Sri Lanka: గత పొట్టి కప్‌.. క్యాసినోకు శ్రీలంక ఆటగాళ్లు.. ప్యానెల్‌ దర్యాప్తులో కీలక విషయాలు

అంతకుముందు జరిగిన ఆసియా కప్‌ (Asia Cup)లో ఛాంపియన్‌గా అవతరించిన శ్రీలంక (Sri Lanka) .. టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2022) మాత్రం తేలిపోయింది. అయితే మైదానం వెలుపల ఆటగాళ్ల ప్రవర్తన మితీమిరినట్లుగా ఉందని తాజాగా స్వతంత్ర ప్యానెల్‌ దర్యాప్తులో వెల్లడైంది.

Published : 12 Jan 2023 17:35 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుతం శ్రీలంక క్రికెట్‌ జట్టు  భారత పర్యటనలో ఉంది. అయితే గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో తమ టీమ్‌ ఘోర వైఫల్యంపై స్వతంత్ర ప్యానెల్‌తో శ్రీలంక క్రికెట్ బోర్డు దర్యాప్తు చేయించింది. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆటగాళ్లు, అధికారులు, సహాయక సిబ్బంది.. ఇలా ప్రతి విషయంలో తప్పులు జరిగినట్లు నివేదికలో తేలింది. 

గతేడాది ఆసియా కప్‌ విజేతగా నిలిచిన శ్రీలంక జట్టుపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకొన్నారు. అయితే దారుణమైన ప్రదర్శనతో లీగ్‌ స్టేజ్‌లోనే లంక ఇంటిముఖం పట్టింది. అంతేకాకుండా ప్రపంచకప్‌ సమయంలోనే శ్రీలంక ఆటగాడు దనుష్క గుణతిలకపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం సంచలనం రేపింది. చమిక కరుణరత్నెతో సహా మరో ఆరుగురు సభ్యులు క్యాసినో ఆడేందుకు వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఆ సమయంలో ఫొటో తీయడానికి ఒకరు ప్రయత్నించగా.. నిరాకరిస్తూ కరుణరత్నె ఘర్షణకు దిగాడని 63 పేజీల నివేదికలో తేలింది. కరోనా పరిస్థితుల కారణంగా ఆస్ట్రేలియాలో రాత్రి 8.30 గంటల తర్వాత రెస్టారంట్లు మూసేస్తారు. దాంతో క్యాసినో జరిగే ప్రాంతానికి తమ ఆటగాళ్లు ఆహారం కోసం వెళ్లారని టీమ్‌ మేనేజర్ మహింద హలాంగోడ దర్యాప్తు అధికారులకు చెప్పారు.  అయితే మేనేజర్‌ వాదనను ప్యానెల్‌ అంగీకరించలేదని తెలిసింది. 

వారివి సొంత కార్యక్రమాలు..

శ్రీలంక క్రికెట్‌ బోర్డు మాజీ హై పర్మామన్స్‌ మేనేజర్‌ జెరోమె జయరత్నెకు టీ20 ప్రపంచకప్ స్క్వాడ్‌తో ఎలాంటి సంబంధాలు లేవు. అయినా సరే   మెల్‌బోర్న్‌లో 10 రోజులపాటు ఉండేందుకు 7వేల డాలర్లను బోర్డు చెల్లించింది. శ్రీలంక మాజీ అధ్యక్షుడు రాజపక్స కుటుంబానికి సమీప బంధువు కావడంతోనే ట్రిప్‌ కోసం సొమ్ము వెచ్చించినట్లు ప్యానెల్‌ గుర్తించింది. ఇక మాజీ కెప్టెన్‌ మహేల జయవర్థెనె ‘కన్సల్టెంట్ కోచ్‌’గా జట్టుతోపాటు బోర్డు ఖర్చులపైనే ఆస్ట్రేలియాకు వెళ్లాడు. కానీ , అక్కడ తన రెస్టారంట్‌ బ్రాంచ్‌ను ప్రారంభించుకొన్నట్లు తెలిసింది. 

స్పందించిన క్రీడల మంత్రి..

ఐదుగురితో కూడిన ప్యానెల్‌కు శ్రీలంక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కుశాల సరోజిని వీరవర్దెన నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంతోపాటు శ్రీలంక క్రికెట్‌ బోర్డుకు కీలక సూచనలు చేశారు.  నివేదికపై లంక క్రికెట్‌ బోర్డు ఇంకా స్పందించలేదు. అయితే శ్రీలంక క్రీడల మంత్రి రోషన్ రణసింగె స్పందిస్తూ.. నివేదికను పూర్తిస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకొంటామని వెల్లడించారు.

ప్యానెల్‌ సూచనలు ఇవీ..

* పూర్తిస్థాయి ఆడిట్‌ జరిపేందుకు క్రికెట్‌ బోర్డు దస్త్రాలను వెంటనే క్రీడల శాఖ సీజ్‌ చేయాలి.

* విదేశాలకు వెళ్లే ఆటగాళ్లు క్యాసినో వంటి గేమ్‌లకు వెళ్లకుండా నిషేధం విధించాలి. 

* క్రీడాకారులు ఉండే హోటళ్లకు వెళ్లేందుకు వారి భార్యలకు అనుమతి ఇవ్వాలి. దీని వల్ల క్రమశిక్షణలో ఉండే అవకాశం ఉంది.

* ఆటగాళ్ల శారీరక ఫిట్‌నెస్‌ విషయంలో మరిన్ని చర్యలు తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని