పెండింగ్‌ కేసులపై సీఐడీ నజర్‌

పోలీసుశాఖకు గుండెకాయ లాంటి సీఐడీకి పూర్వవైభవం తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనిలో భాగంగా తొలుత పెండింగ్‌ భారం తగ్గించుకోవాలని భావిస్తున్నారు.

Updated : 25 Jan 2023 04:13 IST

దస్త్రాల దుమ్ము దులుపుతున్నఅధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: పోలీసుశాఖకు గుండెకాయ లాంటి సీఐడీకి పూర్వవైభవం తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనిలో భాగంగా తొలుత పెండింగ్‌ భారం తగ్గించుకోవాలని భావిస్తున్నారు. పాత కేసుల బూజు దులుపుతున్నారు. కొత్త కేసుల నమోదును బాగా నియంత్రించడంతోపాటు వనరులన్నింటినీ పెండింగ్‌ కేసుల పరిష్కారంపై పెట్టనున్నారు. పోలీసుశాఖలో సీఐడీ విభాగం ప్రాధాన్యం ఎనలేనిది. రాష్ట్రవ్యాప్తంగా కీలకమైన కేసులన్నింటినీ దీనికే బదిలీ చేసేవారు.  మద్దెలచెర్వు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు భానును అరెస్టు చేసిందీ సీఐడీ అధికారులే. ఆమ్వే, అగ్రిగోల్డ్‌ వంటి కీలకమైన కేసులను సీఐడీ దర్యాప్తు జరిపింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత క్రమంగా సీఐడీ ప్రాధాన్యం తగ్గుతూ వస్తోంది. పలుకారణాల వల్ల పెండింగ్‌ కేసుల జాబితా పెరుగుతోంది. ఒక దశలో పరిస్థితి ఎలా తయారయిందంటే.. సీఐడీకి కేసు బదిలీ చేసినా, సీఐడీ కేసు నమోదు చేసినా ఎప్పటికీ దర్యాప్తు పూర్తికాదనే అభిప్రాయం నెలకొంది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సంచలనం సృష్టించిన ఎంసెట్‌ ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణం దర్యాప్తు పూర్తికావడానికి నాలుగేళ్లు పట్టింది. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ల కుంభకోణంపై కేసు నమోదు చేసి ఆరేళ్లు దాటినా ఇంకా దర్యాప్తు కొలిక్కి రాలేదు. బోధన్‌ వాణిజ్య పన్నుల విభాగంలో జరిగిన నకిలీ చలాన్ల కుంభకోణానిదీ ఇదే పరిస్థితి. అయిదేళ్లుగా దర్యాప్తు దశలోనే ఉంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2019లో 299 పెండింగ్‌ కేసులు ఉండగా 2021 నాటికి 245కు తీసుకొని రాగలిగారు. దాదాపు 225 కేసుల వరకూ పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో చాలావరకూ సగటున ఏడెనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నవే. 20 ఏళ్లనాటివి కూడా కొన్ని ఉన్నాయంటే అతిశయోక్తికాదు. ఈ భారాన్ని వదిలించుకునేందుకు సీఐడీ అధికారులు నడుం బిగించారు. ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేసుల జాబితాను తయారు చేసి, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసయినా కేసులను పరిష్కరించాలని అధికారులు కృతనిశ్చయంతో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని