యాడ్మింటన్‌ స్టేడియంలో ఆడటం మొదలుపెట్టాను. అదే మెల్లిగా నాకు అభిరుచిగా మారింది. ఇది నా తల్లిదండ్రుల నాకు ఇచ్చింది కాదు’ అని వివరించింది. తాజా టోక్యో విశ్వక్రీడల్లో సింధు కాంస్యంతో మెరిసిందని అందరికీ తెలిసిందే. ఈ విజయం వెనుక కోచ్‌ పార్క్ పాత్ర ఎంతో ఉందని స్పష్టం చేసింది. ప్రధానిని కలవడానికి ఆయన ఎంతో ఉత్సాహంగా ఉన్నాడని తెలిపింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఒలింపిక్‌ క్రీడాకారుల్ని ప్రధాని కలవనున్నారని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని