WTC Final: కీలక పోరులో భారత్ తడ‘బ్యాటు’.. రెండో రోజు ముగిసిన ఆట

ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్‌ విజయావకాశాలు దాదాపుగా మూసుకుపోయినట్లే. టీమ్‌ఇండియా పోరాటం ఇక డ్రా కోసమే. ఈ కీలక పోరులో  రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.

Updated : 08 Jun 2023 23:42 IST

లండన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్‌ విజయావకాశాలు దాదాపుగా మూసుకుపోయినట్లే. టీమ్‌ఇండియా పోరాటం ఇక డ్రా కోసమే. ఈ కీలక పోరులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. రహానె (29), కేఎస్ భరత్ (5) నాటౌట్‌గా ఉన్నారు. భారత్ ఇంకా 318 పరుగులు వెనుకంజలో ఉంది. ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో భారత్‌ టాప్‌ ఆర్డర్‌ పూర్తిగా విఫలమైంది. ఓపెనర్లు రోహిత్ (15), శుభ్‌మన్ గిల్ (13) నిరాశపర్చగా.. టెస్టు స్పెషలిస్టు చెతేశ్వర్ పుజారా (14) కూడా విఫలమయ్యాడు. ఆదుకుంటాడనుకున్న విరాట్ కోహ్లీ (14) తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టాడు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (48; 51 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడినా దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. ఆసీస్‌ బౌలర్లలో మిచెల్ స్టార్క్‌, పాట్ కమిన్స్‌, స్కాట్ బొలాండ్, కామెరూన్ గ్రీన్‌, నాథన్ లైయన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 469 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. 

భారత్‌కు ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే గట్టి షాక్‌లు తగిలాయి. రెండు ఫోర్లు బాది మంచి టచ్‌లో కనిపించిన రోహిత్‌ను కమిన్స్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. బొలాండ్‌ వేసిన తర్వాతి ఓవర్‌లోనే శుభ్‌మన్‌ గిల్‌ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. టీ విరామం అనంతరం చెతేశ్వర్‌ పుజారా కామెరూన్‌ గ్రీన్‌ బౌలింగ్‌లో వికెట్ పడేసుకున్నాడు. కొద్దిసేపటికే విరాట్ కోహ్లీ పెవిలియన్‌ చేరాడు. మిచెల్ స్టార్క్‌ బౌలింగ్‌లో ఎక్స్‌ ట్రా బౌన్స్‌తో వచ్చిన బంతిని ఆడి స్లిప్‌లో స్టీవ్‌ స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో టీమ్‌ఇండియా 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో రహానె, జడేజా క్రీజులో కుదురుకుని భారత్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. జడేజా దూకుడు ప్రదర్శించినా.. రహానె నెమ్మదిగా ఆడాడు. కమిన్స్‌ వేసిన 22 ఓవర్‌లో చివరి బంతికి రహానె వికెట్ల ముందు దొరికిపోగా.. రివ్యూ తీసుకోవడంతో ఆ బంతి నో బాల్‌గా తేలింది. రహానె బతికిపోయాడు. మరోవైపు.. జడేజా దూకుడు కొనసాగించాడు. బొలాండ్ వేసిన 32 ఓవర్లో ఓ ఫోర్ బాదిన అతడు.. మిచెల్ స్టార్క్‌ వేసిన 34 ఓవర్లో రెండు ఫోర్లు సహా 12 పరుగులు రాబట్టాడు. కానీ, జడేజా జోరుకు నాథన్‌ లైయన్‌ బ్రేకులు వేశాడు. లైయన్‌ బౌలింగ్‌లో జడ్డూ స్లిప్‌లో స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్‌ మ్యాచ్‌ గెలవడం దాదాపు అసాధ్యం. ఇక మన జట్టు పోరాటం డ్రా కోసమే. మ్యాచ్‌ డ్రా చేసుకోవాలంటే మూడో రోజు మొదటి సెషన్‌ భారత్‌కు కీలకం కానుంది. ఉదయం పూట పిచ్‌ అనుకూలిస్తుంది. ఆసీస్‌ పేసర్లను ఎదుర్కొని క్రీజులో నిలదొక్కుకోవడం భారత్ ఆటగాళ్లకు సవాలే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని