IND vs AUS: భారత మైదానాల్లో ఉండేలా.. సిడ్నీ పిచ్‌ పరిస్థితులు: ప్యాట్ కమిన్స్

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ పిచ్‌లు ఫాస్ట్‌కు అనుకూలం. భారత్‌ సహా ఉపఖండ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా తయారు చేస్తుంటారు. అయితే దక్షిణాఫ్రికాతో మూడో టెస్టుకు మాత్రం ఆసీస్‌ సిడ్నీ మైదానాన్ని స్పిన్‌ పిచ్‌గా మార్పులు చేసింది. భారత్‌లో పర్యటన నేపథ్యంలో తమ ఆటగాళ్లకు ప్రాక్టీస్‌ కోసం ఇలా సమయాత్తం చేసింది.

Published : 04 Jan 2023 01:47 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఉపఖండ పిచ్‌లపై ఆడాలంటే ఇతర దేశాలకు కాస్త కష్టమే. స్పిన్‌ను తట్టుకొని ఆడి విజయం సాధిస్తే అద్భుతమనే చెప్పొచ్చు. ఇటీవల పాకిస్థాన్‌పై మూడు టెస్టుల సిరీస్‌ను 3-0తో ఇంగ్లాండ్ క్లీన్‌స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే. పాక్ గడ్డపైనే టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకొని అబ్బురపరిచింది. మరో నెలలో ఆస్ట్రేలియా భారత్‌లో పర్యటించనుంది. నాలుగు టెస్టుల సిరీస్‌ను ఆడేందుకు ఆసీస్‌ రానుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా తమ సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌ను ఆడుతోంది. ఇప్పటికే 2-0 తేడాతో టెస్టు సిరీస్‌తోపాటు వచ్చే జూన్‌లో జరిగే టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. సిడ్నీ వేదికగా బుధవారం నుంచి ఇరు జట్ల మధ్య మూడో టెస్టు జరగనుంది. ఈ క్రమంలో సిడ్నీ పిచ్‌ పరిస్థితులకు భారత్‌ మైదానాలకు దగ్గర సంబంధం ఉంటుందని ఆసీస్‌ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ తెలిపాడు. 

భారత్ పర్యటనను దృష్టిలో ఉంచుకొని సిడ్నీ పిచ్‌ను స్పిన్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండేలా ఆసీస్ జట్టు తయారు చేయించుకొన్నట్లు తెలుస్తోంది. ‘‘ఫాస్ట్‌  బౌలింగ్‌తోపాటు రివర్స్‌ స్వింగ్‌ వచ్చేలా పిచ్‌ను తయారు చేసుకున్నాం. అలాగే టర్నింగ్‌ కూడా ఎక్కువగా ఉండనుంది. ఇక్కడ మా బ్యాటర్లు తప్పకుండా మరింత స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనే అవకాశం ఉంది. గత టెస్టులతో పోలిస్తే సిడ్నీ మైదానంలో జరిగే మ్యాచ్‌కు కెప్టెన్సీ వ్యవహరించడం విభిన్నంగా ఉంటుంది’’ అని ప్యాట్ కమిన్స్‌ వెల్లడించాడు. 

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2021- 2023 సీజన్‌కు సంబంధించి పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో కొనసాగుతోంది. భారత్‌ రెండో స్థానంలో ఉంది. మార్చిలోపు తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడతాయి. లండన్‌లోని ఓవల్‌ మైదానం వేదికగా తుది పోరు ఉంటుంది. గతేడాది సౌథాంప్టన్‌లో జరిగిన తొలి టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో టీమ్‌ఇండియాపై న్యూజిలాండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని