Putin: రెండు దశాబ్దాలుగా ‘ఒకేఒక్కడు’.. ఐదోసారి అధికారానికి ‘సై’!
రష్యాలో రెండు దశాబ్దాలకుపైగా అధికారంలో కొనసాగుతూ దేశంలో ఎదురులేని నేతగా నిలిచిన పుతిన్.. 2036 వరకు అధ్యక్ష పదవిలో ఉండేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.
మాస్కో: రష్యా అధ్యక్ష ఎన్నికలను (Russia Presidential election) వచ్చే ఏడాది మార్చి 17న నిర్వహించాలని అక్కడి చట్టసభ సభ్యులు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు సిద్ధంగానే ఉన్నట్లు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (71) వెల్లడించారు. దీంతో ఆయన ఎన్నిక లాంఛనప్రాయమేనని తెలుస్తోంది. ఇలా రెండు దశాబ్దాలకుపైగా అధికారంలో కొనసాగుతూ దేశంలో ఎదురులేని నేతగా నిలిచిన పుతిన్ (Vladimir Putin).. 2036 వరకు ఆ పదవిలో ఉండేందుకు ఇదివరకే మార్గం సుగమం చేసుకున్నారు. ఈ క్రమంలో గడిచిన 24 ఏళ్లుగా ఆయన పాలనలో కొన్ని ముఖ్య ఘట్టాలను పరిశీలిస్తే..
- డిసెంబర్ 31, 1999: రష్యా అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు బోరిస్ యెల్ట్సిన్ సంచలన ప్రకటన చేశారు. ప్రధానిగా ఉన్న వ్లాదిమిర్ పుతిన్కు తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.
- మే 7, 2000: ఎన్నికల్లో 53శాతం ఓట్లతో తొలిసారి అధ్యక్ష బాధ్యతలు (అప్పట్లో కాలపరిమితి నాలుగేళ్లు) చేపట్టారు.
- అక్టోబర్ 23, 2002: చెచెన్యాకు చెందిన మిలిటెంట్లు మాస్కోలోని ఓ థియేటర్లో 850 మందిని బందీలుగా చేశారు. మూడు రోజుల తర్వాత రంగంలోకి దిగిన పుతిన్ సేనలు.. థియేటర్లోకి ఓ గ్యాస్ను పంపించాయి. దాంతో ఈ ఘటనకు ముగింపు పలికినప్పటికీ 130 మంది బందీలు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే, ఈ ఆపరేషన్ను సమర్థించుకున్న పుతిన్.. వందల మందిని రక్షించగలిగినట్లు చెప్పారు.
- అక్టోబర్ 25, 2003: రష్యాలో సంపన్నుడు, చమురు వ్యాపార దిగ్గజంగా పేరొందిన మిఖైల్ ఖొడొర్కొవొస్కి.. పుతిన్కు ప్రత్యర్థిగా భావించేవారు. అదే సమయంలో పన్ను ఎగవేత, మోసం కింద అరెస్టైన ఆయనకు పదేళ్ల జైలు శిక్ష పడింది. అనంతరం ఆయన ఆయిల్ కంపెనీలో ఎక్కువ భాగం ప్రభుత్వ సంస్థ స్వాధీనం చేసుకోగా.. మిగతాది కూల్చేశారు.
- మార్చి 14, 2004: పుతిన్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
- సెప్టెంబర్ 1, 2004: బెస్లాన్ నగరంలోని ఓ పాఠశాలను స్వాధీనం చేసుకున్న ఇస్లామిక్ ఉగ్రవాదులు.. పేలుళ్లు, దాడులకు తెగబడ్డారు. ఇందులో 300 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రాంతీయ నేతల అసమర్థతే కారణమని ఆరోపించిన పుతిన్.. ఆయా ప్రాంతాల్లో ఎన్నికకు బదులుగా గవర్నర్లను నియమించారు.
- ఫిబ్రవరి 10, 2007: అమెరికాతో సత్సంబంధాలకు ప్రయత్నాలు చేస్తోన్న వేళ.. మ్యూనిక్లో ఓ కాన్ఫరెన్స్లో పుతిన్ చేసిన ప్రసంగం ఇరు దేశాల సంబంధాలను మరింత దూరం చేసింది.
- మే 8, 2008: రాజ్యాంగం ప్రకారం వరుసగా మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టేందుకు వీలు లేదు. దాంతో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన దిమిత్రి మెద్విదేవ్.. పుతిన్ను ప్రధానిగా ఎన్నుకున్నారు.
- ఆగస్టు 8-12, 2008: జార్జియాతో రష్యా స్వల్పకాలిక యుద్ధం చేసింది. దీంతో వేర్పాటువాద అబ్ఖజియా, దక్షిణ ఒసేటియా ప్రాంతాలపై పట్టు సాధించింది.
- మార్చి 4, 2012: రష్యా అధ్యక్షుడిగా మూడోసారి పుతిన్ ఎన్నికయ్యారు. అధ్యక్షుడి పదవీకాలం ఆరేళ్లకు పెంచడం వంటి రాజ్యాంగ సవరణలు చేయడంతో ఇది సాధ్యమైంది.
- జూన్ 6, 2013: భార్య ల్యూడ్మిలాతో విడాకులు తీసుకుంటున్నట్లు అధికారిక టీవీలో పుతిన్ ప్రకటించారు.
- జులై 16, 2018: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పుతిన్ భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకోవడంతోనే ట్రంప్ గెలిచారనే వాదనలు వినిపించాయి. వీటిని ఇరువురు నేతలు ఖండించారు.
- జులై 1, 2020: మరో రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు వీలుగా రాజ్యాంగ సవరణ చేశారు. దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. ఈ రెఫరెండం ఆమోదంతో 2036 వరకు ఆయన పదవిలో ఉండేందుకు మార్గం సుగమం అయ్యింది.
- జనవరి 17, 2021: పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నావెల్నీని రష్యా అధికారులు అరెస్టు చేశారు. అనేక అభియోగాలపై ఆయనకు 19ఏళ్ల శిక్ష పడింది.
- ఫిబ్రవరి 24, 2022: ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర మొదలయ్యింది. ప్రత్యేక సైనికచర్య అని రష్యా చెప్పినప్పటికీ అది భీకర యుద్ధానికి దారితీసింది.
- సెప్టెంబర్ 30, 2023: ఉక్రెయిన్ దురాక్రమణ సమయంలో చిన్నారులను రష్యా తరలించి యుద్ధ నేరాలకు పాల్పడ్డారనే అభియోగాలతో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు పుతిన్పై అరెస్టు వారెంటు జారీ చేసింది.
- జూన్ 23, 2023: పుతిన్పై రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూపు అధినేత యెవ్గనీ ప్రిగోజిన్(62) తిరుగుబాటు చేశారు. చివరకు వెనక్కి తగ్గిన ఆయన సరిగ్గా రెండు నెలల తర్వాత (23 ఆగస్టు) విమాన ప్రమాదంలో మరణించాడు. పుతిన్కు అత్యంత సన్నిహితుడిగా పేరొందని ప్రిగోజిన్ మరణానికి పుతిన్ ఓ కారణమనే వార్తలు వినిపించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రణరంగంగా తైవాన్ పార్లమెంటు
ఓ బిల్లుపై చర్చ సందర్భంగా తైవాన్ పార్లమెంటులో అధికార, విపక్ష ఎంపీలు పరస్పర దాడులకు దిగారు. ఒకరినొకరు ఎత్తిపడేసి.. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. -
సింగపూర్లో మళ్లీ కొవిడ్ అలజడి
కొవిడ్-19 మహమ్మారి సింగపూర్లో మరోసారి కలకలం రేకెత్తిస్తోంది. ఈ నెల 5 నుంచి 11 మధ్య 25,900కుపైగా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఆంగ్ యె కుంగ్ తెలిపారు. -
సంక్షిప్త వార్తలు (4)
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం సంభవించింది. రోడ్డుపై వెళుతున్న మినీ ట్రక్కు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఓ ఉమ్మడి కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు సహా 14 మంది మృతి చెందారు. -
కిర్గిజ్స్థాన్లో విదేశీ విద్యార్థులపై మూకదాడులు
కిర్గిజ్స్థాన్లోని భారత విద్యార్థులను కేంద్రం అప్రమత్తం చేసింది. రాజధాని బిష్కెక్లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మూక హింస చెలరేగడంతో.. ఎవరూ బయటకు రావొద్దని సూచించింది.