IND vs PAK: భారత్‌ - పాక్‌ టెస్టు సిరీస్‌.. అలాంటి ఉద్దేశం లేదన్న బీసీసీఐ!

వన్డేలు, టీ20ల్లో తలపడుతున్న భారత్ - పాకిస్థాన్‌ జట్ల మధ్య టెస్టు మ్యాచ్‌లను కూడా చూడాలని దాయాది దేశాల అభిమానుల ఆకాంక్ష. తాము నిర్వహించేందుకు సిద్ధమని మెల్‌బోర్న్‌ క్రికెట్‌ స్టేడియం సీఈవో పేర్కొనగా.. తాజాగా ఈ అంశంపై బీసీసీఐ స్పందించినట్లు సమాచారం.

Updated : 30 Dec 2022 20:00 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య టెస్టు సిరీస్‌ను నిర్వహించాలనే మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఆలోచనకు బీసీసీఐ ఇచ్చిన సమాధానం అడ్డుపడేలా ఉందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటి వరకు అలాంటి ఉద్దేశం లేదని, భవిష్యత్తులోనూ నిర్వహించే ప్రణాళిక లేదని పేర్కొంది. 

దాదాపు పదిహేనేళ్ల నుంచి భారత్ - పాక్‌ కలిసి టెస్టులను ఆడలేదు. ఐసీసీ టోర్నీల్లో వన్డేలు, టీ20ల్లో మాత్రమే తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ క్రికెట్‌ బోర్డులు, మైదానాల నిర్వాహకులు  భారత్‌-పాక్‌ మధ్య టెస్టు మ్యాచ్‌ నిర్వహించాలని ఉత్సుకత చూపిస్తున్నాయి. అయితే దేశాల స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో బీసీసీఐ కూడా ఎలాంటి ప్రణాళికలను తయారు చేయడం లేదు. 

‘‘ప్రస్తుతం లేదా భవిష్యత్తులో ఏ దేశంలోనైనా భారత్‌-పాక్‌ టెస్టు సిరీస్‌ నిర్వహించే ఉద్దేశం, ప్రణాళికలు కానీ లేవు. ఎవరికైనా అలాంటి ఆలోచనలు ఉంటే అవి మీ వద్దే పెట్టుకోండి’’ అని బీసీసీఐ ఘాటుగానే స్పందించింది. 2023 నుంచి 2027 భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళిక (ఎఫ్‌టీపీ)లో దాయాది దేశాల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లకు అవకాశం లేదు. ఆసియా కప్‌ 2023 టోర్నీకి పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇవ్వబోతోంది. భారత్‌లో వన్డే ప్రపంచ కప్‌ 2023 జరగనుంది. కానీ ఇరుజట్ల పర్యటన గురించి ఇంతవరకూ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని