ఏ చలీ వణికించలేదు!

తూర్పు లద్దాఖ్‌లో గుడ్లురుముతున్న చైనాకు తన సత్తాను చాటేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధమైంది. ఎముకలు కొరికే చలికి సైతం తమను కదిలించే

Published : 28 Sep 2020 03:45 IST

అటు చైనాతో.. ఇటు శీతాకాలంతో పోరాటానికి భారత్‌ సిద్ధం
అధునాతన వసతులతో సరిహద్దుల్లో ప్రత్యేక ఆవాసాలు
తూర్పు లద్దాఖ్‌కు తరలిన టన్నుల ఆహారం, సామగ్రి

దిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో గుడ్లురుముతున్న చైనాకు తన సత్తాను చాటేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధమైంది. ఎముకలు కొరికే చలికి సైతం తమను కదిలించే దమ్ము లేదని చాటేందుకు సిద్ధమైంది. శీతాకాలం ఆరంభం కాగానే భారత సేన వెనుదిరుగుతుందన్న డ్రాగన్‌ అపోహలను పటాపంచలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఇందుకోసం మన బలగాలు చేపట్టిన అతిపెద్ద సైనిక సరఫరా ఆపరేషన్‌ దాదాపుగా పూర్తికావొస్తోంది. ఇందులో భాగంగా భారీ ట్యాంకులు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇంధనం, ఆహారం, శీతాకాల నిత్యావసరాలు ఎత్తయిన ప్రాంతాలకు తరలివెళ్లాయి. ఈ ఆపరేషన్‌ను సైన్యాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవణె వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు భారత్‌ అటు చైనాను, ఇటు హిమాలయ శీతాకాలాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది.
తూర్పు లద్దాఖ్‌లో చలికాలం ఆరంభమవుతోంది. అక్కడ.. చైనాతో సాగుతున్న వివాదం ఇప్పట్లో పరిష్కారమయ్యే అవకాశం లేకపోవడంతో శీతాకాలంలోనూ ఇదే సంఖ్యలో బలగాలను కొనసాగించాలని భారత సైన్యం నిర్ణయించింది. ఇక్కడ 50 వేల మందికిపైగా సైనికులు ఉన్నారు. వీరిని శీతాకాలంలో కొనసాగించడం ఆషామాషీ కాదు. ఇందుకోసం భారీగా సామగ్రి అవసరం. వీటిని మన సైన్యం.. అక్కడికి హుటాహుటిన తరలిస్తోంది. ఇందుకోసం జులై మధ్యలోనే ఆపరేషన్‌ ప్రారంభం కాగా.. అది ఇప్పుడు పూర్తికావొస్తోంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా భారత సైన్యం.. పెద్ద సంఖ్యలో టి-90, టి-72 ట్యాంకులు, శతఘ్నులు, పదాతిదళ పోరాట శకటాలను చుషుల్‌, దెమ్‌చోక్‌ సహా సున్నితమైన అన్ని ప్రాంతాలకూ తరలించింది. భారీగా శీతాకాల దుస్తులు, గుడారాలు, వేల టన్నుల ఆహార పదార్థాలు, కమ్యూనికేషన్‌ సాధనాలు, ఇంధనం, హీటర్లు, ఇతర సరఫరాలను.. సరిహద్దు శిబిరాలకు చేరవేసింది. వీటిలో కొన్ని.. సముద్రమట్టానికి 16 వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఈ ఆపరేషన్‌ కోసం భారత వాయుసేనలోని సి-130జె, సి-17 గ్లోబ్‌మాస్టర్‌ సహా అన్ని రవాణా విమానాలు, హెలికాప్టర్లను ఉపయోగించింది. స్వాతంత్య్రం తర్వాత లద్దాఖ్‌లో చేపట్టిన అతిపెద్ద ఆపరేషన్‌ ఇదేనని సీనియర్‌ సైనికాధికారి ఒకరు చెప్పారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా బారులు తీరిన యుద్ధట్యాంకులు, సాయుధ శకటాలు కనిపిస్తున్నాయి.


కఠోర వాతావరణం..

తూర్పు లద్దాఖ్‌లో అక్టోబర్‌ నుంచి జనవరి మధ్య ఉష్ణోగ్రతలు మైనస్‌ 5 నుంచి మైనస్‌ 35 డిగ్రీల సెల్సియస్‌ మేర ఉంటాయి. రాత్రివేళ పెనువేగంతో వీచే శీతల గాలులు.. మనిషిని నిలువునా గడ్డకట్టించేస్తాయి. అందువల్ల వాతావరణాన్ని తట్టుకోవడానికి శీతాకాల దుస్తులు, ఇతర ఉపకరణాలను ఐరోపా దేశాల నుంచి భారత్‌ దిగుమతి చేసుకుంది. తీవ్ర చలిగాలులను తట్టుకునేందుకు సరికొత్త ఆవాసాలు, ప్రిఫ్యాబ్రికేటెడ్‌ నిర్మాణాలను భారత సేన యుద్ధప్రాతిపదికన నిర్మిస్తోంది. వీటికి పెద్దగా సిమెంటు, ఇసుక అవసరం లేదు. వీటిని వేగంగా వినియోగానికి సిద్ధం చేయవచ్చు. బలమైన గాలులు, చలి నుంచి రక్షించేందుకు ఈ ఆవాసాల్లో ఇన్సులేషన్‌ ఉంటుంది. హీటింగ్‌ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వంట గది, మరుగుదొడ్లు వంటివీ ఇందులో ఉంటాయి. ఇందుకోసం అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు.


నిమిషాల్లోనే..

ఆదేశాలు అందిన నిమిషాల వ్యవధిలోనే.. చైనా వెంబడి ఉన్న వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్దకు దూసుకెళ్లే సామర్థ్యం భారత ట్యాంకు దళాలకు ఉంది. ఆగస్టు 29, 30 తేదీల్లో చైనాకు చెక్‌ పెట్టేందుకు భారత సేన.. పాంగాంగ్‌ సరస్సు దక్షిణ రేవులోని కీలక పర్వత ప్రాంతాలను తన ఆధీనంలోకి తీసుకున్నప్పుడు ఈ దళాలు తమ సత్తాను ప్రదర్శించాయి. నాడు మెరుపు వేగంతో ఎల్‌ఏసీ వద్దకు దూసుకెళ్లి, చైనా సైన్యాన్ని నిలువరించాయి.
‘‘సరైన శిక్షణ, శీతాకాలాన్ని ఎదుర్కొనే ప్రత్యేక దుస్తుల సరఫరా వల్ల సైనికుల పోరాట సన్నద్ధత పటిష్ఠంగా ఉంటుంది. ఫలితంగా స్వల్ప వ్యవధిలోనే వారు యుద్ధానికి సిద్ధంకాగలరు. సైనికులకు శిక్షణ, నైపుణ్యాలకు పదునుబెట్టే కార్యక్రమాలు శీతాకాలంలోనూ కొనసాగుతాయి’’ అని ఓ అధికారి తెలిపారు.


టీవీలూ సిద్ధం..

కుటుంబాలకు వేల కిలోమీటర్ల దూరంలో, ప్రతికూల వాతావరణంలో.. శత్రు సేనకు కూతవేటు దూరంలో విధులు నిర్వర్తించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇంత కఠోర పరిస్థితుల్లో పనిచేసే వీర జవాన్లకు కాస్తంత ఆటవిడుపు కోసం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీవీలు, సెట్‌టాప్‌ బాక్స్‌లను ఏర్పాటు చేస్తున్నారు. వీరికి అధిక కేలరీలు కలిగిన పోషకాహారాలను అందిస్తున్నారు.


పదును తగ్గని ఆయుధాలు

ఈ ప్రాంతంలో మన సైన్యం మోహరించిన టి-90, టి-72 ట్యాంకులు, ‘బీఎంపీ-2’ పదాతి దళ సాయుధ శకటాలు.. మైనస్‌ 40 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద కూడా పనిచేయగలవు. ప్రపంచంలో ఇలాంటి కఠోర వాతావరణంలో సాయుధ శకటాలను మోహరించిన ఏకైక దేశం భారత్‌. ఈ ట్యాంకులు, శకటాలు, భారీ తుపాకుల నిర్వహణ, మరమ్మతులు చాలా సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. నదులు దాటడం, అడ్డంకులను అధిగమించడం మన ట్యాంకు రెజిమెంట్లకు వెన్నతో పెట్టిన విద్య. ఇక్కడ సింధు నది ప్రవహిస్తోంది. ‘‘ఇలాంటి వాతావరణంలో పనిచేసిన అనుభవం మన యాంత్రిక పదాతి దళానికి ఉంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ సుదీర్ఘకాలం పోరాటం చేయగలదు’’ అని ఓ అధికారి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని