Ollie Robinson got Virat Kohli: 4 లేదా 5వ స్టంప్‌ లైన్‌.. విరాట్‌పై మా వ్యూహమిదే

తన కెరీర్లో ఇప్పటి వరకు తీసిన అతిపెద్ద వికెట్‌ విరాట్‌ కోహ్లీదేనని ఇంగ్లాండ్‌ పేసర్‌ ఒలీ రాబిన్సన్‌ అంటున్నాడు. అతడిని పెవిలియన్‌ పంపించేందుకు నాలుగు లేదా ఐదో స్టంప్‌లైన్‌లో బంతులు వేశామని పేర్కొన్నాడు....

Published : 14 Aug 2021 01:13 IST

లండన్‌: తన కెరీర్లో ఇప్పటి వరకు తీసిన అతిపెద్ద వికెట్‌ విరాట్‌ కోహ్లీదేనని ఇంగ్లాండ్‌ పేసర్‌ ఒలీ రాబిన్సన్‌ అంటున్నాడు. అతడిని పెవిలియన్‌ పంపించేందుకు నాలుగు లేదా ఐదో స్టంప్‌లైన్‌లో బంతులు వేశామని పేర్కొన్నాడు. తాము కట్టుదిట్టంగా బంతులు వేసినా టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ మెరుగ్గా ఆడారని వెల్లడించాడు. రెండో టెస్టు తొలిరోజు ఆట ముగిసిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.

ట్రెంట్‌బ్రిడ్జ్‌ టెస్టులో రాబిన్సన్‌ ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. ఇక లార్డ్స్‌లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రెండో కొత్త బంతి తీసుకోగానే విరాట్‌ కోహ్లీ (42)ని ఔట్‌ చేశాడు. స్లిప్‌లో జోరూట్‌ క్యాచ్‌ అందుకున్నాడు.

‘ఇప్పటివరకు నేను తీసిన గొప్ప వికెట్‌ విరాట్‌ కోహ్లీదే. అందుకు సంతోషంగా ఉంది. ఇదో గొప్ప సందర్భం. నాలుగు-ఐదో స్టంప్‌లైన్‌లో సరైన లెంగ్త్‌లో బంతి విసరాలన్నదే మా ప్రణాళిక. అదృష్టవశాత్తు అది పనిచేసింది’ అని రాబిన్సన్‌ అన్నాడు.

తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్‌ శర్మ 83 పరుగులకు ఔటవ్వగా కేఎల్‌ రాహుల్‌ 127*తో అజేయంగా నిలిచాడు. ఉదయం చినుకులు పడటం, ఆకాశం మేఘావృతమవ్వడంతో జోరూట్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. స్వింగ్‌కు టీమ్‌ఇండియా ఇబ్బంది పడుతుందని భావించగా అలా జరగలేదు. ఇంగ్లాండే దెబ్బతింది.

‘మేం 10-15 అవకాశాలు చేజార్చుకున్నాం. త్వరగానే మేం 2-3 వికెట్లు పడగొట్టాల్సింది. పరిస్థితులు, వాతావరణం చూసి త్వరగానే మాకు వికెట్లు లభిస్తాయని అనుకున్నాం. రెండో రోజైనా అలా జరగాలని కోరుకుంటున్నా. మేం బాగానే బౌలింగ్‌ చేశాం. ఏదేమైనా టీమ్‌ఇండియా బ్యాటర్లు మెరుగ్గా ఆడారు. బ్యాటు అంచులకు తగిలేలా ఆడలేదు. మా స్వింగ్‌ సైతం అత్యుత్తమంగా లేదు. మేం వుబుల్‌ సీమ్‌కు ప్రయత్నించినా వికెట్‌ నెమ్మదిగా ఉండటంతో పాచిక పారలేదు. జిమ్మీతో కొత్త బంతి పంచుకోవడం ఆనందంగా ఉంది’ అని రాబిన్సన్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని