విద్యుత్తు వాహన సంస్థలకు కేంద్రంగా రాష్ట్రం

జాతీయ, అంతర్జాతీయ విద్యుత్తు వాహన (ఈవీ) తయారీ సంస్థలకు రాష్ట్రం కేంద్రంగా నిలుస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు.

Published : 09 Feb 2023 03:56 IST

ఈ మొబిలిటీ షో ప్రారంభంలో మంత్రి కేటీఆర్‌

రాయదుర్గం, న్యూస్‌టుడే: జాతీయ, అంతర్జాతీయ విద్యుత్తు వాహన (ఈవీ) తయారీ సంస్థలకు రాష్ట్రం కేంద్రంగా నిలుస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. హైదరాబాద్‌ విద్యుత్‌ వాహనాల ప్రదర్శన (ఈ మొబిలిటీ షో)ను బుధవారం ఆయన మాదాపూర్‌ హైటెక్స్‌లో ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యుత్తు వాహనాల రంగంలో భారత్‌ స్వయం సమృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ‘‘తెలంగాణ ఉత్తమ పారిశ్రామిక విధానాల నేపథ్యంలో అధునాతన సాంకేతికతలో పెట్టుబడులకు హైదరాబాద్‌ కేంద్రంగా మారింది. ప్రగతిశీల విద్యుత్తు వాహన విధానాన్ని అమలు చేస్తూ ఈవీ రంగంలో భారత్‌లో అగ్రగామిగా నిలుస్తున్నాం. రాష్ట్రంలో బ్యాటరీ, వాటి విడిభాగాల తయారీ, బ్యాటరీ ఛార్జింగ్‌ స్టేషన్లు, ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలు, బస్సుల తయారీ సంస్థలను తీసుకురావడానికి సమగ్రమైన వ్యూహాలను అనుసరిస్తున్నాం. బ్యాటరీల్లో కీలకంగా నిలిచే లిథియం రిఫైనరీకి వడివడిగా అడుగులు వేస్తున్నాం. గత ఏడాది డిసెంబరులో రాష్ట్రంలో అమరరాజ సంస్థ కర్మాగారం ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఇటీవలే ఈవీల తయారీ, మౌలిక వసతులు, పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ)ని ప్రోత్సహించేందుకు తెలంగాణ మొబిలిటీ వ్యాలీ (టీఎంవీ)ని ప్రకటించాం’’ అని కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్ర ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రమోషన్‌ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర ఎలక్ట్రానిక్స్‌ సెమీ కండక్టర్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ డైరెక్టర్‌ సుజై కారంపురి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిట్రియోన్‌ ఈసీ3 మోడల్‌ విద్యుత్తు కారుతోపాటు క్వాంటం, హాప్‌ వోక్సో విద్యుత్‌ ద్విచక్ర వాహనాలను కేటీఆర్‌ ఆవిష్కరించారు. ప్రదర్శనలో వాణిజ్య, రవాణా విద్యుత్తు వాహనాలు, ఛార్జింగ్‌, మౌలిక సదుపాయాలు, ఈవీ విడిభాగాల తయారీ సంస్థలు, పలు అంకుర సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని