ముందుండి నడిపించారు
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో స్త్రీ సాధికారత కనిపించింది. న్యూదిల్లీలో రాజ్పథ్ మార్గంలో పరేడ్లో త్రివిధ దళాల్లో మనకు పెరుగుతున్న ప్రాధాన్యానికి కొందరు ప్రతీకగా నిలిచారు.
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో స్త్రీ సాధికారత కనిపించింది. న్యూదిల్లీలో రాజ్పథ్ మార్గంలో పరేడ్లో త్రివిధ దళాల్లో మనకు పెరుగుతున్న ప్రాధాన్యానికి కొందరు ప్రతీకగా నిలిచారు. ముందుండి నడిపించగల సత్తా తమకుందని చాటారు.
* లెఫ్టినెంట్ మనీషా బోరాది ఉత్తరాఖండ్లోని చంపావట్ దగ్గర చిన్న గ్రామం. అక్కడి నుంచి ఆర్మీలో చేరిన మొదటి అమ్మాయి. ఆమె కుటుంబం మూడు తరాలుగా దేశసేవలో ఉంది. తాత, తండ్రి తర్వాత ఆ వారసత్వాన్ని ఈమె అందుకుంది. సికింద్రాబాద్ ఆర్మీ స్కూల్లో పాఠశాల విద్య, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ పూర్తిచేసింది. తర్వాత సర్వీస్ సెలక్షన్ బోర్డు పరీక్ష రాసి, అర్హత సాధించింది. చెన్నైలో శిక్షణ తర్వాత బారాముల్లా, జమ్మూకశ్మీర్ల్లో చేసి ప్రస్తుతం లేహ్లో ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్లో తన సేవలనందిస్తోంది. ఈ ఏడాది ఆర్మీ డే రోజున పురుషుల ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ రెయిన్మెంట్ను నడిపి ఆ ఘనత సాధించిన మొదటి మహిళగా నిలిచింది. దాన్నే గణతంత్ర దినోత్సవ వేడుకల్లోనూ కొనసాగించింది.
* లెఫ్టినెంట్ శివంగీ సింగ్.. దేశంలోనే రాఫెల్ ఫైటర్ జెట్ను నడిపిన మొదటి మహిళా పైలట్ ఈమె. వారణాసికి చెందిన ఈమె ఇండియన్ ఏర్ఫోర్స్ (ఐఏఎఫ్) లో 2017లో చేరింది. ప్రస్తుతం అంబాలాలోని గోల్డెన్ ఆరోస్ స్క్వాడ్రాన్లో సేవలందిస్తోంది. గణతంత్ర వేడుకల్లో ఐఏఎఫ్ తరఫున పాల్గొంది. ఈ అవకాశం దక్కించుకున్న రెండో మహిళా ఫైటర్ పైలట్. గతంలో ఫ్లైట్ లెఫ్టినెంట్ భావనా కాంత్ మొదటిసారిగా దీనికి ప్రాతినిధ్యం వహించింది.
* భారతీయ నౌకాదళాన్ని ఈ ఏడాది లెఫ్టినెంట్ కమాండర్ ఆంచల్ శర్మ ముందుకు నడిపించింది. కార్పోరెట్ ఉద్యోగాన్ని, లక్షల జీతాన్ని పక్కన పెట్టి దేశసేవలోకి అడుగుపెట్టిందీమె. 2016 నుంచి భారతీయ నౌకాదళంలో సేవలందిస్తూ ఎన్నో పతకాలనూ అందుకుంది. ఈ ఏడాది తన విభాగం తరఫున 100 మందితో కూడిన సెయిలర్లు, ఆఫీసర్లకు సారథ్యం వహించి పెరేడ్లో ముందుకు నడిపింది.
* సరిహద్దు భద్రతా దళ మహిళా సిబ్బంది ‘సీమా భవాని’ బృందం మోటార్ సైకిళ్లతో ప్రదర్శన చేసింది. కదులుతున్న వాహనాలపై పలు విన్యాసాలు చేశారు. 2016లో ఏర్పడిన ఈ బృందం గతంలోనూ పెరేడ్లో పాల్గొంది. ఇది రెండోసారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.